Monday

'తలాక్' వద్దు.. బహుభార్యత్వాన్ని నియంత్రిద్దాం.. ముస్లిం మేధావి బృందం నిర్ణయం


మన దేశంలో ముస్లిం పర్సనల్ చట్టాలను క్రోడీకరించే దిశలో ముస్లిం మేధావి బృందం ఓ అడుగు ముందుకేసింది. పర్సనల్ చట్టాలలో ఉన్న అనేక విషయాలను క్రోడీకరించాలని నిర్ణయించింది. తలాక్ విధానంపై నిషేధం, బహుభార్యత్వాన్ని నియంత్రించడం వంటి చర్యలు చేపట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ముస్లిం పర్సనల్ చట్టాలను సవరించాలన్న డిమాండ్ మేరకు దేశవ్యాప్తంగా పలువురి అభిప్రాయాలు సేకరించిన ముస్లిం మేధావులు ఓ సంచలనాత్మక ముసాయిదాను తయారు చేశారు.

పర్సనల్ లాను క్రోడీకరించడం పూర్తయిన తర్వాత చట్టంలో సవరణల కోసం ఈముసాయిదాను పార్లమెంట్‌కు పంపనున్నారు. ఇప్పుడు కొత్తగా చ ట్టాలను ఏమీ తీసుకు రావడం లేదని, ముస్లిం ప్రజలకు ఖురాన్ కల్పించిన మార్గదర్శకాలనే అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని సంస్కరణవాది అస్గర్ అలీ తెలిపారు.' మూడుసార్లు తలాక్ చెప్పడానికి ఇక్కడ స్థానంలేదు. కచ్చితంగా దానిని రూపుమాపాల్సిందే' అని ముంబైలోని ఇస్లామిక్ స్టడీస్‌కి చెందిన కుతుబ్ జీహన్ కిద్వాయ్ స్పష్టం చేశారు. బహుభార్యత్వాన్ని కొన్ని నిబంధనలతో నియంత్రించాలని ఈ బృందం అభిప్రాయపడింది.' ఇస్లాం స్ఫూర్తి ఏక భార్యత్వమే. అయితే ఔహద్ యుద్ధంలో వేలాదిమంది ముస్లిం పురుషులు చనిపోయారు.

దీంతో చాలా మంది మహిళలు అనాథలుగా మిగిలిపోయారు. వారికి ఓ జీవితాన్ని అందివ్వడానికి పురుషుడు నలుగురు మహిళలను వివాహం చేసుకోవడానికి అనుమతి నిచ్చింది. అయితే వారిని పోషించగలిగే స్థితిలో ఉన్నప్పుడే నాలుగు వివాహాలకు అనుమతి ఉంది'' అని కేరళ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షంసుద్దీన్ అన్నారు. ఇక ప్రభుత్వ నిబంధనల మేరకు ముస్లిం వివాహాలను రిజిస్టర్ చేయాలని ఈ ముసాయిదా సూచించింది. దీనికోసం నిఖానామాలను రిజిస్టర్ చేయించడానికి ప్రత్యేక నిఖా రిజిస్టర్‌లను ఏర్పాటుచేయాలని సూచించారు. అంతేకాక పెళ్లిచేసుకునే వయసును యువతులకు 18 సంవత్సరాలుగా, పురుషులకు 21 సంవత్సరాలుగా నిర్ణయించాలని ముసాయిదా పేర్కొంది.

0 comments:

Post a Comment