Monday

చిన్నారి గ్రంథాలయాలు...

'చదువంటే... తరగతి పుస్తకాలను బట్టీ పట్టి ఏడాదికి ఒక్కసారి తెల్ల కాగితాల్ని నల్లగా చేసేయడం; చుట్టుపక్కల ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు డిగ్రీలు చేతికి వస్తే చాలనుకోవడం; డిగ్రీలు వచ్చాక కళ్లముందు నిలిచే ఐదంకెల జీతం; విదేశీ ఉద్యోగం; కాదు. చదువంటే అసలు అర్థం - తరగతి పుస్తకాలతోపాటు సామాజిక విషయ పరిజ్ఞానం కలిగిఉండడమే' అంటోంది బ్రెడ్ సొసైటీ. దానికోసం ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక పరిజ్ఞానం కలిగించే పుస్తకాలతో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 140 లైబ్రరీలను నెలకొల్పారు.


"మా అమ్మ ప్రతీ ఏడాది ఆగస్టు 15వ తేదీని పండగలాగా చేసేది. ఆ రోజుకి ఎక్కడెక్కడ ఉన్న కుటుంబసభ్యులమంతా కృష్ణాజిల్లాలోని మా ఊరు ముదునూరుకి వె ళ్లి వేడుకల్లో పాల్గొనే వాళ్లం. అలా 1970లో జరిగిన ఆగస్టు పదిహేను వేడుకలకోసం అమెరికా నుంచి మా ఊరు వచ్చాను. నేను అమెరికా వెళ్లకముందు బాగున్న చేతివృత్తుల కుటుంబాలు కొన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కనిపించాయి. దానివల్ల ప్రతిభ ఉన్నప్పటికీ చదువు విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి వాళ్ల పిల్లలకు.

ఆ అడ్డంకుల్ని గట్టెక్కిచ్చేందుకు ప్రతిభ గల పేదవిద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను మా ఊళ్లో అమలుచేశాను. ఆ ఆలోచనే క్రమంగా పెరిగి 20 ఏళ్ల తర్వాత 1989లో బ్రెడ్ సొసైటీ (BREAD- Basic Research, Education and Development society) ఏర్పాటుకు దారితీసింది. దానిద్వారా ఆంధ్రరాష్ట్రమంతటా ప్రతిభావంతులైన పేదవిద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ప్రారంభించాం'' అని చెప్పారు దీని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నాగులపల్లి భాస్కర్‌రావు.

"మొదటి రెండేళ్లు చేతివృత్తుల కుటుంబాలకు చెందిన పిల్లలకు మాత్రమే ఇచ్చాం. తరువాత మా సొసైటీకి అగ్ర, నిమ్న కులాలనే తేడా లేకుండా దరఖాస్తులు వెల్లువెత్తాయి. అలా వచ్చిన వాటిలో ఒక్కో కుటుంబం పరిస్థితి చదువుతుంటే కడుపు తరుక్కుపోయింది. అప్పటినుంచి కుల, వర్గ భేదం లేకుండా స్కాలర్‌షిప్‌లు ఇచ్చాం. కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వమే ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకం వర్తింపచేయడంతో స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం తగ్గించాం. అయితే పాలిటెక్నిక్ కళాశాలల్లో బిసిలకు ఫీజు రీఇంబర్స్‌మెంట్ లేదు.

అలాంటి వాళ్లకు స్కాలర్‌షిప్ సాయం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. అయితే స్కాలర్‌షిప్‌లు ఇచ్చే శాతం తగ్గిపోవడంతో అప్పటివరకు స్కాలర్‌షిప్‌ల కోసం దాతలు ఇచ్చిన డబ్బు మా సొసైటీ దగ్గరే ఉండిపోయింది. ఆ డబ్బును ఎలా సద్వినియోగం చేయాలనుకుంటున్నప్పుడు అమెరికాలో ఎదురైన ఒక అనుభవం జ్ఞప్తికి వచ్చింది. అదే ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగించింది.

