Monday

2జీ దర్యాప్తు కోసం బ్లూప్రింట్ త్వరలో సీవీసీ, సీబీఐ డైరెక్టర్ సమావేశం చిదంబరంపై సుప్రీంలో పిటిషన్ వేస్తా: స్వామి

పీసీపై చాలినంత సాక్ష్యాలున్నాయి: మేనకా గాంధీ
హోంమంత్రి పాత్రపై దర్యాప్తు జరపాలి: సీపీఎం


2జీ స్కాంలో తదుపరి దర్యాప్తు జరగాల్సిన పద్ధతిపై ఓ కార్యాచరణ పథకాన్ని (బ్లూప్రింట్‌ను) సిద్ధం చేయడానికి సీవీసీ, సీబీఐ సమాయత్తమవుతున్నాయి. ఇందుకోసం సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్‌తో చర్చలు జరిపి ఖరారు చేసేందుకు సీవీసీ ప్రదీప్ కుమార్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారని సమాచారం.

ఈ సమావేశం ఈ నెల్లోనే జరిగే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ స్కాం తదుపరి విచారణల సందర్భంగా స్థాయీ నివేదికలను సీవీసీకి సమర్పిస్తుండాలంటూ సుప్రీం జారీ చేసిన ఆదేశాల మేరకు, సీవీసీ ఈ నిర్ణయం తీసుకొన్నారని ఆ అధికారి చెప్పారు. దీని తరువాత కూడా ఈ కేసు దర్యాప్తు ఏ విధంగా పురోగమిస్తున్నదీ బేరీజు వేయడానికి ప్రతి పక్షం రోజులకూ ఓ సారి సీబీఐ అధికారులతో సమావేశం జరపడం అవసరమని సీవీసీ భావిస్తున్నారని ఆ అధికారి వెల్లడించారు.

దిగువ కోర్టు తీర్పు తప్పు: స్వామి
2 జీలో అప్పటి అర్థిక మంత్రి (ప్రస్తుత హోం మంత్రి) పి. చిదంబరం పాత్రపై నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణియన్ స్వామి ఆదివారం ముంబైలో చెప్పారు. ఈ స్కాంలో చిదంబరం పాత్రపై తాను దాఖలు చేసిన పిటిషన్‌ను దిగువ కోర్టు కొట్టివేయడం "తప్పు'' అని వ్యాఖ్యానించారు. తన వాదన సరైనదేనని సుప్రీంలో రుజువు చేస్తానంటూ ధీమా వ్యక్తంచేశారు. మనీలైఫ్ ఫౌండేషన్ సంస్థ ద్వితీయవార్షికోత్సవ సందర్భంగా ముంబైలో '2జీ స్కాం-దాని పరిణామాలు' అనే అంశంపై ప్రసంగించిన స్వామి పై విధంగా వ్యాఖ్యానించారు.

'విచారణ సమయంలో నేర సంబంధ చర్య రుజువు కాదు. ఏ. రాజా నేర పరంగా బాధ్యత వహించాల్సి వచ్చినప్పుడు, చిదంబరం పాత్రపై ఎందుకు దర్యాప్తు సాగించరాదు'' అంటూ ప్రశ్నించారు. నేర నిర్ధారణ ప్రక్రియ, విచారణ దశలో సాధ్యం కాదు కదా అని చెపుతూ.. తన పిటిషన్ విషయంలో కింది కోర్టు జడ్జి ఈ విషయంలో పొరపాటు పడ్డారని వ్యాఖ్యానించారు. ఎన్డీయే పాలన కాలంలో జరిగినట్టుగానే, స్పెక్ట్రమ్ ధర నిర్ణయించే అధికారాన్ని ఆర్థిక, టెలికం మంత్రులకు దఖలు పరచినట్లు ప్రధాని మన్మోహన్ ఓ ఇంటర్‌వ్యూలో చెప్పారని, అప్పటి నుంచి చిదంబరం చర్యల సాక్ష్యాధారాలను సేకరించడం ప్రారంభించానని స్వామి వివరించారు.

అవినీతి నిర్మూలన ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ.. అన్నా హజారే, రామ్‌దేవ్‌ల ఆందోళనలో పాలుపంచుకోవలసిన అవసరం తనకు ఉందన్నారు. 'ఇప్పటికే రామ్‌దేవ్‌తో కలిసి శనివారం ఓ బహిరంగ సభలో ప్రసంగించా. అయితే రాజకీయ వాదులంటే తమకు ఉన్న ఏహ్య భావాన్ని అన్నా బృందం విడనాడాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయ వాదులు, రాజకీయ పార్టీలు లేకుండా వ్యవహరించడం సాధ్యం కాదు' అని హితవు చెప్పారు.

ఏదో ఓ రోజు చిదంబరం జైలుకెళ్తారు: మేనక
2జీ కేసులో దిగువ కోర్టులో చిదంబరానికి ప్రస్తుతం ఊరట కలిగి ఉండవచ్చు కాని, ఆయన దోషి అని తేల్చడానికి చాలినంత సాక్ష్యాధారాలు ఉన్నాయని, అందువల్ల ఏదో ఓ రోజున ఆయన జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ నేత మేనకా గాంధీ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని దాటాగంజ్ నియోజకవర్గంలో పార్టీ అభ ్యర్థి తరఫున ఆదివారం నాటి ఎన్నికల సభలో ప్రసంగించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.

చిదంబరం నిర్లక్ష్యంపై దర్యాప్తు జరపాలి: సీపీఎం
2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి ఆర్థిక మంత్రిగా ఉండిన కాలంలో తన బాధ్యతల నిర్వహణలో పి. చిదంబరం నిర్లక్ష్యం వహించారన్న అంశంపై కూలంకషంగా దర్యాప్తు జరపాలని సీపీఎం డిమాండు చేసింది. ఆయన సరైన సమయంలో తగు చర్యలు తీసుకొని ఉంటే దేశ కోశాగారానికి భారీ నష్టం వాటిల్లి ఉండేది కాదని సీపీఎం నేత నీలోత్పల బసు ఆదివారం న్యూఢిల్లీలో విలేకరుల వద్ద అన్నారు.

0 comments:

Post a Comment