Monday

తియ్యటి నగరం గ్రేట్ సిటీస్...!

ప్రాచీన నాగరక నగరం ఇది... ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిన గొప్ప నిర్మాణాల నెలవు. రాజవంశ... నియంత పాలనల సాక్షిగా ప్రజాస్వామ్యం కోసం గళమెత్తిన నగరం. ఈ అరబిక్ కేంద్రం ఆఫ్రికాలో పెద్ద నగరమే కాదు ఈజిప్టుకు రాజధాని కూడ. ఖర్జూరాల సాక్షిగా సహారా ఎడారిలో ఒంటె సవారీ... నైలు నదిలో క్రూయిజ్ విహారాల వేదిక కైరో... ఈ వారం మన గ్రేట్ సిటీ !

కైరో అంటే ఖర్జూరాలు గుర్తొస్తాయి. నైలు నది జ్ఞాపకం వస్తుంది. ఈజిప్టు గుర్తుకు వస్తుంది. ఈజిప్టు... ఈ పదాన్ని పలికేలోపు ఫారోలు, పిరమిడ్లూ, మమ్మీలు, ప్రాచీన జీవనశైలి, సంస్కృతిసంప్రదాయాల వంటివెన్నో కళ్ల ముందు మెదలుతాయి. కైరో ఈజిప్టు రాజధాని నగరం మాత్రమే కాదు ఆఫ్రికా ఖండంలో పెద్ద నగరం కూడ. మన వారణాసిలాగ కైరో కూడా పురాతన చరిత్ర ఉన్న నగరం.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... కాశీ మనకు ఎంతటి ప్రాశస్య్రమైన నగరం అయినప్పటికీ దాని అభివృద్ధి మీద పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించదు. ఇరుకురోడ్లు, పరిశుభ్రత లోపం వంటి సమస్యలతో ఇబ్బంది పడ్డామని వెళ్లి వచ్చిన వాళ్లు చెబుతుంటారు. కైరోలో అలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన నగరం అనిపిస్తుంది. రోడ్ల నిర్వహణ ఎంత బాగుంటుంది అంటే మన షాపింగ్ మాల్స్ ఉన్నంత నీట్‌గా ఉంటాయి. ఎక్కడా దుమ్ము కనిపించదు. ఇక్కడ పర్యటిస్తూ గైడ్ చెప్పిన వివరాలను వింటుంటే తరచుగా మన ప్రాచీన నాగరికత జ్ఞాపకాల్లోకి వెళ్తుంటాం.

నగరంలో ప్రాచీన విశ్వవిద్యాలయం అల్ అజహర్ ఉంది. మనదేశంలో తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలను చదవడంతోనో ఏమో దీనిని చూస్తున్నప్పుడు ప్రాచీన భారతం గుర్తు వస్తుంది. మన సింధులోయ నాగరకతను తలపిస్తూ నైలు నాగరకత గుర్తొస్తుంది. కైరో నాగరకత నైల్‌తో ముడివడి ఉంది. ప్రాచీన నగరం నదికి తూర్పు తీరాన ఉంటే, పశ్చిమ తీరాన మోడరన్ సిటీ విస్తరించింది.

ఈజిప్టు ఎడారి ప్రాంతం అయినప్పటికీ నైలు నది కారణంగా నగరంలో వాటర్ సిస్టమ్ చాలా పటిష్టంగా ఉంటుంది. ఇక్కడ మనకు వింతగా అనిపించే అంశం ఒకటుంది. బహుళ అంతస్థుల భవనాలు లెక్కలేనన్ని ఉంటాయి. 40 అంతస్తుల భవనం అయినా సరే దానికి ప్లాస్టింగ్ ఉండదు. భవనానికీ - భవనానికీ మధ్య అంగుళం కూడా వదలకుండా కట్టేస్తారు. ఒక్క కైరో అనే కాదు దాదాపుగా ఈజిప్టు మొత్తం ఇలాగే ఉంటుంది.

ప్రపంచ వింత!

ఈజిప్టు పిరమిడ్‌ల స్థావరం గిజా... కైరోకు ఐదుమైళ్ల దూరంలో ఉంటుంది. కైరో మెట్రోపాలిటన్ నగరంలో గిజా నివాసప్రదేశం, పిరమిడ్‌ల స్థావరమైన గిజా ప్లాట్యూ కలిసిపోయాయి. నగర కేంద్రం నుంచి పిరమిడ్ ప్లాట్యూకు అరగంట ప్రయాణం. ఇక్కడ ఉన్న మూడు పిరమిడ్‌లలో ఒకటి ఖుఫూ రాజుది.

