Wednesday

మీవాళ్లూ ఉన్నారు


ముంబయి మారణకాండలో భారత్‌పై పాకిస్తాన్ మరోమారు ఎదురుదాడికి దిగింది. 2008 నవంబర్ 28న ముంబయిలో జరిగిన తీవ్రవాద దాడుల్లో 40మంది భారతీయుల ప్రమేయం ఉందని పాక్ అధికారులు వ్యాఖ్యానించారు. కేసుకు సంబంధించి ఇటీవల న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో పట్టుబడిన లష్కరే తోయిబా కార్యకర్త జబీయుద్దీన్ అన్సారీ ముంబయి దాడులను తాము కరాచీలోని ‘కంట్రోల్ రూమ్’ నుంచి ఎలా పర్యవేక్షించిందీ వివరించిన నేపథ్యంలో, పాకిస్తాన్ అధికారులు ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో దాడులకు పాల్పడిన తీవ్రవాదులకు దాదాపు 40మంది భారతీయులు సహాయ సహకారాలు అందించినట్టు తమవద్ద సమాచారం ఉందని, దీనిపై భారత్ నుంచి వివరణ కోరుతున్నామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయానికి
చెందిన ఒక అధికారి పేర్కొన్నట్టు ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబూ జుందాల్
ఇంటరాగేషన్‌లో వెల్లడించిన అంశాలను తమకు తెలియజేయాల్సిందిగా ఉభయ దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చల్లో భారత్‌పై ఒత్తిడి తీసుకువస్తామని ఆ అధికారి పేర్కొన్నారు. రెండురోజుల పాటు జరిగే భారత్- పాక్ విదేశాంగ కార్యదర్శుల చర్చలు న్యూఢిల్లీలో బుధవారం ప్రారంభం కానున్నాయి. జబీయుద్దీన్ అన్సారీ అరెస్టు వ్యవహారం, తర్వాత భారత్ లేవనెత్తిన
అంశాలు చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయని భావిస్తున్నామని, అన్సారీ అరెస్టుకు సంబంధించిన వివరాలు తమకు
తెలియజేయాల్సిందిగా పాక్ ఈ చర్చల సందర్భంగా భారత్‌ను కోరుతుందని ఆ అధికారి తెలిపారు. అన్సారీ అరెస్టుకు
సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని భారత్ ఇప్పటివరకూ తమకు తెలియజేయలేదని ఆ అధికారి పేర్కొన్నారు. ముంబయి దాడులు భారతీయుల సహాయం లేకుండా జరగడం అసాధ్యమన్న విషయాన్ని పాకిస్తాన్ పదేపదే చెబుతోందని ఆ అధికారి అన్నారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమకు అందించేందుకు భారత అధికారులు నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

0 comments:

Post a Comment