Friday

ఇరాన్ ఇంధనం కీలకం


సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే చమురును ఇరాన్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ సముద్ర జలమార్గం హర్మోజ్ ద్వారా రవాణా చేస్తారు. ఇరాన్ చమురు ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలను అంతర్జాతీయ సమాజం ఆమోదిస్తే తమ జలాల గుండా ఒక్క చుక్క చమురును కూడా ముందుకు కదలనిచ్చేది లేదని ఇరాన్ హెచ్చరిందింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 

మద్య ప్రాచ్యంలో అమెరికా, దాని సన్నిహిత గల్ఫ్ దేశాలకు, ఇరాన్‌కు సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం నిలినీడలు అప్పుడే భారత్‌పై ప్రసరిస్తున్నాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం కారణాన మొత్తం ఇరాన్ వ్యాపారంపై ఆధారపడ్డ దుబాయి బక్కచిక్కుతోంది. దీంతో తన చమురు అవసరాలకు దుబాయిపై ఆధారపడే భారత్ కూడా ఆందోళన చెందుతోంది. 

మధ్యప్రాచ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలు చివరన ఉన్న ఇజ్రాయిల్ వరకు అన్నీ అమెరికాకు మిత్రదేశాలు. సిరియా, ఇరాన్‌లు మాత్రం ఇందుకు మినహాయింపు. షియా వర్గానికి చెందిన పాలకులు ఉన్న ఈ రెండు దేశాలు అమెరికా విధానాలకు బద్ధ వ్యతిరేకులు కాగా రాజకీయ, ధార్మిక విశ్వాసాల కారణాన అరబ్బు దేశాలతో కూడా వీటికి సఖ్యత లేదు. అందుకే సిరియాపై ఉక్కుపాదానికి అరబ్ లీగ్ కూటమి నడుం బిగించింది. బహ్రెయిన్‌లో సున్నీ శాఖకు చెందిన రాజుకు వ్యతిరేకంగా షియా తెగ ప్రజలను నిరసనలకు ఉరికొల్పడం, లెబనాన్‌లో సిరియా ద్వారా హరిరీను నియంత్రించడం, అఫ్ఘానిస్తాన్ తెగల పోరు కారణాల దృష్ట్యా సౌదీ అరేబియా, సరిహద్దు వివాదం కారణాన అబుదాబి ఇరాన్‌పై గుర్రుగా ఉన్నాయి. 

దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇరాన్‌పై దండయాత్ర చేయడానికి సహజంగా శ్వేత సౌధం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్‌పై ఆంక్షలకు శ్రీకారం చుడుతుండగా భారత్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ తమ అభీష్టాలతో సంబంధం లేకుండా దీనిలో పావులుగా మారుతున్నాయి. 

ఏడు చిన్న రాజ్యాల కూటమి యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో సర్వం ఒక్క రాజ్యమైన అబుదాబిది కాగా దుబాయితో సహా మిగిలిన ఆరురాజ్యాలు నిమిత్త మాత్రమే. అబుదాబి, ఇరాన్‌కు సరిహద్దు వివాదం కారణాన సంబంధాలు అంతగా లేవు. అదే దుబాయితో ఇరాన్‌కు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అసలు దుబాయి ఏమిరేట్ ఎదగడానికి కారణం ఇరాన్, భారత్‌లతో ఉన్న వాణిజ్య సంబంధాలు... ఈ రెండు దేశాలతో వ్యాపారం లేని దుబాయిని ఊహించడం కష్టమే. ఈ పరిస్థితులలో ఆర్థిక మాంద్యం దెబ్బతో దుబాయి ఘోరంగా దెబ్బతిన్నప్పుడు అబుదాబి రంగ ప్రవేశం చేసింది. 

దుబాయి రాజు శేఖ్ మొహ్మద్ మొఖ్తుంతో అబుదాబి రాజు శేఖ్ ఖలీఫాకు సంబంధాలు లేవు. అయినా అబుదాబి రాజు దుబాయి రాజుకు ఆర్థిక సహాయం చేసి ఆదుకొన్నారు. దానికి కృతజ్ఞతగా దుబాయి రాజు తాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించుకొన్న 160 అంతస్థుల సముదాయానికి బుర్జ్ అల్ ఖలీఫా అని నామకరణం చేశారు. దివాళా తీసిన దుబాయిని ఆర్థికంగా ఆదుకొన్న శేఖ్ ఖలీఫా దుబాయిని వ్యూహాత్మకంగా ఇరాన్ నుండి దూరం చేయడం మొదలుపెట్టారు. 