ఒకటి రాణిది, మధ్యలో ఉన్నది యువరాజుది. వాటికి దగ్గరలోనే స్ఫింక్స్ ఉంది. దానిని ఏకాండీ శిలలో మలిచిన తీరు అద్భుతం. పిరమిడ్‌ను బయట నుంచి చూస్తే ఒకదాని మీద ఒకటిగా మొనదేలినట్లు పేర్చిన రాళ్లు మాత్రమే కనిపిస్తుంటాయి. పిరమిడ్ లోపలకు వెళ్లడానికి మెట్లు ఉంటాయి. దారి ఒకరు మాత్రమే పట్టేంత ఇరుకుగా ఉంటుంది.

పిల్లలు, వృద్ధులు ఎక్కడం చాలా కష్టం. ఆ మెట్లు సరాసరి పిరమిడ్ శిఖరాగ్రానికి చేరుస్తాయి. పిరమిడ్ రాళ్లు ఒక్కొక్కటి మన నడుము దగ్గరకు వస్తాయి. పిరమిడ్ పైకి ఒక్కసారిగా ఎక్కలేని వాళ్ల కోసం మధ్యలో చిన్న రెస్ట్ ప్లేస్ ఉంటుంది. వందల ఏళ్ల కిందట సాంకేతికత అభివృద్ధి చెందని రోజుల్లో ఈ రాళ్లను ఎలా కదిలించారు, ఎలా ఇంత కచ్చితంగా పేర్చారు అని ఎంత ఆలోచించినా అందుకు తగిన ఆనవాళ్లు ఏమీ కనిపించవు. కైరో చారిత్రక నగరంలో పర్యటన సాహసోపేతం అనే చెప్పాలి.

మమ్మీల మ్యూజియం...

ఈజిప్టు నేషనల్ మ్యూజియం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందులో ప్రతి ఒక్కటీ ఈజిప్టుకు చెందిన వేలాది సంవత్సరాల చరిత్రకు ఒక్కో ఆనవాలు. వివిధ దశలకు చెందిన లక్షకు పైచిలుకు పురావస్తు విశేషాలను ఇక్కడ పొందుపరచారు. రాజు, రాణి, యువరాణితోపాటు మొత్తం పదిహేను మమ్మీలున్నాయి. పిరమిడ్‌ల నుంచి సేకరించిన మమ్మీలను ఇందులో భద్రపరిచారు.

మమ్మీల జుట్టు నుంచి, కాలి గోళ్ల వరకు మొత్తం సజీవంగా ఉన్న మనిషికి ఉన్నట్లే ఉన్నాయి. లోపలి అవయవాలను తొలగిస్తారు కాబట్టి ఆకారాలు సన్నగా, బలహీనంగా ఉన్న మనిషిలా ఉన్నాయి తప్ప, ప్రాణం లేని మనిషి అనిపించవు. అన్నింటిలోకి ‘టుటాన్ ఖామున్’ గ్యాలరీని అంగుళం అంగుళం పట్టి పట్టి చూడాల్సిందే. ఇక్కడ వెదురును పోలిన ఒక రకం కలపను నానబెట్టి పలుచని పొరలుగా కట్ చేసి ప్రెస్ చేసి వాటి మీద వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. కలపను నానబెట్టి పొరలుగా చేశాక రోల్ చేసినా, వంచినా విరగకపోవడం దీని ప్రత్యేకత. ప్రాచీన ఈజిప్టు సాంకేతక పరిజ్ఞానికి ప్రతీక ఇది.

ఈ మ్యూజియంలో రాజు, రాజ కుటుంబీకులు వాడిన మంచాలు, కుర్చీలు, దుస్తుల నుంచి కండోమ్‌ల వరకు ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తయితే రాజు ధరించిన బంగారు తొడుగు ఒక ఎత్తు. 50 కిలోల బరువున్న తొడుగును ధరించేవాడట.దాన్ని వేసుకుంటే దేహం కనిపించదు, కళ్లు మాత్రమే కనిపిస్తాయి. ఇక మ్యూజియంలో ఉన్న శిల్పాల విషయానికి వస్తే... ఎదురుగా మనిషి నిలబడి ఉన్నంత సహజంగా ఉంటాయి. చీకటి పడిన తర్వాత పిరమిడ్‌ల ‘సౌండ్ అండ్ లైట్ షో’ నిర్వహిస్తారు. ఆ షోలో యుగాల నాటి చరిత్రను ఆత్మకథల శైలిలో చెప్పే తీరు బాగా ఆకట్టుకుంటుంది.

