Friday

అన్నా, మీడియా


అన్నా ఉద్యమానికి లభించిన ఆవేశపూరిత ప్రచారమే తమ ప్రధాన ఆయుధంగా టీమ్ అన్నా భావించింది. ప్రజాస్వామిక రాజకీయాలు పదే పదే పునః ప్రసారమయ్యే టెలివిజన్ సీరియల్ కాదని, క్రమరహితమైన సంప్రతింపులు, రాజీ ప్రక్రియ అన్న వాస్తవాన్ని అన్నా బృందం మరచిపోయింది. దృఢ వైఖరి కల నాయకులు ఉద్యమ కోలాహలంలో కొట్టుకుపోరు ; వివేకవంతమైన పౌర సమాజం టీవీ కెమెరాలకు ఆవల చట్ట బద్ధతకు ప్రయత్నిస్తుంది. 

ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం పొందుతోన్న వారు తరచు వాటి ద్వారానే పరిసమాప్తమవుతారు. సిఎన్ ఎన్-ఐబిఎన్ 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' (2011) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అన్నా హజారే తన ఉత్థానానికి ప్రసార మాధ్యమాలే కారణమని నిజాయితీగా అంగీకరించారు. 'మహారాష్ట్రలో ఒక ప్రాంతీయ స్థాయి ప్రముఖుడినైన నేను జాతీయ స్థాయిలో విఖ్యాతుడిని కావడానికి ప్రసార మాధ్యమాలే ప్రధాన కారణమని' ఆయన అన్నారు. 'మీ కెమెరాలు ఎల్లవేళల నన్ను అనుసరిస్తూ ఉండకపోతే నా గురించి ఎవరికి తెలిసే'దని అన్నా వినయంగా ప్రశ్నించారు.

మరి అవే ప్రసార మాధ్యమాలు, ముంబైలో అన్నా దీక్షకు ప్రజాస్పందన కొరవడిన వైనాన్ని, అవినీతి నిర్మూలనకు ఆయన నిర్వహించిన ఉద్యమం ఎలా కాంగ్రెస్ వ్యతిరేక ఆందోళనగా పరిణమించింది, ప్రభుత్వానికి బెదిరింపులుగా ఆయన నిరశన దీక్షలు ఎలా పరిణమించిందీ ఇత్యాది విషయాలపై విశ్లేషణాత్మకమైన కథనాలను నేడు నివేదిస్తున్నాయి. అన్నా హజారే ఒక 'ఫ్రాంకెన్‌స్టెయిన్ రాక్షసుడ'ని అన్నాను మణి శంకర్ అయ్యర్ ఇటీవల అభివర్ణించారు. పలువురు రాజకీయవేత్తలు అయ్యర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. అవినీతి నిర్మూలనకు సాహసించిన ఈ యోధుడు వాస్తవానికి ప్రసార మాధ్యమాల సృష్టి అని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమించారని వారు విశ్వసిస్తున్నారు. అయితే 'దిగివచ్చిన మహాత్ముడు'గా జన హృదయాలలో అన్నా వెలుగొందడానికి ప్రసార మాధ్యమాలే నిజంగా కారణమా? ఆయన దీక్షలకు వాటి మితిమీరిన ప్రచారమే అందుకు దారితీసిందా? 

గత తొమ్మిది నెలలుగా అన్నా హజారే సలహాదారులు ప్రసార మాధ్యమాలను చాలా తెలివిగా ఉపయోగించుకున్నారనడంలో సందేహం లేదు. ప్రైమ్ టైమ్ ప్రెస్ మీట్‌లు, టీవీ ఛానెల్స్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన ప్రదర్శనలు, సామాజిక నెట్ వర్కింగ్ ఉద్యమాలు... తన ఉద్యమ కార్యకలాపాలకు లభించిన సంతృప్తకరమైన మీడియా ప్రచారం నుంచి అన్నా లబ్ధి పొందారు. అవును, ఆ ప్రచారంలో కొంత అతిగా ఉంది; అవును, పాత్రికేయులు కొంతమంది అన్నాకు ఎనలేని ప్రోత్సాహం, మద్దతునిచ్చారు. ఇంత మాత్రాన అన్నా కేవలం ఒక మీడియా సంఘటనగా భావించడమంటే వీధులలోని ప్రజల మానసిక స్థితిని తప్పుగా అర్థం చేసుకోవడమే సుమా! అన్నా దీక్షా స్థలిలో టీవీ కెమెరాలు ఉండడం వల్లే జనసందోహం అక్కడ గుమిగూడలేదు. అనేకానేక అవినీతి కుంభకోణాలతో నైతికంగా భ్రష్టమైన రాజకీయ నాయకత్వానికి ప్రతివాదనగా కన్పించినందునే అన్నాను ప్రజలు విశ్వసించారు. 

