Monday

అమీర్ మిస్టర్ డిఫెరెంట్


"సత్యమేవ జయతే...'' ఎప్పుడో మండూక ఉపనిషత్తులో చెప్పిన మాట! కరెన్సీ నోట్ల మీద, కోర్టు గోడల మీద, మూడు సింహాల చిహ్నంలో కనిపించే మాట! ఇది అందరూ విన్నదే! అందరూ చూసిందే! ఇదే మాటను... ఇప్పుడు ఆయన వచ్చి చెబుతున్నారు! చెప్పడమే కాదు.. దేశమంతటా మార్మోగేలా నినదిస్తున్నారు. ఏం... ఆయన చెబితే వినాలా? ఎందరు చెప్పినా వినని వాళ్లు ఆయన చెప్పినంత మాత్రాన వింటారా? వింటారు! కొందరైనా వింటారు! కొందరైనా మారతారు. ఎందుకంటే, ఉపనిషత్తులనాటి మాటను ఇప్పుడు కొత్తగా చెబుతున్నది ఎవరో కాదు.. ఖాన్.. అమీర్‌ఖాన్. మిస్టర్ డిఫరెంట్. 

జో జీతా వహీ సికిందర్! ఔను... గెలిచిన వాడే మొనగాడు! అమీర్ ఖాన్ గెలిచాడు. వెండి తెరపై కథానాయకుడిగా గెలిచాడు. దర్శకునిగా, నిర్మాతగా కూడా గెలిచాడు. ఇప్పుడు... ఒక మనిషిగా కోట్లాది హృదయాలను గెలుస్తున్నాడు. బాలీవుడ్‌లో ఎంతో మంది నటీనటులున్నారు. వాళ్లలో చాలామంది వెండితెరపై మాత్రమే మెరుస్తుంటారు. అక్కడెక్కడో, దూరంగా ఆకాశంలో మెరుస్తూ కనిపిస్తారు. కానీ... అమీర్ ఖాన్ మన పక్కనే కనిపిస్తాడు. భూమ్మీదే మెరుస్తాడు. తారే జమీన్ పర్ అంటూ నేల మీదికి నక్షత్రాలను దించుతాడు. మన పక్కింటి కుర్రాడిలా ఆప్యాయంగా కనిపిస్తాడు.

అందుకే.. అమీర్ ఖాన్ ప్రత్యేకం. అందరికంటే ప్రత్యేకం. అందరూ నడుస్తారు. నువ్వూ నడుస్తావు. అందరూ ఎక్కడికి వెళతారో, నువ్వూ అక్కడికే వెళతావు! నువ్వో గుంపులో గోవిందయ్యవు! నలుగురిలో నారాయణవు! అమీర్ ఖాన్ స్టార్స్‌లో స్టార్‌లా కలిసిపోలేదు. నేను, నా సినిమాలు, నాకొచ్చే వందల కోట్ల రూపాయల పారితోషికం!... అంటూ వాటికే పరిమితం కాలేదు. కొంచెం పక్కకు జరిగాడు. ప్రత్యేకంగా మెరుస్తున్నాడు. ఇప్పుడు ఏ మ్యాగజైన్ తిప్పినా, ఛానల్‌లో చూసినా అమీర్ పేరు గొప్పగా వినిపిస్తోంది! మరి ఆయనలో ఏదో ఉన్నట్లే కదా! ఏదో కాదు! చాలానే ఉంది.

