Sunday

మన వైద్యం ఇంకా అధ్వానమే! ఆరోగ్య సూచిల్లో వెనుకబాటు పథకాలు అమలవుతున్నా ప్రజల జేబులు గుల్ల

 "మన వైద్యం ఇప్పటికీ అధ్వానమే. శిశు, గర్భిణుల మరణాలు ఆందోళ న కలిగిస్తున్నాయి. ఆరోగ్యసూచీల్లో వెనుకబాటు అలాగే ఉంది. దశాబ్దాలుగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, వైద్యం కోసం ప్రజలు తమ ఆదాయంలో మూడింట రెండొంతులు ఖర్చుచేయాల్సి వస్తోంది'' అని ప్రధాని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో శనివారం జరిగిన జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్) స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్యవిద్య ప్రమాణాలు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు.

"ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే జాతి ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య, ఆర్థికపరంగా మనం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం'' అన్నారు. ఏడేళ్ల క్రితం కేంద్రం ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ పథకం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ వినూత్న మార్పులు తెచ్చి మౌలిక సదుపాయాల పెంపునకు కృషిచేశారని ప్రశంసించారు. "వచ్చే ఐదేళ్లలోనూ దీన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాలు, నగర ప్రజలకోసం కూడా 'నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్' పేరుతో సరికొత్త పథకాన్ని రూపొందిస్తున్నాం'' అని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లు రెండూ పని చేస్తున్నాయన్నారు.

త్వరలోనే ఏకీకృత జాతీయ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది కొరత ప్రభావం ప్రజలపై చూపుతోందన్నారు. సగటున వెయ్యిమంది రోగులకు ఒక డాక్టరు ఉండాలని, కానీ దేశంలో ప్రస్తుతం 2 వేల మందికి ఒక్కరే ఉన్నారన్నారు. ఒక్కో డాక్టరుకు ముగ్గురు నర్సులు సహాయంగా ఉండాలని, అయితే మనకు ప్రస్తుతం ఇద్దరేసి డాక్టర్లకు ముగ్గురు నర్సులే సహాయంగా ఉన్నారని చెప్పారు. ఈ అంతరాన్ని గులాంనబీ ఆజాద్ నేతృత్వంలోని ఆరోగ్యశాఖ త్వరలోనే తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్ పాఠ్యాంశాలను ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మారుస్తోందన్నారు.

వైద్య విద్య బలోపేతానికి కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. గత మూడేళ్లలో అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల స్థాయిని గణనీయంగా పెంచామన్నారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన కింద ఎయిమ్స్ తరహాలో భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పాట్నా, రాయపూర్, రిషికేశ్‌లలో సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇవన్నీ 2013-14 విద్యా సంవత్సరం నుంచే పని చేస్తాయని భావిస్తున్నామని తెలిపారు. జిప్మర్ సేవలను ప్రధాని ప్రశంసించారు. ఈ స్నాతకోత్సవంలో ప్రధానితో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, కేంద్ర మంత్రి వి.నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.325 కోట్ల వ్యయంతో నిర్మించిన మహిళా, శిశు ఆస్పత్రిని ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు.

0 comments:

Post a Comment