ఆవేశం ఆపుకోలేక చెంపదెబ్బ కొట్టాను
పిహెచ్‌డి చేసేందుకు 1965లో అమెరికా వెళ్లాను నేను. మా గదిలో ఔరంగాబాద్‌కి చెందిన గోల్డ్‌మెడలిస్టు కూడా ఉండేవాడు. అతను ఇంజనీరింగ్ చేసేందుకు అమెరికాకు వచ్చాడు. ఆ అబ్బాయి ఒకసారి 'మా దేశం గురించి చెప్పడానికి ఏముంటుంది? కనీసం సైకిల్ కూడా కనిపించదు' అంటూ దేశాన్ని తక్కువ చేస్తూ మాట్లాడాడు. వాస్తవానికి అప్పటికే మన దేశం సైకిళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. అవేవీ తెలియకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుండడంతో కోపం ఆగలేదు. 

లాగి చెంప మీద గట్టిగా ఒక దెబ్బ వేశాను. ఆవేశం ఆపుకోలేక కొట్టానే కాని ఆ తరువాత బాధపడ్డాను. ఆ అబ్బాయి ఎందుకలా మాట్లాడాడని ఆరా తీస్తే... అతను ఎలిమెంటరీ మొదలుకుని కాలేజి చదువు పూర్తయ్యే వరకు ఔరంగాబాద్ దాటి బయటకు రాలేదు. ఆ తరువాత నేరుగా అమెరికాకు వచ్చాడు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికీ చదువంటూ వెంటబడ్డారే తప్ప సామాజికాంశాల పట్ల విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయలేదని తెలిసింది. బాల్యంలో ఉన్నప్పుడు విషయపరిజ్ఞానం అలవడకపోతే ఎంత పెద్ద చదువులు చదివినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకు పైన చెప్పిన విషయమే నిదర్శనం.

అమెరికాలో నాకు ఎదురైన అనుభవం లాంటిదే ఇక్కడ కూడా నాకు మరోటి ఎదురైంది. పోయిన ఏడాది నేనొక ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్లాను. అక్కడ వాళ్లను 'క్రాప్ హాలిడే' గురించి అడిగాను. తెలియదన్నారు. సెన్సస్ (జనాభాలెక్కల) వివరాలు తెలుసా అని అడిగాను. దానికి కూడా తెలియదనే సమాధానమే ఇచ్చారు. దాంతో డిగ్రీలు అందుకునే చదువే తప్ప సామాజికాంశాల గురించి అవగాహన కలిగించే విద్య ఇప్పటికీ లభించడం లేదనే విషయం అర్థమైంది. 

ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఏడు నుంచి పద్నాలుగేళ్ల వయసులోపు పిల్లల బుర్ర ల్లో చదువుతో పాటు పలురకాల పుస్తకాలను చదివే అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎంతో మంచి ఫలితాలు పొందొచ్చు. దీనికోసమే ప్రతిభకలిగిన విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసే పని ప్రారంభించాం. మా ఊళ్లోని స్కూల్‌లో నాన్నగారి పేరుతో 'నాగులపల్లి సీతారామయ్య పిల్లల గ్రంథాలయం' ఏర్పాటుచేశాం. ఇలానే మిగతా జిల్లాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు నెలకొల్పాం.

బొమ్మల పుస్తకాలతో విజ్ఞానం
ఇందులో భాగంగా ఒక్కో స్కూల్‌కి ఆరువందల పుస్తకాలు, రెండు బీరువాలు ఇస్తున్నాం. సామాన్యశాస్త్రం, చర్రిత, భౌగోళిక శాస్త్రం, వీరగాథల వంటి పుస్తకాల్ని గ్రంథాలయాల్లో ఉంచుతున్నాం. బొమ్మలతో విషయాన్ని సరళంగా వివరించే పుస్తకాలివి. వీటిని లైబ్రరీ కోసం కేటాయించిన సమయంలోనే చదవాలనేమీ లేదు.