సమయాన్ని పాటించే సబ్‌వే రైళ్లు !

ఇక్కడ సబ్‌వేలలో ప్రయాణం సురక్షితం. ఈ రైళ్లకు నగరంలో అన్ని ప్రదేశాలను కలుపుతూ లైన్లు ఉన్నాయి. ఉదయం ఐదున్నర నుంచి అర్ధరాత్రి వరకు సర్వీసులు నడుస్తుంటాయి. ఆరు నిమిషాలకో రైలు అంటే అంతే కచ్చితంగా నడుస్తాయి. బస్సులు, ట్రామ్‌లు కూడా నడుస్తుంటాయి కానీ ఇవి సబ్‌వేలు నడిచినంత కచ్చితంగా నడవవు అని స్థానికుల అభిప్రాయం.

సహజ పరిమళాల నిలయం!

నగరంలో ఖాన్ ఎల్ ఖలీల్ బజార్ చాలా ప్రసిద్ధి. ఇది సుగంధద్రవ్యాలకూ, విలువైన రత్నాలు, పెర్‌ఫ్యూమ్ కాన్‌సెన్‌ట్రేట్ లిక్విడ్స్ దొరుకుతాయి. వీటిని ప్రపంచంలోని ప్రసిద్ధ మల్టీనేషనల్ కంపెనీలు కొని, ప్రాసెస్ చేసి తమ లేబుల్‌తో మార్కెట్‌లోకి విడుదల చేస్తాయి. ఇక్కడ దొరికే పెర్‌ఫ్యూమ్‌లన్నీ పూల నుంచి సేకరించిన ఎక్స్‌ట్రాక్ట్స్. కాబట్టి సువాసన ఆహ్లాదభరితంగా ఉంటుంది. కైరోలో షాపింగ్ ప్రత్యేకత ఏమిటంటే... పెద్ద మాల్‌లో ఉన్నట్లే ఓపెన్ బజార్లలో కూడా అది ఇది అన్న తేడా లేకుండా ప్రతి వస్తువూ దొరుకుతుంది.

ఒకే చోట పెర్‌ఫ్యూమ్, మెటల్ వర్క్ షోపీస్, గాజు వస్తువులు, కళాఖండాలు, ఆభరణాలు కొనవచ్చు. ఈ లోపు ఆకలిగా అనిపిస్తే మంచి రెస్టారెంట్ కూడా ఈ వరుసలోనే ఏదో ఒక చివర ఉంటుంది. సరదాగా ఒంటెను కొనాలనుకున్నా కూడా దొరుకుతుంది. ఇక్కడ దుస్తులు చవక, మన దగ్గర ఐదు వేలకు దొరికే డ్రస్ అదే క్వాలిటీతో ఇక్కడ పదిహేను వందలకే వస్తుంది. పెద్ద షాపింగ్ సెంటర్లలో మాస్టర్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, విసా క్రెడిట్ కార్డులను అనుమతిస్తారు.

వారసత్వ రెస్టారెంట్ !

నైల్‌రివర్ రెస్టారెంట్ ప్రాచీన ఈజిప్టు సంప్రదాయరీతికి ప్రతిబింబం. మనకు రాజస్థాన్ ప్యాలెస్‌లను హెరిటేజ్ హోటల్స్‌గా మార్చినట్లు అన్నమాట. అయితే ఇది చారిత్రక భవనం కాదు, ఈజిప్టు సంప్రదాయ శైలి నిర్మాణం. ఇందులో కస్టమర్లను స్వాగతించడం, ఆహారం వడ్డించడం వంటివన్నీ సంప్రదాయ ఈజిప్టు తరహాలో ఉంటాయి. నగరం పర్యాటక కేంద్రం కావడంతో ప్రపంచ రుచులన్నీ అందుబాటులో ఉంటాయి. నదిలో విహరిస్తూ భోజనం చేయాలన్న ముచ్చట ఉంటే అది ఇక్కడ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌లో తీరుతుంది. ఇక్కడ ప్రతి హోటల్‌లో హుక్కా ఉంటుంది.

ఇక్కడ ఖర్జూరం చెట్లలాంటి మరికొన్ని చెట్లు కూడా ఉంటాయి. వాటి కాయలు ఈత కాయల్లాగ నాలుగు రెట్లు పెద్దవి. రాలి పడిన పిందెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈజిప్టులో దాదాపుగా ప్రతి చోట ఈ చెట్లు ఉంటాయి. ఇక్కడ చక్కటి ప్రణాళికతో కూడిన రోడ్ల నిర్మాణం, మెయింటెనెన్స్ చక్కగా ఉంటుంది. రోడ్డు డివైడర్ జోన్‌లో ఈ చెట్లు తప్పకుండా ఉంటాయి.

