Monday

ఇల్లాలి ప్రేమికుడు...!


ఇష్టదైవాలకు గుడి కట్టడం లోకంలో ఉన్నదే. వెర్రి తలకెక్కి అభిమాన నటీనటులకు గుళ్లు కట్టడమూ తెలుసు. జన్మనిచ్చిన జననీజనకులకో, జీవితాన్ని ముడిపెట్టుకున్న భార్యకో భర్తకో గుడి కట్టి ఆరాధించేవాళ్లు మాత్రం అతి తక్కువ. అలాంటి అరుదైన కోవకు చెందుతారు శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన పాలవలస కూర్మారావు. కోమాలోకి వెళ్లిపోయిన భార్యకు ఒకటీ రెండూ కాదు, ఏకంగా తొమ్మిదేళ్ల పాటు సేవ చేసి, మరణానంతరం ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని పూజలు చేస్తున్న ఆయన్ని చూస్తే ఆశ్చర్యమూ, గౌరవమూ కలుగుతాయి.

పాలవలస కూర్మారావు అంటే పెద్దగా తెలియదెవరికీ. చినరాజు అని అడిగి చూడండి. 'భార్యకు విగ్రహం పెట్టినాయనేనా? అదే ఇల్లు...' అంటూ చూపిస్తారు. ఆయనతో ఆలోచనకు 'ఒక్కరే ఉంటున్నారా' అన్నామనుకోండి, 'మా రాజకుమారి నాతోనే ఉంటుంది. ఇంక నేనొక్కణ్నే అన్న భావానికి తావేది?' అని ప్రశ్నిస్తారాయన. 'ఇంతకూ కథేమిటి' అనడానికి లేదు. ఎందుకంటే అది కథ కాదు. 'దారిచూపిన దేవత' అని పాడుకోగలిగే సినిమా కాదు. అచ్చమైన జీవితం.

అందులోకి వెళితే... పాలకొండకో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది వీరఘట్టం. దాని చుట్టుపక్కల పల్లెటూళ్లలో పుట్టిపెరిగిన చినరాజుకు, రాజకుమారికి వివాహం నిశ్చయించి 1970 మే 5న పెళ్లి చేశారు పెద్దలు. అప్పటివరకూ ఒకరికొకరు తెలియని అపరిచితులు ఆ ముహూర్తంతో దంపతులయ్యారు. ప్రేమ, స్నేహం, దాంపత్యం, ఏదైనా సరే - ఇద్దరి మధ్యన బంధం బుల్లి పిట్టలాంటిదట. చాలా తేలిగ్గా బులబులాగ్గా పట్టుకుంటే మన చేతుల్లోంచి రివ్వున ఎగిరిపోతుంది.

అలాగని గట్టిగా బిగించి పట్టుకున్నామా, ఊపిరాడక చచ్చిపోతుంది. మరేం చెయ్యాలి? ప్రేమగా పట్టుకోవాలి. అప్పుడే అది మన గుండెల్లోకి చేరి కులాసాగా కువకువలాడుతుంది. హృదయాన్ని అద్భుతమైన ప్రేమతో నింపి కళకళలాడేలా చేస్తుంది. ఈ విషయం వాళ్లిద్దరికీ ఎవరూ మాటల్లో పెట్టి చెప్పలేదు. "చెప్పాలేటమ్మా? రోజులు గడుస్తుంటే భార్యాభర్తలు ఒకర్నొకరు అర్థం చేసుకుంటారు. మేమూ అంతే. కొన్నాళ్లకి ఒకరిని వదిలి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నాం. అలాగని అదీ మాటల్లో చెప్పుకోలేదు...'' అంటూ దాంపత్య జీవితపు తొలిరోజుల గురించి గుర్తుచేసుకున్నారాయన. 1952లో పుట్టారు రాజకుమారి. పద్దెనిమిదేళ్ల పడుచుగా వాళ్లింటికొచ్చారు.