అమీర్ ఖాన్‌ను అంతగా పొగడాలా? ఏమిటంట ఆయన గొప్ప? అని బుగ్గలు నొక్కుకునే వాళ్లూ ఉండొచ్చు. ప్రతి మనిషి నుంచి ఎంతో కొంత మంచిని నేర్చుకోవచ్చు అనేది నిజమైతే... అమీర్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సినిమాల నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకోవచ్చనేది నిజమైతే... అమీర్ సినిమాల నుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు. అమీర్ వ్యక్తిత్వం, ఆయన తీసిన కొన్ని సినిమాలు... వ్యక్తిత్వ వికాస పాఠాలకు ప్రత్యేక పాఠ్యాంశాలు అవుతాయి. క్రికెట్‌ను పుట్టించిన బ్రిటిష్ వాళ్లను అదే క్రికెట్‌తో దెబ్బకొట్టే 'లగాన్' గుర్తుందా? అప్పటిదాకా హీరోగా మాత్రమే ఉన్న అమీర్ ప్రత్యేక ప్రస్థానం అక్కడి నుంచే మొదలైంది. డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ 'లగాన్' స్క్రిప్టు పట్టుకుని షారూఖ్ ఖాన్ వద్దకు వెళ్లారు. "దీనికి నేను కాదు. అమీరే పర్‌ఫెక్ట్'' అని అశుతోష్‌ను తిప్పి పంపాడు. కథ మొత్తం విన్నాక... అమీర్ ఓకే చెప్పాడు. ఇక... డైరెక్టర్ అశుతోష్ నిర్మాతల కోసం వేట ప్రారంభించాడు. "అబ్బే... ఇదేం కథ!'' అంటూ పెదవి విరిచారు కొందరు.

"ఈ కథతో సినిమా తీస్తే, అంతసేపు థియేటర్‌లలో జనం కూర్చోలేరు..'' అన్నారు ఇంకొందరు. "వామ్మో... ఇన్ని క్యారెక్టర్లు, ఇంత భారీ వ్యయం భరించలేం' అని చేతులెత్తేశారు నిర్మాతలు. ఇక, ఈ కథను తెరకెక్కించడం అసాధ్యం అని అశుతోష్ ఓ నిర్ణయానికి వచ్చాడు. అప్పుడే, అమీర్‌లోని నిర్మాత బయటికొచ్చాడు. "ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఈ సినిమా నేను తీస్తాను'' అంటూ ఆ సినిమాను తనే తీశాడు. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి వెలువడిన మొదటి సినిమా అది. గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరిగింది. అదే సమయంలో స్థానికులతో అమీర్‌కు బంధం ఏర్పడింది. లగాన్‌లో క్రికెట్ మ్యాచ్ ప్రేక్షకులుగా స్థానికులే కనిపిస్తారు.

షూటింగ్ గ్యాప్‌లో అమీర్ వాళ్లలో ఒకరిగా కలిసిపోయేవారు. వారు చెప్పింది వింటూ, తనూ కబుర్లు చెబుతూ... మధ్య మధ్యలో పాటలు పాడుతూ అలసటను మరిచిపోయేలా చేశారు. ఈ ప్రపంచంలో అందరికంటే ముందు ఈ సినిమాను మీకే చూపిస్తా అంటూ షూటింగ్ చివరి రోజున ప్రామిస్ చేశాడు. ఆ మాట ప్రకారం మళ్లీ వచ్చాడు. అందరికంటే ముందు వారికే సినిమా చూపించి శభాష్ అనిపించుకున్నాడు. దటీజ్ అమీర్!

తల్లిదండ్రులకు కనువిప్పు
డిస్లెక్సియా... ఇదొక మానసిక వ్యాధి. డిస్లెక్సియాతో బాధపడే పిల్లలు చదవడం, రాయడం, నేర్చుకోవడంలో మిగిలినవారి కంటే బాగా వెనుకబడతారు. ఇలాంటి పిల్లలను టీచర్లు అర్థం చేసుకోవాలి. పిల్లల మానసిక స్థాయికి వెళ్లి పాఠాలు చెప్పాలి. మానసిక వైద్యులకు మాత్రమే కాదు.. ఈ విషయం టీచర్లు అందరికీ తెలుసు. బీఈడీ, టీటీసీ చదివిన పట్టభద్రులకూ తెలుసు! అందరికీ తెలిసిన విషయాన్నే అమీర్ కొత్తగా చెప్పాడు. 'తారే జమీన్ పర్' అంటూ మెరుపులు మెరిపించాడు. ఇది దర్శకుడిగా అమీర్‌కు మొదటి సినిమా. 'వీడో శుద్ధ మొద్దు. వీడికి చదువు రాదు' అని పిల్లల్ని కసురుకునే ఉపాధ్యాయులకు దర్శకుడిగా అమీర్ చెప్పిన పాఠం! 'మావాడు పనికి రాకుండా పోతున్నాడు! ఏ పనికీ పనికిరాడు' అని వాపోయే తల్లిదండ్రులకు కనువిప్పు! ఇదే సినిమా కథ మరొకరి ముందుకు వెళ్లి ఉంటే...

