Saturday

టైమ్ ముఖచిత్రంపై ప్రీత్ భరారా ప్రవాస భారతీయ అటార్నీకి అరుదైన గౌరవం


భారత సంతతికి చెందిన అమెరికన్, ప్రముఖ అటార్నీ ప్రీత్ భరారా 'టైమ్' ముఖచిత్రాన్ని అలంకరించారు. ముఖచిత్రం ఎంపికలో వైవిధ్యానికి, విలక్షణతకు పెద్దపీట వేసే 'టైమ్' కంట్లో పడడమే గొప్ప గౌరవంగా భావిస్తారు. వాల్‌స్ట్రీట్ బేరసారాల్లోని అక్రమాలపై న్యాయస్థానంలో పోరాడినందుకు గాను, ఈ సారి ఈ గౌరవం ప్రీత్ భరారా దక్కించుకున్నారు. 

అమెరికా ఆర్థిక కేంద్రం వాల్‌స్ట్రీట్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న అంతర్గత బేరసారాలను ప్రీత్ నిగ్గు తేల్చారు. మెక్‌కిన్సే మాజీ అధిపతి,గోల్డ్‌మన్ సక్స్ డైరెక్టర్ రాజీవ్ గుప్తాను బోనులో నిలబెట్టారు. గుప్తా వంటి ఉన్నతవర్గాలకు చెందిన వ్యక్తుల ముసుగును చింపేశారు. ప్రీత్ ముఖచిత్రంపై రాసిన "వాల్‌స్ట్రీట్‌ను కూలుస్తున్న వ్యక్తి'' అనే వాక్యంతో గురువారం తాజా సంచిక వెలువడింది. 

"ఆర్థిక రంగంలో కాకలు తీరిన హేమాహేమీల ఆటలను ఒక అటార్నీగా ప్రీత్ కట్టించాడు. ఆయన అధిరోహించాల్సిన శిఖరాలు ఇంకా చాలానే ఉన్నాయి'' అని సంపాదకీయంలో శ్లాఘించారు.

సిక్కు తండ్రి, హిందూ తల్లి సంతానమైన 43 ఏళ్ల ప్రీత్, 1990లో హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూయార్క్ దక్షిణ ప్రాంత అటార్నీగా ప్రీత్ పేరును అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిపాదించగా, సెనేట్ ముక్తకంఠంతో ఆమోదించింది. ప్రస్తుతం ఆయన న్యూజెర్సీలో ఉంటున్నారు.

0 comments:

Post a Comment