గత ఏప్రిల్‌లో అన్నా మొట్ట మొదటిసారి మన జాతీయ రాజధానికి వచ్చారు. జంతర్ మంతర్ వద్ద తొలి నిరశన దీక్షకు ఉపక్రమించే ముందు న్యూఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమావేశానికి పాత్రికేయులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. వచ్చిన వారు సైతం 'ఎవరీ పెద్ద మనిషి' అన్న ఆసక్తితో వచ్చిన వారే. అప్పటికీ జాతీయ మీడియాకు ఆయన కుతూహలం కల్గించిన వ్యక్తిగానే మిగిలిపోయారు. 

అన్నా దీక్ష ప్రారంభం కాకముందే లోక్ పాల్‌పై మంత్రుల బృందం నుంచి శరద్ పవార్ వైదొలిగారు. తద్వారా 'అవినీతిపరుడైన పవార్ అవినీతి వ్యతిరేక చట్ట నిర్మాణ సంఘంలో సభ్యడెలా అవుతారన్న' అన్నా వాదన సబబైనదేనని రుజువయింది. రెండు రోజుల అనంతరం, పటిష్ట లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను రూపొందించేందుకై ఒక సంయుక్త సంఘాన్ని నియమించనున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో, అన్నా ఉద్యమానికి మరింత ప్రోత్సాహం, మద్దతు లభించాయి. ఆ సంయుక్త సంఘంలో 50-50 నిష్పత్తిలో, అప్పటికే ఒక విశిష్టత సంతరించుకున్న 'టీమ్ అన్నా' ప్రతినిధులు, కేంద్రమంత్రులు ఉంటారని కూడా ప్రభుత్వం ప్రకటించింది. 

2011 ఏప్రిల్ 9 వరకు, అవినీతి వ్యతిరేక చట్టంపై జరుగుతోన్న చర్చలో పాల్గొంటున్న వారిలో అన్నా కేవలం ఒకరు మాత్రమే. లోక్‌పాల్ కమిటీలో ఆయన నియమించే సభ్యలతో చర్చలు జరపడానికి ప్రభుత్వం అంగీకరించడంతో, అన్నాకు, టీమ్ అన్నాకు, 'పౌర సమాజపు' ప్రతినిధులుగా అధికారిక గుర్తింపు లభించింది. దీంతో, లోక్‌పాల్ చట్టం కోసం చాలా కాలంగా కృషి చేస్తున్న అరుణా రాయ్, జయప్రకాశ్ నారాయణ్ (లోక్‌సత్తా) మొదలైనవారి కంటే అన్నాకే ప్రాధాన్యం పెరిగిపోయింది. టీమ్ అన్నాను పౌర సమాజ ప్రత్యేక ప్రతినిధులుగా గుర్తించమని ప్రభుత్వాన్ని మీడియా అడిగిందా? లేక ఎన్‌జిఓలు, వారి సహ ప్రయాణీకులను బుజ్జగించాలనే ప్రభుత్వ ఉద్దేశమే టీమ్ అన్నాకు లభించిన గుర్తింపులో ప్రతిబింబించిందా? ఏమైనా ఈ రాజకీయ పొరపాటుకు లోక్‌పాల్‌పై సంయుక్త సంఘంలో ప్రభుత్వ పక్షాన అందరినీ కాంగ్రెస్ మంత్రులనే నియమించారు. దీంతో ఆ చర్చలు ఒక విశాల సమ్మిళిత ప్రక్రియగా కాక కాంగ్రెస్, టీమ్ అన్నాల మధ్య సంప్రతింపులు మాత్రమే అయ్యాయి. 

ఏప్రిల్ 9న సంభవించింది ఒక పెద్ద తప్పు అయితే, దరిమిలా జూన్ 5న చోటుచేసుకున్నది మరో పెద్ద పొరపాటు. ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి బాబా రామ్‌దేవ్ దీక్షా శిబిరంపై దాడిచేసి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళారు. నలుగురు సీనియర్ కేంద్రమంత్రులు బాబాకు స్వాగతం చెప్పడానికి స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళి 72 గంటలు పూర్తికాక ముందే ఆయన్ని ఇలా అరెస్ట్ చేయడం జరిగింది. తొలుత ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఒక విదేశీ ప్రభుత్వాధినేతలా బాబా రామ్‌దేవ్‌ను గౌరవించి, ఆ తరువాత ఆయన్ని ఒక నేరస్థుడుగా పరిగణించడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు ఒక తార్కాణంగా నిలిచిపోయింది. ఈ చర్య మన్మోహన్ ప్రభుత్వ విశ్వసనీయతను మరింతగా దెబ్బతీసింది. 

