Friday

జపాన్‌లో అరుదైన లోహాలు మొబైల్ ఫోన్ల తయారీలో వాడే ఖనిజం అందుబాటులోకి! 240 ఏళ్లపాటు వీటిని వెలికితీసుకునే అవకాశం


 

ఆయిల్ నిక్షేపాలు అరబ్ దేశాల ప్రజల జీవన శైలినే మార్చేసాయి. ఇనుప ఖనిజం బళ్లారి చుట్టు పక్కల ప్రాంతాల తీరుతెన్నులు మార్చేసింది. ఇలా దేశాల, ప్రాంతాల రూపురేఖలను మార్చేసే గనులు అరుదుగా ఉంటాయి. అలాంటి గనిని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. టోక్యోకు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మినామిటోరిషిమా ద్వీపం సమీపంలో శాస్త్రవేత్తలు కొన్ని అరుదైన ఖనిజాలను గుర్తించారు.

"డైస్‌ప్రోజియం వంటి అత్యంత అరుదైన ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి జపాన్ సముద్ర జలాలలోనే ఉంటాయి. వీటిని వెలికి తీయటం వల్ల 239 ఏళ్ల పాటు హైబ్రీడ్ కార్లు, మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే అత్యంత అరుదైన ఖనిజాలు దొరికనట్లే'' అని టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ యాసుహీరో కోటో వెల్లడించారు. ఈ ఖనిజాలు సముద్ర మట్టానికి 5,600 మీటర్ల లోతులో ఉన్నాయి. వీటిని వెలికితీయడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తే జపాన్ ఖనిజాల విషయంలో స్వయంసమృద్ధి చెందినట్లే.

జపాన్ ఈ ఖనిజాల దిగుమతి కోసం ప్రస్తుతం చైనాపై ఆధారపడుతోంది. అయితే చైనా 2010 నుంచి అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించింది. తన భూభాగంలో ఉన్న సహజవనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చైనా చాలాకాలంగా వాదిస్తోంది. చైనా విధించిన ఆంక్షలపై ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేయాలని అమెరికా, యూరోపియన్ యూ నియన్, జపాన్‌లు ప్రపంచ వాణిజ్య సంస్థను కోరాయి.

టిబెట్‌లో కూడా..
ఇక, టిబెట్‌లో కూడా ఓ అరుదైన గనిని కనుగొన్నారు. టిబెట్‌లోని లాసాకు 78 కిలోమీటర్ల దూరంలో బహుళ ఖనిజాలు ఉన్న ఒక గనిని గుర్తించారు. ఈ గని నుంచి 2015 నుంచి ప్రతి ఏడాది 7.12 కోట్ల డాలర్ల విలువైన ఖనిజాలను వెలికితీయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గని ప్రపంచంలో అత్యంత భారీగా ఉండే 50 గనులలో ఇది కూడా ఒకటిగా ఉద్భవించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గత కొద్ది కాలంగా టిబెట్‌లో ఖనిజాల కోసం చైనా వేట ప్రారంభించింది. గత ఏడాది దాదాపు 3000 గనుల్లో 102 రకాల ఖనిజాలను చైనా ప్రభుత్వం గుర్తించింది. వీటి విలువ దాదాపు 10,000 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా.

0 comments:

Post a Comment