Sunday

"ఉల్లిగడ్డ"కు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు


వీరబ్రహ్మేంద్రుల వంటి మహాత్ములు " ఉల్లిగడ్డకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టేరయా "అని హెచ్చరించారు. సద్గురువు గూర్చి అన్వేషించేవారు జాగ్రత్త అని ఎరగక మోసగాడిని ఆశ్రయిస్తే అంధుడు మరో అంధుని చేయి పట్టుకుని నడచిన చందంగా అవుతుందని హెచ్చరించాయి శాస్త్రాలు.
శుష్కవాదాలతో ఆధ్యాత్మిక చర్చలు జరిపేవారు పెరుగుతారని భాగవతం చెబుతుంది. సాధకులు తక్కువ బోధకులెక్కువ. పుణ్యక్షేత్రాలన్నీ వ్యాపార్ర క్షేత్రాలుగా మారి ఆయా క్షేత్రాల పవిత్రత దెబ్బతిని దైవశక్తి అనుగ్రహ ప్రభావం అక్కడ తగ్గి పోతున్నది.

మరికొందరు మహారుషులు కనుక్కోలేని గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలు తమకు తెలుసనీ, కనుక తమ సిద్ధాంతాలే నిజమైన మార్గమని కొత్తరకం బోధనలు మొదలవుతున్నాయి. రామకృష్ణాది భగవదవతారాలను గూర్చి తమ స్వల్ప బుద్ధితో వ్యాఖ్యానిస్తూ ఆయా అవతారాలపట్ల మానవులలో భక్తిని క్షీణింపజేసి క్రమేపీ పతనమయ్యేందుకు తోడ్పడుతున్నాయి.
ఏది నిజమో ఏది అబద్దమో అర్థంగాక అసలు ఆథ్యాత్మిక పథమే అబద్దమని శారీరిక సుఖాలే ప్రధానమనమనీ, అదే నిజమనే భౌతికవాదమే ఖచ్చితమైనదనే భావన పెరిగిపోతుంది. తద్వారా కలి పురుషుని లక్ష్యం నెరవేరుతున్నది.

ప్రపంచం పతనావస్థకు చేరుకునేందుకు పరుగులు తీస్తోంది. కనులు విప్పి ఇకనైనా మానవుడు ధర్మమార్గం వైపు నడవకపోతే కలి పురుషుడు తన లక్ష్యాన్ని సుళువుగా నెరవేర్చుకునేందుకు మార్గం మరింత సుగమమవుతుంది.


source :-
templesdiary.com

0 comments:

Post a Comment