"మా ఇల్లు, మావాళ్లు, మీ ఇల్లు, మీవాళ్లు అన్నమాటే అనేది కాదమ్మా ఎప్పుడూ. అందరినీ మనవాళ్లనే అనేది. అందరికీ తలలో నాలుకగా మెలిగింది'' అంటూ భార్య గురించి చెప్పుకొచ్చారు చినరాజు. హాయిగా సాగిపోతున్న సంసారంలో రాజకుమారి అనారోగ్యం అపశృతిలాగా పలికింది. గర్భసంచిని తొలగించడం అవసరమన్నారు వైద్యులు. శస్త్రచికిత్స సమయంలో హాస్పిటల్లో ఆక్సిజన్ అయిపోవడంతో కోమాలోకి జారిపోయారామె. వెంటిలేటర్ మీద కృత్రిమ శ్వాసనందించారు. "అది 1996 సెప్టెంబరు. నా జీవితంలో బ్లాక్ డే. అప్పటినుంచీ 2005 జనవరి మూడున ఆమె కన్ను మూసేవరకూ కోమాలోనే ఉంది. ముందు మూడేళ్ల పాటు ఆస్పత్రులన్నీ తిరిగాను.

జీవచ్ఛవాన్ని ఏం చేయగలమని వైద్యులంతా చేతులెత్తేశారు. దాంతో నేనామెను ఇంటికి తీసుకొచ్చేశాను. మానవుడు ఆశాజీవి కదా, ఎప్పటికైనా మార్పు రాకపోతుందా అని ఫిజియోథెరపీ నేనే స్వయంగా చేసేవాణ్ని. ఎప్పటికప్పుడు పడకలు మారుస్తుండేవాణ్ని. అంటే ఒకసారి వాటర్ బెడ్, మరోసారి మామూలుది, ఇంకోసారి మెడికేటెడ్... ఇలా. మీరు నమ్ముతారో నమ్మరో, ఆవిడ మంచాన పడ్డా ఒక్క బెడ్‌సోర్ కూడా లేకుండా గొప్ప శుభ్రంగా ఉంచేవాణ్ని.

రాత్రి రెండు గంటలకోసారి లేచి ఆమె పడుకున్న భంగిమను మార్చేవాణ్ని. నిజానికామె ఈ లోకంలో లేదు, మనలో మనిషి కాదు. నేనెవరో కూడా ఆమె గుర్తుపట్టేది కాదు. కానీ నాకు ఆమెవరో తెలుసు కదా. ఆ తొమ్మిదేళ్లూ నేను ఇల్లు కదిలి బైటికి వెళ్లిందే లేదు...'' అని చెప్పారు. చినరాజు భార్య రాజకుమారి మరణం తర్వాత ఇంటి లాన్‌లో విగ్రహం ఒక హాల్లో నిలువెత్తు ఫోటో పెట్టుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఆమె విగ్రహానికి నమస్కారం పెట్టుకుని, వెళ్లొస్తానని చెప్పిగాని గుమ్మం దాటరాయన.

అన్నేళ్ల దాంపత్యంలో ఒక్కసారయినా తగువన్నది రాలేదా? అని అడిగితే "భార్యాభర్తలన్నాక చిన్నచిన్న మాటలుండవేటమ్మ? అలాంటివుండీవిగానీ పెద్ద పోట్లాటలు, మాటలు మానెయ్యడాలు... ఇలాంటివెప్పుడూ లేవు. ఒకర్నొకరు సంప్రదించుకునే ఏ పనయినా చేసీవారం. ఇంకేటి తగువు? నా భార్య దేవతమ్మా. అసలు దేవత అనేది చాలా చిన్న పదం. అంతకన్నా గొప్పది నా భార్య. కేవలం నా భార్య అనే కాదు. భర్త గురించి ఏమీ తెలియకుండా కేవలం మంగళసూత్రాన్ని నమ్మి మెట్టినింటికి వచ్చే ప్రతి ఆడపడచూ దేవతే.

