Friday

పోటీల పండుగ...


వాకిళ్లను రంగుల మయం చేసి అందరినీ దగ్గరకు చేర్చి ఆడిపాడించే సంక్రాంతి సంబరాలు వచ్చేశాయి. ఈ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగే పోటీల గురించి ఓ సారి తెలుసుకుంటే పోలా..

తెలుగు వారితో పాటు తమిళులు, కన్నడిగులు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండుగను చాలా వైభవంగా చేసుకుంటారు. ఆటపాటలతో ఆనందంలో మునిగి తేలతారు. తమిళనాడులో జల్లికట్టు, ఒంగోలు గిత్తల పోటీలు, కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, గుజరాత్‌లో పతంగుల పోటీలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి.

జల్లికట్టు తమిళనాడు రాష్ట్రంలో మధురై సమీప ప్రాంతాల్లో జరిగే జల్లికట్టు క్రీడకు ఎంతో పేరుంది. ఈ పోటీల్లో పాల్గొని ఎద్దుల మదం అణచడానికి యువకులు తెగ ఉత్సాహపడుతుంటారు. ఆంబోతులు చూడ్డానికి ఎలా ఉన్నాసరే వాటికుండే శక్తి ఏనుగంత. వీటితో పోటీపడి ఓడించిన వారే ఆ గ్రామానికి హీరో. గెలిచిన వారికి నగదు బహుమానం కూడా ఉంటుంది. అందుకే ఎంతో మంది యువకులు తమ కండలకు పదును పెడుతుంటారు. ఈ క్రీడ చాలా ప్రమాదకరమైనది. ఏమాత్రం తేడా వచ్చిన ఎద్దు కొమ్ములతో ప్రాణాలు తీసేస్తుంది. ఇప్పుడు కాదు కానీ వెనుకటి కాలంలో గ్రామంలో యువకులెవరైనా పెళ్లి చేసుకోవాలంటే జల్లికట్టు పోటీల్లో విజేతగా నిలవాలని అమ్మాయి తండ్రి షరతు విధించేవారట. ఈ పోటీలు ఏటా సంక్రాంతి రోజు మధురై పక్కన పలమేడులో ప్రారంభమవుతాయి. మరుసటి రోజు అలగనల్లూర్‌లో జరుగుతాయి. ఇక అప్పటి నుంచి ఐదు నెలలపాటు అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి.

 ఒంగోలు గిత్తలు మన దగ్గర ఒంగోలు, చిత్తూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఏటా సంక్రాంతి సందర్భంగా ఎద్దుల పోటీలు పెద్ద ఎత్తున జరుగుతాయి. జల్లికట్టులాగే ఎద్దులతో తలపడటం, ఎద్దులే ఒకదానితో ఇంకోటి పోటీపడడం, ఎద్దుల పరుగు పందేలతో మంచి సందడి వాతావరణం ఉంటుంది.

కోడి పందేలు వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది. అయినా తూర్పు, పశ్చిమ, కృష్ణా ఇలా పలు జిల్లాలో కోడి పందేలు అనధికారికంగా జరుగుతుంటాయి. రెండు కోడిపుంజులను ముగ్గులోకి దింపి వాటిపై పందే లు కాస్తూ ఉంటారు. ఈ పుంజులు మామూలివి కావు. వీటికి పెట్టే ఆహారం మనం తినే ఆహారం కంటే బలమైనది. ఈ పుంజులు 5వేల నుంచి 50వేల రూపాయల ధర పలుకుతాయి. ఈ పుంజులను యజమానులు చాలా అపురూపంగా చూసుకుంటారు.

 చెకు గెడలతో పోటీ సంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగరవేయడం హిందూ సంస్కృతిలో భాగం. సంక్రాంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో పతంగుల పోటీలు వైభవంగా జరుగుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ప్రతి కుటుంబం ఈ పోటీల్లో తప్పకుండా పాల్గొనడం వల్ల ఇదో పెద్ద సంబరంగా మారిపోయింది. వీటిని చూడ్డానికి విదేశీయులు కూడా వస్తుంటారు. తమిళనాడులో పలు చోట్ల మగవారికి వంటలపోటీలు, చిన్నారులకు చెరకు గడల పోటీలు నిర్వహిస్తుంటారు. ఇచ్చిన సమయంలో ఎక్కువ చెరకు గెడలు లాగించిన చిన్నారిని విజేతగా ప్రకటించి బహుమతి ఇస్తారు.

0 comments:

Post a Comment