పాతచింతకాయ పచ్చడి కింద పక్కన పడేసేవాళ్లు. 'ఆర్ట్ సినిమాలా ఉంది. కమర్షియల్‌గా పనికిరాదు' అని పెదవి విరిచేవారు. నిజమే... సినీ పండితుల లెక్కల ప్రకారం ఇది ఒక కళాత్మక సినిమా మాత్రమే. ఎందుకంటే... ఈ సినిమాలో హీరో వీరోచిత విన్యాసాలు చేయడు. అరకొర దుస్తులతో అలరించే హీరోయిన్ లేదు. డ్యూయెట్‌లు లేవు. ఇలా మెరిసి, అలా పేలే ఐటమ్ బాంబ్ అసలే లేదు. కానీ... గుండెను తడి చేసే మానవీయ దృశ్యాలున్నాయి. కళ్లు చెమర్చే భావోద్వేగం ఉంది. ఈ సినిమా ఒక అద్భుతమైన ఫీల్! ఈ ఆర్ట్ సినిమా అమీర్ చేతిలో పడ్డాక... కమర్షియల్‌గా కూడా హిట్ అయ్యింది. సినీ పండితుల ప్రశంసలు పొందింది.

దేశవ్యాప్తంగా ఎక్కడలేని పేరు తెచ్చిపెట్టింది. రైతుల ఆత్మహత్యలు- మీడియా- రాజకీయాల మీద వచ్చిన 'పిప్లీలైవ్'ను కూడా ఎంతో కష్టపడి తీశాడు అమీర్. ఈ స్క్రిప్టును ఓ పాత్రికేయురాలు రాసింది. ఆమె చాలాసార్లు అమీర్‌కు ఫోన్లు చేసినా మాట్లాడేందుకు అవకాశం దొరకలేదు. ఒక రోజు స్క్రిప్టు పట్టుకుని రమ్మన్నాడు అమీర్. కథ నచ్చింది. తనే నిర్మాతగా ఆదివాసీ నటులతో సినిమా తీసి అందరి మెప్పునూ పొందాడు.

దేశాన్వేషణ...
 'ఒక పని చేయక తప్పదా? అయితే... కష్టంగానో, ఇష్టంగానో చెయ్'... ఇది కొందరి ఫిలాసఫీ. ఇందులో రాజీ ధోరణి ఉంది.
'ఏదో ఒక పని కాదు! ఇంకెవరో చెప్పారని కాదు! నీకు ఇష్టమైన పనే చెయ్!' ఇది సక్సెస్ గ్యారెంటీ స్కీమ్! ఆత్మ సంతృప్తి బోనస్! ఇదే... '3 ఇడియట్స్' థీమ్! ఇందులోని సారాంశం కూడా ఒక పాఠమే! కుర్రాళ్లకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు... మొత్తం మన వ్యవస్థకు నేర్పే గుణపాఠమే! అమీర్ సినిమాల్లోనే ఇది ప్రత్యేకం. అంతేకాదు... అమీర్‌ఖాన్‌కూ ప్రత్యేకమే! 'రెమ్యునరేషన్ తీసుకున్నామా, సినిమాలో నటించామా'....అన్నది కాదు. అంతటితో అమీర్ కమిట్‌మెంట్ ఆగిపోదు. ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన దేశం నలుమూలలా కలియ తిరిగాడు. ఇది మంచి సినిమా బతకడం కోసం అమీర్ చేసిన 'దేశాన్వేషణ'. ఓ వృద్ధుడి వేషంలో వారణాసి వీధుల్లో ఆకట్టుకున్నాడు. పొడవాటి జులపాలు, ఒంటిపై టాటూలతో కోల్‌కతాకు వెళ్లాడు.