తల్లిదండ్రులు, తోబుట్టువులు, పుట్టినిల్లు, ఊరు.... అన్నీ వదులుకొని మన వెంట వచ్చేస్తాది కదమ్మా. కేవలం మొగుడన్నవాడి మీద నమ్మకంతోనే కదమ్మ వచ్చేది. నా భర్త అన్నీ తానయి నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడన్న విశ్వాసం. మరలాంటప్పుడు మగోడు భార్యనెలా చూసుకోవాలి?'' అని ఎదురు ప్రశ్నిస్తారు చినరాజు. చదువుకున్నవాళ్లంటే రాజకుమారికి చాలా ఇష్టమట. అందుకని ఆమె పదోతరగతి పాసయిన వీరఘట్టం ఉన్నత పాఠశాలలో ప్రతి ఏడూ ఆ తరగతిలోని మొదటి మూడు స్థానాల్లో నిలిచేవారికి మూడు, రెండు, వెయ్యి రూపాయల చొప్పున బహుమతులు అందిస్తున్నారాయన.

ఆమె జయంతి, వర్థంతులప్పుడు తన సొంతూరు నడుకూరులో కట్టిన గుండం (స్మారక సమాధి) దగ్గర దీపం వెలిగించి అన్నదానం చేస్తుంటారు. "ఇవన్నీ గొప్ప పనులని నేను చెప్పను. కాని ఏదో తోచినంత చెయ్యాలని'' అన్నారాయన మొహమాటంగా. అంతలోనే తలవాల్చుకున్నారు దేనికో చిన్నబోతున్నట్టు. "నేను చేస్తున్నదెంత? చేసిందెంత? ఆమె నన్ను ప్రేమించిన తీరు ముందు ఇవన్నీ చాలా చిన్నవి...'' తనకు తాను చెప్పుకొంటున్నట్టే అన్నారు.

మళ్లీ తేరుకున్నారు. "ఈ రోజుల్లో ప్రేమాదోమా అంటారు కదమ్మా. నేను దానికస్సలు విలువివ్వను. అంటేటి, చూసీచూడగానే ప్రేమంటే అవతలి వాళ్ల రూపాన్ని ఇష్టపడ్డారన్నమాట. అదేం ప్రేమ, నా మొఖం. దాన్ని ఆకర్షణ అంటారు. అసలు ప్రేమెప్పుడు పుడుతుంది? కొన్నాళ్లు కలిసున్నాక ఒకరి గురించి ఒకరికి అర్థమయ్యాక వచ్చేది అభిమానం. అది చాలా ముఖ్యం. అది లేకనే కదా ఇప్పుడు మన సమాజంలో విడాకులు పెరిగిపోతున్నాయి.

దానికీ నేను మగోళ్లనే తప్పు పడతాను. ఈళ్లు సరిగ్గా ప్రవర్తిస్తే చాలా సమస్యలుండవు. అంతెందుకు, ప్రేమిస్తున్నామని చెప్పే ఎదవలు అది నిజమైన ప్రేమే అయితేగనక యాసిడ్లు పొయ్యడాలు, వేధించడాలు చెయ్యగలరా అసలు'' కోపంగా అన్నాడాయన. ఇంటర్వ్యూ అయిపోయి 'రాజకుమారి నిలయం' నుంచి బైటికొస్తుంటే చిట్టి సందేశాన్ని మోసుకొచ్చానంటూ సెల్‌ఫోన్ మృదువుగా మోగింది. చదివాను - 'జీవితానికి ప్రేమపూర్వకమైన అర్థాన్నిచ్చేది ఎవరో ఒక మనిషి ఉనికి కాదు. ఆ మనిషి నీ హృదయాన్ని స్పృశించిన తీరు'. ఆగిపోయిన చాలా సేపటి తర్వాత కూడా పరిసరాలను సుగంధభరితం చేసే అగరొత్తి ధూపంలాగా రాజకుమారి ప్రేమ అక్కడంతా ఆవరించి ఉన్నట్టనిపించింది.

0 comments:

Post a Comment