Wednesday

ఇరాక్‌లో భారీ పేలుళ్లు


మధ్య ఇరాక్‌లోని దివానియా నగరంలో రద్దీగా ఉండే మార్కెట్‌లో మంగళవారం జరిగిన పేలుళ్ళలో కనీసం 25 మంది మృతి చెందారు. సెంట్రల్ మార్కెట్ వద్ద నిలిపివుంచిన ట్రక్‌లో పేలుడు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.15కు ఈ ఘోరం చోటుచేసుకుంది. పేలుళ్ళలో 25 మంది చనిపోగా 70 మంది గాయపడ్డారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు దక్షిణాన 165 కిమి దూరంలో దివానియా నగరం ఉంది. పేలుళ్ళ వార్త దావానంలా వ్యాపించింది. అప్రమత్తమైన అధికారులు నగరమంతా కర్ఫ్యూ విధించారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఉదయం వేళ కావడంతో కూరగాయల మార్కెట్‌లో రద్దీ ఎక్కువగా ఉంది. పార్క్ చేసి ఉంచి ట్రక్‌లో పేలుళ్లు సంభవించడంతో జనం భీతావహులయ్యారు. సంఘన స్థలంలోనే 25 మంది మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.
పేలుళ్ళ ధాటికి 15 షాపులు ధ్వంసమయ్యాయి. కర్బాలా నగర శివారులోని షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని జరిగిన కారుబాంబు దాడిలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే దివానియాలో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కర్బాలా శివార్లలోని ఫ్రేయ గ్రామంలో కారుబాంబు పేలుళ్ళలో నలుగురు చనిపోయారు. ఈ సంఘటనలో 13 మంది గాయపడ్డారు. ఉదయం 7 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుందని లెఫ్టనెంట్ కల్నల్ అహ్మద్ అల్ హస్నావీ వెల్లడించారు. షియా జనాభా ఎక్కువంగా ఉన్న కర్బాలాలో తరచూ దాడులు జరుగుతున్నాయి.

0 comments:

Post a Comment