అబుదాబి రాజకుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కల్గిన ఫ్రాన్స్, అమెరికాలు, (ఇరాన్ విరోధి అయిన) సౌదీ అరేబియాల ఒత్తిడితో మొదలైన ఆర్థిక దిగ్బంధంలో ఇరాన్‌ను ఇరికించారు. అంతర్జాతీయంగా ఆంక్షలు అనేకం అమలులో ఉన్నప్పటికీ దుబాయి, ఇరాన్‌ల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాల కారణాన వీటిని అమలు చేయడం సాధ్యం కాదని అర్థం చేసుకొన్న ఈ దేశాలు దుబాయి నుంచి ఇరాన్‌కు జరిగే బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధించాయి. వాటి పర్యవేక్షణ బాధ్యతను అబుదాబిలోని కేంద్ర బ్యాంకుకు ఇచ్చాయి. దాని పర్యవసానం... అప్పటి వరకు యు.ఏ.ఇ. వ్యాపారంలో (90 శాతం దుబాయి కేంద్రంగా జరుగుతుంది) అగ్రభాగాన ఉన్న ఇరాన్ ఒక్కసారిగా వెనక్కి జరిగి భారత్ దాని స్థానాన్ని ఆక్రమించింది. 

దుబాయి వ్యాపార లింక్ తెగిపోవడంతో ఇరాన్ రియాళ్ పతనం ప్రారంభమైంది. అంతర్జాతీయ సమాజం సాధించలేని పనిని వ్యూహాత్మకంగా అబుదాబి ఏమిరేట్ చేసిపెట్టింది. ఇక ఇరాన్‌తో భారత్‌కు చారిత్రక సంబంధాలు ఉండడమే కాక ప్రతి నెల 5 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒక కోటి 20 లక్షల పీపాల చొప్పున చమురును దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. పైగా సౌదీ ఆరేబియా తరహా నగదు డాలర్ విధానంతో కాకుండా రూపాయి మారకంలో ఉద్దెర చమురు చెల్లింపులను స్వీకరిస్తూ ఇరాన్ భారత్‌కు నిజమైన మిత్రదేశంగా నిలిచింది. ఇప్పుడు ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణాన సౌదీ అరేబియా నుండి అదనపు చమురును అధిక ధరలకు కొనుగోలు చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇతర సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

మంగళూర్ రిఫైనరీకి ఇరాన్ ప్రతిరోజూ లక్షన్నర పీపాల చమురు సరఫరా చేయగా సౌదీ మాత్రం కేవలం 20వేల పీపాల చమురు సరఫరా చేయడానికి అంగీకరించింది. భారత్ పెట్రోలియంకు చమురు విక్రయించడానికి సౌదీ, అబుదాబిలు నిరాకరించడంతో గల్ఫ్ మార్కెట్లలో అధిక ధరలకు చమురు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. అంతకు ముందు అమెరికా, గల్ఫ్ దేశాల ఒత్తిడి కారణాన ఇరాన్‌తో చౌక ధరకు లభించే గ్యాస్ సరఫరా పైపు లైను ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. ఈ పైప్‌లైన్ కోసం కృషి చేసిన అప్పటి పెట్రోలియం మంత్రి మణిశంకర్ అయ్యర్‌ను కూడా ఆ శాఖను కోల్పోవడంలో అమెరికా ఒత్తిడి ఉంది. 

సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే చమురును ఇరాన్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ సముద్ర జలమార్గం హర్మోజ్ ద్వారా రవాణా చేస్తారు. అక్కడ అమెరికా, ఫ్రాన్స్ యుద్ధ నౌకలు గల్ఫ్ నౌకాదళాలకు శిక్షణ పేరిట గస్తీ తిరుగుతుంటాయి. ఇరాన్ చమురు ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలను అంతర్జాతీయ సమాజం ఆమోదిస్తే తమ జలాల గుండా ఒక్క చుక్క చమురును కూడా ముందుకు కదలనిచ్చేది లేదని ఇరాన్ హెచ్చరిందింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

0 comments:

Post a Comment