అహ్మదాబాద్‌లోని ఓ స్కూల్‌లో పిల్లలతో రోజంతా గడిపాడు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జైపూర్ దాకా వెళ్లొచ్చాడు. ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు ఏ కార్పొరేట్ ఆస్పత్రికో వెళ్లలేదు. అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ డాక్టర్ ఇంటి తలుపు తట్టాడు. మారు వేషాలతో తిరుగుతూ, జనంలో కలిసిపోయి తనను గుర్తించిన వారికి బహుమతులు అందించి, ఆశ్చర్యపరిచాడు. సినిమా ప్రమోషన్ కోసం అందరు హీరోల్లా ఏ విమానమో ఎక్కి, మల్టీప్లెక్స్‌ల్లో ప్రెస్‌మీట్‌లు పెట్టి అట్నుంచి అటే వెళ్లిపోయి ఉంటే... ఇప్పుడు 'సత్యమేవ జయతే' అనే టీవీ ప్రోగ్రాం ఉండేదే కాదు!

డిస్కవరింగ్ ది ఇండియన్స్...
 '3 ఇడియట్స్' కోసం అమీర్ చేసిన ప్రచార యాత్ర ఆయనకు అసలైన భారతావనిని చూపించింది. విలాసవంతమైన కారు అద్దంలో నుంచి చూస్తే కనిపించే దేశం వేరు... కాలు కిందపెట్టి జనంతో కలిసి నడిచినప్పుడు కనిపించే భారతం వేరు! అమీర్ రెండో కోవకు చెందిన భారతాన్ని చాలా దగ్గరగా చూశాడు. ఈ సినిమా ప్రచారం కోసం వయసుమీరిన పెద్దమనిషి వేషంలో ఆటోలో ప్రయాణించాడు. ఆ సమయంలోనే రామ్‌లఖన్ అనే ఆటోవాలా పరిచయం అయ్యాడు. ఈ మధ్యనే ఆ ఆటోవాల కొడుక్కు పెళ్లయింది. పెళ్లికి వస్తానని మాట ఇచ్చిన అమీర్ దాన్ని నిలబెట్టుకున్నారు. వారణాసిలో జరిగిన వివాహానికి వెళ్లి.. దంపతులను ఆశీర్వదించాడు.

3 ఇడియట్ ప్రచార అనుభవంతోనే.. 'ఏదో చేయాలి!' అని అప్పుడే అనుకున్నాడు. అమితాబ్ నుంచి రాఖీ సావంత్ దాకా టీవీల్లో 'షో' చేసిన వారే. కాకపోతే... అవన్నీ డబ్బులు, బహుమానాలు, గెంతులు, పాటలు, ప్రశ్నలకు సంబంధించినవే! 'స్టార్' నెట్‌వర్క్ ప్రతినిధి ఉదయ్ శంకర్ ఒకరోజు అమీర్ వద్దకు వచ్చాడు. 'మా ఛానల్‌లో గేమ్‌షో చేద్దామా సార్' అన్నాడు! 'చేయను' అని అమీర్ చెప్పేశాడు. 'ఇంకేదైనా సరే... మీకు ఇష్టమైనదే చేయండి!' అని ఉదయ్ అడిగాడు. 'ఇంకేదైనా' అనే ప్రశ్నకు అమీర్ చెప్పిన సమాధానమే 'సత్యమేవ జయతే!' 13 వారాలు... 13 సామాజిక సమస్యలు... ఒక్కో ఎపిసోడ్ 90 నిమిషాలు! ఇదీ ఈ కార్యక్రమ సారాంశం! ఒక్కో ఎపిసోడ్‌కు అమీర్ ఖాన్ తీసుకుంటున్న సొమ్ము అక్షరాలా మూడున్నర కోట్ల రూపాయలు.

ఇది ఒక ఎపిసోడ్‌కు మరెవరూ తీసుకోనంత సొమ్ము. 'గంటన్నరకు మూడన్నర కోట్లు! ఇది కూడా సమాజ సేవేనా?' అని అప్పుడే ఆడిపోసుకోకండి! దీని వెనుక అమీర్ నిరంతర ఆలోచన ఉంది. రెండేళ్ల శ్రమ ఉంది. ఏడాదిపాటు మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టాడు. మీరు గమనించారో లేదో! గత ఏడాదిగా అమీర్ కొత్త సినిమాల్లో నటించలేదు. కొత్త యాడ్స్‌లో కనిపించలేదు. బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే యాక్టర్ అమీర్ ఖాన్. అతను.. ఒక టీవీ ప్రోగామ్ కోసం ఏడాదిపాటు సినిమాలను వదులుకున్నాడు. "నా సంపాదన ఏడాదికి రూ.100 కోట్ల నుంచి 125 కోట్ల మధ్య ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం ఏడాదిగా మిగిలిన అన్ని పనులు పక్కనపెట్టాను. సామాజిక అంశాల కోసం వందకోట్లు వదులుకున్న వారిని చూపించండి!'' అంటూ విమర్శకులకు అమీర్ సూటిగా సమాధానమిచ్చాడు. అంటే అమీర్ ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉందన్నట్లేగా! మనిషి ఆలోచనా ధోరణి మారితే చాలు! చాలా సామాజిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

