Tuesday

షార్జాలో మరో కంపెనీ మోసం

షార్జాలో తెలుగువారు పడుతున్న ఇబ్బందులు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆల్ ఖరన్ కంపెనీ చేసిన మోసంతో సుమారు 150 మంది తెలుగువారు రోడ్డున పడగా, తాజాగా గోల్డెన్ ఆరో కంపెనీలో జీతాలు అందక తెలుగువారు ఆకలితో అల్లాడుతున్న విషయం వెలుగు చూసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లోని షార్జాలోని గోల్డెన్ ఆరో కన్‌స్ట్రక్షన్ కంపెనీ గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవటంతో 92 మంది భారతీయ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. షార్జాకు 40 కి.మీ. దూరంలో ఉన్న అల్ సజ్జాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని లేబర్ క్యాంప్‌లో వీరు దుర్భరమైన జీవితం గడుపుతున్నారు.

గోల్డెన్ ఆరో కంపనీలో మన రాష్ట్రానికి చెందిన 10మందితో పాటు రాజస్థాన్‌కు చెందిన 76 మంది, కేరళకు చెందిన ఆరుగురు కార్మికులు ఉన్నారు. ఆరు మాసాలుగా కంపెనీ యాజమానులు వేతనాలు ఇవ్వకపోవటంతో తిండి లేక నానా యాతన పడుతున్నారు. షార్జా జైళ్ళలో మగ్గుతున్న భారతీయుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి మన రాష్ట్రం నుంచి వెళ్లిన ముగ్గురు ప్రతినిధుల బృందంతో మంగళవారం గోల్డెన్ కంపెనీకి బాధితులు వీరితో తమ గోడు చెప్పుకున్నారు. మైగ్రేంట్స్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు నారాయణ స్వామి, రఘురాం వల్లంశెట్టి, సురేందర్‌లతో పాటు ఎన్ఆర్ఐ సంఘ సేవకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డిలు కార్మికులను కలిశారు.

లేబర్ క్యాంప్ ఇసుక దిబ్బల మధ్యలో, అపరిశుభ్రమైన వాతావరణంలో కష్టాలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేకపోవటంతో తినడానికి కష్టంగా మారిందని, తెలిసినవారి వద్ద అప్పులు చేస్తూ పూట పూటకు సరుకులు కొనుక్కుంటున్నామని బాధితులు వివరించారు. బకాయి జీతాలు ఇప్పించి స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేయాలని వారు రాష్ట్ర బృందాన్ని వేడుకున్నారు.

0 comments:

Post a Comment