కైరోలో తెహ్రిర్ స్క్వేర్ ఎప్పుడూ ప్రాధాన్యం ఉన్న ప్రదేశమే కాని ఇప్పుడు మరీ ఎక్కువైంది. గత ఏడాది ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా చెలరేగిన విప్లవానికి, ఆందోళనకు వేదిక ఇది. 20 లక్షల మంది ఇక్కడ చేరి నిరసన తెలియచేశారు. నగరంలో ఈజిప్షియన్ మ్యూజియం, నేషనల్ డెమొక్రటిక్ పార్టీ కేంద్ర కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల భవనం, అరబ్ లీగ్ కేంద్ర కార్యాలయం, నైల్ హోటల్, చర్చ్, అమెరికన్ యూనివర్శిటీలు దీని చుట్టూ ఉన్నాయి. ఈజిప్టు అధ్యక్ష భవనం పేరు హెలియోపోలిస్ ప్యాలెస్. ఇది కొత్త అధ్యక్షుడి కోసం ఎదురు చూస్తోంది.

ఈజిప్టు నాగరికత మాత్రమే కాదు పర్యాటకం కూడా నైలు ప్రవాహమార్గంలోనే విస్తరించింది. ఆస్వాన్, లక్సర్, అలెగ్జాండ్రియా, ఎడ్‌ఫూ వంటి ప్రదేశాలను కలుపుతూ కోస్టల్ టూర్ ప్యాకేజ్‌లు ఉన్నాయి. ప్రజావిప్లవం ప్రభావం పర్యాటకరంగం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనిక ప్రభుత్వం.

ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి కైరోకి వెళ్లి రావడానికి ఎకానమీ క్లాస్ విమాన చార్జీలు ఎమిరేట్స్‌లో 50 వేలు, ఎయిర్ ఇండియాలో ఎనభై వేలు అవుతాయి. ఎమిరేట్స్, ఎథిమాడ్ ఎయిర్‌వేస్, ఖతర్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఇండియా, గల్ఫ్ ఎయిర్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు విమాన సర్వీసులను నడుపుతున్నాయి. కొన్ని సర్వీసులు ఒక చోట విరామం, కొన్ని రెండు చోట్ల విరామంతో నడుపుతున్నాయి. విరామంతో కలిపి ప్రయాణం కొన్ని సర్వీసుల్లో పది గంటలు పడితే, కొన్నింటిలో పంతొమ్మిది గంటలు కూడ పడుతుంది.

కైరోలో సైట్ సీయింగ్ ఉదయం, సాయంత్రం చేయాల్సిందే. మధ్యాహ్నం విపరీతమైన వేడి ఉంటుంది. గది నుంచి బయటకు రాలేం. స్థానికులు కూడా బయట తిరగరు. రోడ్లు నిర్మానుష్యంగా ఉంటాయి. సాయంత్రం ఆరున్నరకు మిట్టమధ్యాహ్నంలాగ ఉంటుంది. రాత్రి ఎనిమిదన్నరకు కూడా లైట్లు వేయనక్కర్లేదు, అప్పటికీ సూర్యుడు ఉంటాడు. తెల్లవారు ఝామున నాలుగన్నర -ఐదు గంటల లోపు సూర్యోదయం అవుతుంది.

ఇక్కడ పగలు నిడివి ఎక్కువ, రాత్రి తక్కువ. నిద్రపోవాలంటే గదిని మందపాటి కర్టెన్లతో చీకటి చేసుకోవాల్సిందే. ఇక్కడ ఇళ్లు, హోటళ్ల కిటికీలకు కర్టెన్లను రెండు - మూడు పొరలుగా వేసుకునే ఏర్పాట్లు ఉంటాయి. మనకు ఉన్నట్లు ఇక్కడ మూడు కాలాలు ఉండవు, రెండు కాలాలే. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు శీతాకాలం, మే నుంచి అక్టోబర్ వరకు ఎండాకాలం. ఎడారి ప్రదేశం కావడంతో 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులు వస్తాయి. ఎండాకాలంలో పగలు 43 డిగ్రీలు ఉంటే అదే రోజు రాత్రి టెంపరేచర్ ఏడు డిగ్రీలకు పడిపోతుంది. చలికాలంలో జీరో డిగ్రీల నుంచి పద్దెనిమిది డిగ్రీల మధ్య నమోదవుతుంది. 

0 comments:

Post a Comment