అమీర్ ఇలాంటి సమస్యలనే ఎంచుకున్నాడు. వాటిపై పూర్తిస్థాయి పరిశోధనే చేశాడు. దీనికోసం నెలల తరబడి తనకు తాను 'సత్యమేవ జయతే'కు అంకితమయ్యాడు. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేశంలో మూలమూలకూ తిరిగాడు. బాధితులతో స్వయం గా మాట్లాడాడు. వారి మాటను మనసుతో విన్నాడు. వారితోపాటు కంటతడి పెట్టాడు. ఆడ శిశువులను గర్భంలో ఉండగానే చంపేయడం... పసిపిల్లలపై లైంగిక అత్యాచారాలు... ఇలాంటివే అన్నీ. అమీర్ ఎంచుకున్న సమస్యలేవీ కొత్తవి కాదు. కొన్నేళ్లుగా మీడియాలో ప్రతి నిత్యం కనిపిస్తున్నవే. ప్రతి ఊరిలో జరుగుతున్నవే! చూడకుండా వెళ్లేవారు ఎందరో! చూసి 'అయ్యో..పాపం' అని వదిలేసేవారు ఎందరో. ఈ రెండు రకాలవార్ని ఆలోచింప చేసి... అసలు దోషులను మార్చడమే లక్ష్యంగా అమీర్ 'సత్యమేవ జయతే' అని నినదిస్తున్నాడు. "మన చుట్టూ చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అయ్యో పాపం అంటామే కానీ... అంతకుమించి జోక్యం చేసుకోం. ప్రభుత్వం అది చేయడలేదు, ఇది చేయడం లేదు అని వాపోతుంటాం.

ఈ ధోరణి మార్చేందుకు చేస్తున్న చిన్న ప్రయత్నమిది. ఎంతోకొంత మార్పు వచ్చినా సంతోషమే కదా'' అని అమీర్ అన్నాడు. 'మనం మారాలి' అని మనసును తాకేలా చెబుతున్నాడు. ఈ కార్యక్రమ రూపకల్పనే కాదు... ప్రసారంలోనూ ప్రత్యేకత ఉంది. ఒకే సమయంలో... అనేక భాషల్లో, అనేక ఛానళ్లలో ప్రసారం కావడం. అంతేకాదు... దూరదర్శన్‌లోనూ వస్తోంది. కేబుల్ టీవీ లేని ఊళ్లకు, ఉన్నా ఆ ఖర్చు భరించలేని ఇళ్లకు కూడా తన సందేశాన్ని వినిపించడమే అమీర్ ఉద్దేశం. 'సత్యమేవ జయతే' తొలి ఎపిసోడ్‌ను 9 కోట్ల మంది ప్రజలు తిలకించడం విశేషం.