పిల్లలు వాటిని చక్కగా ఇంటికి పట్టుకెళ్లి చదువుకోవచ్చు. ఈ ప్రయత్నం మంచి ఫలితాల్నే ఇచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకి వలస తగ్గింది. 30 శాతం మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలల నుంచి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు కూడా. విద్యార్థులకి, ఉపాధ్యాయులకి మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో కూడా ఇవి బాగా ఉపయోగపడ్డాయి'' అని వివరించారు డాక్టర్ భాస్కర్‌రావు.

కిరణ్మయి
ఇప్పటికే మన రాష్ట్రంలో 140 గ్రంథాలయాల్ని ఏర్పాటుచేశాం. మరో 300 గ్రంథాలయాలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతీ గ్రంథాలయంలో 20 రకాల (జీవితచరిత్రలు, సామాన్యశాస్త్రం, క్రీడలు, సాహసాలు, భౌగోళికశాస్త్రం, సామాజిక, సామాన్య, చారిత్రక అంశాలతో కూడిన) పుస్తకాలు ఉంచుతున్నాం.

ప్రతిభ కోసం..
'నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్' పరీక్షల్లో ఆరు కంటే ఎక్కువ స్కాలర్‌షిప్‌లు పొందిన విద్యార్థులున్న పాఠశాలల్ని ఎంపిక చేసుకుని గ్రంథాలయాలు ఏర్పాటుచేస్తాం. ఇప్పటికే మన రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో 140 వీటిని ఏర్పాటుచేశాం. మిగతా జిల్లాల్లో మరో 300 గ్రంథాలయాలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతీ గ్రంథాలయంలో 20 రకాల (జీవితచరిత్రలు, సామాన్యశాస్త్రం, క్రీడలు, సాహసాలు, భౌగోళికశాస్త్రం, సామాజిక, సామాన్య, చారిత్రక అంశాలతో కూడిన) పుస్తకాలు ఉంచుతున్నాం.

పుస్తకాలు చదివేలా ప్రోత్సహించేందుకు వాళ్లను ఆ పుస్తకం గురించి రాయమంటున్నాం. బాగా రాసిన వాళ్లలో ముగ్గురిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తున్నాం. ఒకసారి అవార్డు గెలుచుకున్న వాళ్లకి మరోసారి అవకాశం ఉండదు. ఇలా చేయడం వల్ల చదవడం పట్ల ఆసక్తి కలగడంతోపాటు చదివే అలవాటు కూడా పెరుగుతుంది.

పిల్లలచేతే...
పుస్తకాల్ని చదివించే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్ని, ఉపాధ్యాయుల్ని కూడా సన్మానిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అదనంగా ఎన్నో పనులు ఉంటున్నాయి కాబట్టి మేము ఏర్పాటుచేసిన లైబ్రరీని పట్టించుకోమంటే వాళ్లకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని క్లాసులో బాధ్యతగా వ్యవహరించే పిల్లల్ని ఎంపికచేసుకుని వాళ్లకి శిక్షణ ఇమ్మన్నాం. పిల్లల ద్వారానే పిల్లలకి పుస్తకాలు ఇచ్చే ఏర్పాటుచేయమంటున్నాం. లైబ్రరీ పిరియడ్‌లో పుస్తకాలు చదవకపోయినా పర్వాలేదు. ఆ సమయంలో పుస్తకాలు ఎంపిక చేసుకుంటే చాలు. ఇంటికి పట్టుకెళ్తే ఆడుకున్నంతసేపు ఆడుకున్నా సమయం దొరికినప్పుడు కచ్చితంగా చదువుతారు.

సంక్రాంతి, వేసవి, దసరా సెలవుల్లో కూడా స్కూలు లైబ్రరీని పిల్లల చేత నడిపిస్తే వాళ్లకు మరింత వీలుగా ఉంటుంది. మేము చేస్తున్న ఈ పనిలో పుస్తక ప్రచురణకర్తల సాయం కూడా ఉంది. అలాగే పుస్తకాల రవాణా విషయంలో క్రాంతి ట్రాన్స్‌పోర్టు వాళ్లు 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇలా అందరి సాయంతో పిల్లల బుర్రలకు పదునుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. బ్రెడ్ సొసైటీ సెక్రటరీ
కాకాని రామ్మోహనరావు

0 comments:

Post a Comment