Wednesday

మార్చిలో సి-19 ఉపగ్రహ ప్రయోగం


 భారత అంతరిక్ష కేంద్రం (ఇస్రో) ద్వారా మార్చి నెలలో పీఎస్ఎల్‌వీ సి-19 రాడార్ శాటిలైట్ ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అంతరిక్ష శాస్త్రవేత్త ఎంవైఎస్ ప్రసాద్ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తన స్వగ్రామం మొగల్తూరులో బాల్య స్నేహితులను కలుసుకునేందుకు మంగళవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో సి-19 తొలి శాటిలైట్ రాడార్ అని, దీని ద్వారా రాత్రి పూట, దట్టమైన మబ్బులున్నప్పుడు సైతం ఛాయా చిత్రాలను తీయవచ్చని చెప్పారు. వర్షాలు, తుఫాను వంటి ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు కూడ ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి చిత్రాలను రూపొందిస్తుందన్నారు. దాదాపు రూ.375 కోట్ల వ్యయం కాగల ఈ ఉపగ్రహాన్ని అహ్మదాబాద్-బెంగళూర్ ఇస్రో సెంటర్లు సంయుక్తంగా నిర్వహిస్తాయని చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్ 12న ఇండియా, ఫ్రెంచి దేశాలు సంయుక్తంగా రూపొందించిన సి-18 విజయవంతంగా పనిచేస్తోందన్నారు. ఉద్యోగ విరమణ తరువాత మొగల్తూరులోనే స్థిరపడతానని, ఇక్కడి ఆత్మీయులను, స్నేహితులను కలిసేందుకు తరచూ వస్తున్నానని చెప్పారు. ఈ సమావేశంలో ఆయన మిత్రులు అనంతపల్లి రాధాకృష్ణ, మధరి సీతారామ్ పాల్గొన్నారు.

0 comments:

Post a Comment