మూడో పొరపాటు (ఇది చాలా తీవ్రమైనది) ఆగస్టు 16న అన్నా హజారేను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం. రెండో నిరశన దీక్షకు అన్నా సిద్ధమవుతుండగా ఈ పరిణామం సంభవించింది. తొలుత దీక్షకు కూర్చునేందుకై ఆయనకు ఏ ప్రదేశమూ అందుబాటులో లేకుండా చేశారు. ఆ తరువాత ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. తద్వారా అవినీతి వ్యతిరేక ఉద్యమయోధుడు స్థాయి నుంచి అమర త్యాగం చేసిన మహాపురుషుడుగా పరిణమించడానికి ప్రభుత్వమే ఆస్కారం కల్పించింది. ఏప్రిల్‌లో అన్నా దీక్ష నిర్వహించినప్పుడు వేదికపై భారతమాత పోస్టర్ ఉన్నది. బాబా రామ్‌దేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు శ్రీ శ్రీ రవి శంకర్ మొదలైన వారు దీక్షా స్థలికి తరలి వచ్చి అన్నాకు మద్దతు తెలిపారు. ఆ తరువాత ఆగస్టులో రామ్‌లీలా మైదాన్‌లో దీక్షకు పూనుకున్నప్పుడు వేదికపై భారత మాత పోస్టర్ స్థానంలో మహాత్మా గాంధీ చిత్రపటం ఉన్నది. బాబా రామ్‌దేవ్ ఉనికే లేదు. శ్రీశ్రీ రవి శంకర్ కూడా అక్కడ కన్పించలేదు. 

అన్నా అరెస్ట్‌తో వేలాది ప్రజలు వీధుల్లోకివచ్చి తీవ్ర నిరసన తెలిపారు. అవినీతి వ్యతిరేక లోక్‌పాల్ (నిజానికి దీని గురించి వారికి తెల్సింది చాలా తక్కువ) కోపం కాదు ఈ నిరసన; అంతులేని అవినీతికి పాల్పడుతూ దురహంకారపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వవ్యవస్థ పట్ల నిరసనగానే ప్రజలు తమకు తాముగా వీధుల్లోకి వచ్చారు. ఆత్మ త్యాగి అయిన 'ఫకీర్' వలే ఆగ్రహపూరిత, అజ్ఞాత భారతీయునికి అన్నా హజారే ఒక 'రక్ష రేకు'గా భాసిల్లారు. 'ఐ యామ్ అన్నా' అని రాసి వున్న టోపీలు, టీ షర్ట్‌లతో వీధులోకి వచ్చిన యువ భారతీయులు అన్నా ఉద్యమానికి అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారు. 

రాలేగావ్ సిద్ధిలో పర్యావరణ పరిరక్షకుడుగా ప్రారంభమైన అన్నా ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ఒక జానపద వీరుడుగా పరిణమించారు. అన్నా నిరశన దీక్షను విరమింపచేసే ఆరాటంలో పార్లమెంటు ఆ ఉద్యమ తీవ్రతను, ఆరాటాన్ని గుర్తించామని, లోక్‌పాల్ చట్టాన్ని తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని ఒక తీర్మానం చేయడంతో అన్నా విజయం పరిపూర్ణమయింది. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న: అన్నాను అరెస్ట్ చేసేలా ప్రభుత్వాన్ని మీడియా ప్రోద్భలించిందా? లేక తీవ్ర ఆందోళనకు గురైన ప్రభుత్వం చేపట్టిన అహేతుక చర్యేనా అన్నా అరెస్ట్? 

ప్రభుత్వమూ, టీమ్ అన్నా రెండూ మాధ్యమాన్ని సందేశంగా పొరపడ్డాయని చెప్పక తప్పదు. తమ ఉద్యమానికి లభించిన ఆవేశపూరిత ప్రచారమే తమ ప్రధాన ఆయుధంగా టీమ్ అన్నా భావించింది. ప్రజాస్వామిక రాజకీయాలు పదే పదే పునః ప్రసారమయ్యే టెలివిజన్ సీరియల్ కాదని, క్రమరహితమైన సంప్రతింపులు, రాజీ ప్రక్రియ అన్న వాస్తవాన్ని అన్నా బృందం మరచిపోయింది. ఇక ప్రభుత్వం, అన్నా ఉద్యమ కోలాహలం మీడియా వాతావరణంలో భాగమని గుర్తించడంలో విఫలమయింది. 

దేశవ్యాప్తంగా మన మీడియా ప్రపంచంలో 350 ఛానెళ్లు, మరెన్నో వందల ఓబి వ్యాన్‌లు ఉన్నాయి. అన్నా ఉద్యమ ఆరాటాలనే కాదు, భవిష్యత్తులో ప్రజ్వరిల్లే నిరసన ఉద్యమాలను సైతం ప్రభుత్వానికి విన్పించే ధ్వని విస్తారకం మీడియా. దృఢ వైఖరి కల నాయకులు ఉద్యమ కోలాహలంలో కొట్టుకుపోరు; వివేకవంతమైన పౌర సమాజం టీవీ కెమెరాలకు ఆవల చట్టబద్ధతకు ప్రయత్నిస్తుంది.

0 comments:

Post a Comment