Tuesday

ఐఎస్ఎస్‌కు తొలి ప్రైవేటు అంతరిక్ష నౌక త్వరలో ప్రయోగించనున్న నాసా


అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారి ఓ ప్రైవేటు వాహకనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ఐఎస్ఎస్‌కు వాణిజ్య స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపనున్నట్లు నాసా ప్రకటించింది. దీంతో అంతరిక్ష కార్యకలాపాల్లో తొలిసారి వాణిజ్య సంస్థలకు చోటు కల్పించినట్లవుతుంది.

ఈ ప్రయోగం ద్వారా 'స్పేస్ ఎక్స్' అనే సంస్థ రూపొందించిన 'డ్రాగన్' అంతరిక్షవాహక నౌకను పరీక్షించనున్నట్లు నాసా తెలిపింది. అంతరిక్ష కేంద్రానికి సరకులతోపాటు వ్యోమగాములను సురక్షితంగా తీసుకెళ్లే సామర్థ్యం డ్రాగన్‌కు ఉన్నదా? లేదా? అన్నది పరిశీలిస్తామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఐఎస్ఎస్‌కు పంపడానికి పునర్వినియోగించగలిగే వాహకనౌకలను స్పేస్ఎక్స్ తయారుచేస్తోంది. ఇందులో భాగంగానే 'డ్రాగన్' వాహకనౌకను అందుబాటులోకి తెచ్చింది.

దీన్ని అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం చేసి పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి భూమికి పంపిస్తారు. అవసరమైనప్పుడు ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను మళ్లీ ప్రయోగించవచ్చు. నాసా ప్రారంభించిన కమర్షియల్ ఆర్బిటల్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ (సీవోటీఎస్) కార్యక్రమంలో భాగంగా ఈ ప్రయోగం జరుగుతోంది. సీవోటీఎస్ కింద 12 వాణిజ్య అంతరిక్ష వాహకనౌకలను అందించడానికి స్పేస్ఎక్స్ సంస్థ నాసాతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

0 comments:

Post a Comment