Friday

భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు స్పేస్ మాడ్యూల్‌తో తొలిసారి మాన్యువల్ డాకింగ్ 13రోజుల అంతరిక్ష మిషన్ విజయవంతం


అంతరిక్షంలో స్థిర కక్ష్యలో తిరుగుతున్న మాడ్యూల్‌తో అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకున్న చైనా వ్యోమగాములు శుక్రవారం విజయవంతంగా భూమికి తిరిగొచ్చారు. అంతరిక్షంలో 13రోజులు గడిపిన తొలి మహిళా వ్యోమగామి సహా ముగ్గురు ఆస్ట్రోనాట్లు షెంజౌ-9 అంతరిక్ష నౌక ద్వారా మంగోలియాలోని గడ్డిమైదానంలో సురక్షితంగా దిగారు. ఈ ప్రక్రియను చైనా ప్రధాని వెన్‌జియాబావో, ఇతర ముఖ్య నేతలంతా కంట్రోల్ రూం నుంచి ప్రత్యక్షంగా తిలకించారు. భూమికి పది కిలోమీటర్ల ఎత్తులోనే స్పేస్‌క్రాఫ్ట్‌కు ఉన్న మెటల్ పారాచ్యూట్ విచ్చుకుంది. పెద్ద కుదుపుతో భూమిపై దిగింది.

ఓ గంట తర్వాత వ్యోమగాములు ఒక్కొక్కరుగా బయటకు వస్తుండగా హర్షాతిరేకాలు మిన్నంటాయి. వారికి శాస్త్రవేత్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వారిని ప్రశంసిస్తూ చైనా నాయకత్వం ప్రత్యేక సందేశం పంపింది. వైద్య పరీక్షల అనంతరం వ్యోమగాములను బీజింగ్ తరలించారు. కాగా, భవిష్యత్తులో కూడా మరింత మంది మహిళా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతామని, శిక్షణ కోసం ఇప్పటికే కొందరు ఎయిర్‌ఫోర్స్ పైలట్లను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.

అంతరిక్షంలోని తియాగాంగ్-1 స్పేస్ మాడ్యూల్‌కు తొలిసారి మానవసహిత వ్యోమనౌకను పంపిన చైనా.. మాన్యువల్ డాకింగ్‌ను(మానవ ప్రమేయంతో వ్యోమనౌకను అంతరిక్ష కేంద్రానికి అనుసంధానించడం) కూడా విజయవంతంగా పూర్తి చేసింది.

దీంతో ఈ పరిజ్ఞానం ఉన్న అమెరికా, రష్యాల సరసన చైనా చేరింది. 2020కల్లా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న చైనా వడివడిగా అడుగులేస్తోంది. తాజా మానవసహిత ప్రయోగాన్ని ఈ దిశగా జరిగిన కీలక మలుపుగా నిపుణులు పేర్కొంటున్నారు.

0 comments:

Post a Comment