అమీర్‌కు ఆకలి తెలియదు. పేదరికం తెలియదు. సినిమాలతో సంబంధం ఉన్న సంపన్నుల కుటుంబంలో పుట్టాడు. చిన్నతనంలోనే మేకప్ వేసుకున్నాడు. రంగుల ప్రపంచంలో పెరిగాడు. కానీ... మనిషికీ, సమాజానికీ మధ్య ఉండాల్సిన బంధాన్ని మాత్రం సజీవంగా ఉంచుకున్నాడు. అమీర్ నర్మదా బచావో ఆందోళన్‌కు మద్దతు తెలిపాడు. విద్యుత్‌ను పొదుపు చేయమని చెప్పే ఎర్త్ అవర్‌లో పాల్గొన్నాడు. అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నా హజారేతో గొంతు కలిపాడు. 'అతిథి దేవోభవ' అంటూ విదేశీ పర్యాటకుల పట్ల అమర్యాదగా వ్యవహరించే వారి కళ్లు తెరిపించాడు. 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' ప్రచారంలో భాగస్వామి అయ్యాడు. ఎన్నికల ముందు 'మంచి వారినే ఎన్నుకోండి!' అని ప్రచారం చేశా డు. పాఠశాలల్లోని మరుగుదొడ్లలో పరిశుభ్రత కోసం ఉద్యమించాడు. పిల్లల్లో పౌష్టికాహార లోపం సమస్య తీవ్రతను ఎత్తి చూపాడు. ఇవేవీ అమీర్ డబ్బుల కోసం చేసినవి కావు. అందుకే... అందరూ వేరు! అమీర్ వేరు! మరి... అమీర్‌ను ఏమని పిలవాలి? మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అనాలా? లేక.. మిస్టర్ డిఫరెంట్ అని పిలవాలా? మిస్టర్ పర్‌ఫెక్ట్‌లీ డిఫరెంట్ అనాలా!

సత్యమేవ 'జయ'తే...
* భ్రూణహత్యలపై ప్రసారమైన తొలి ఎపిసోడ్‌ను టీవీ ముందు కూర్చుని 9 కోట్ల మంది చూస్తే 'యూట్యూబ్'లో మొదటి రోజే లక్షన్నర మంది చూశారు.
* ఈ కార్యక్రమం మధ్యలో ప్రసారమయ్యే 10 సెకన్ల యాడ్ విలువ రూ.10 లక్షలు. ఐపీఎల్ యాడ్ రేట్ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.
* భ్రూణహత్య కేసుల్లో విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం అంగీకరించడం విశేషం.

ఒకే ఒక్కడు... అమీర్!
* ఒక ప్రాజెక్టు పూర్తయ్యాకే మరొకటి! ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడు.
* ఫిల్మ్‌ఫేర్ వంటి పత్రికలు, కమర్షియల్ సంస్థలు ఇచ్చే అవార్డులు తీసుకోడు. ఈ అవార్డులకు విశ్వసనీయత లేదన్నది అమీర్ అభిప్రాయం.
* ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో అమీర్ మైనపు బొమ్మ పెడతామంటే 'వద్దు' అంటూ సున్నితంగా తిరస్కరించాడు.

మార్పొస్తుందన్న ఆశతో...
* "భ్రూణ హత్యలపై తీసిన ఎపిసోడ్‌లో బాధితుల ఆవేదన వింటున్నప్పుడు చాలాసార్లు కంట తడిపెట్టాను. మూడు సందర్భాల్లో భోరున ఏడ్చాను. ఆ దృశ్యాలను ఎడిట్ చేశాం. ఎందుకంటే... నేను పది నిమిషాలు ఆగకుండా ఏడ్వడం మీరు చూడలేరు.''
* "నాకు ప్రేక్షకుడిగా మీ అప్పాయింట్‌మెంట్ ఇవ్వండి. ఆది వారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే సత్యమేవ జయతే కార్యక్రమం చూడండి. నాతో కలిసి ఒక్క అడుగు వేయండి.''
* "కడుపులో ఉన్నది ఆడ శిశువు అని తెలియగానే... 'తీసేయాలి' అనే ఆలోచన ఇంట్లోంచే పుడుతుంది. ప్రభుత్వం ప్రతి ఇంటిపై పోలీసు నిఘా పెట్టలేదు. చాలా సమస్యలున్నాయి. వీటిపై రోడ్లెక్కి ధర్నాలు చేయాలని నేను అనడం లేదు. మార్పు మన నుంచే మొదలుకావాలి''
* "నా స్టార్‌డమ్‌ను ప్రదర్శించేందుకో, నేను చెబితే వింటారనో ఈ కార్యక్రమం చేయడం లేదు. కానీ... 'అసలు ఏం చెబుతున్నాడో చూద్దాం' అని మాత్రం టీవీ ముందుకు వస్తారు. టీవీ మాధ్యమానికి ఉన్న శక్తి, మా టీమ్ చేసిన కృషి... ఇవన్నీ కలిసి ప్రతి ఇంటిలో మార్పు వస్తుందనే ఆశ మాత్రం నాలో ఉంది''.

0 comments:

Post a Comment