Monday

దళితుడి కాళ్లు చేతులు నరికివేత...!

దొంగతనం చేశారని ఫిర్యాదు చేసినందుకు కక్ష గట్టారు. గొడ్డళ్లతో దాడి చేసి ఓ దళిత యువకుడి కాళ్లు చేతులు నరికేశారు. బాధితుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని పగారీ బంగ్లా గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తన పొలంలో విద్యుత్ మీటర్ పోయిందని జగదీశ్ అనే 27 ఏళ్ల దళిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దొంగతనానికి పాల్పడింది అర్జున్ ఠాకూర్, శివ గుర్జార్, మదన్ అనే యువకులని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వారు జగదీశ్‌పై పగ పెంచుకున్నారు. 

అవకాశం కోసం ఎదురు చూసి .. గొడ్డళు,్ల పదునైన ఆయుధాలతో ఆదివారం జగదీశ్‌పై దాడి చేశారు. క్రూరంగా అతడి కాళ్లు చేతులు నరికేశారు. తీవ్రగాయాలపాలైన జగదీశ్‌ను భోపాల్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, అయితే నిందితులను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందన్నారు. కాగా ఈ ఘటనను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంతిలాల్ భూరియా తీవ్రంగా ఖండించారు. బాధితుడికి నెలకు రూ.5000 చొప్పున జీవితాంతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు.

0 comments:

Post a Comment