Monday

పరువుహత్యలు తప్పంటూ ఫత్వా...


ఫత్వా అంటే ముస్లిం మత గురువులు జారీచేసే ఉత్తర్వు. దానికి విరుద్ధంగా ముస్లింలు వ్యవహరించడానికి వీల్లేదు. తాజాగా, పరువు హత్యలను తీవ్రంగా విమర్శిస్తూ దాదాపు 30 మంది అమెరికన్ ఇమాంలు ఓ ఫత్వా జారీ చేశారు. కుటుంబ పరువుప్రతిష్ఠలను మంటగలిపారంటూ కుటుంబంలోని నలుగురు మహిళలను హతమార్చిన అఫ్ఘాన్ జాతీయులను కెనడా కోర్టు దోషులుగా తేల్చిన తర్వాత ఈ ఫత్వా జారీ అయింది.

ఇస్లాంలో అసలు పరువు హత్యలకు, గృహహింసకు, మహిళలను ద్వేషించడానికి స్థానం లేదని ఇస్లామిక్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ కెనడా (ఐఎస్‌సీసీ)తో పాటు అమెరికా, కెనడాలకు చెందిన 34 మంది ఇమాంలు సంతకాలు చేసిన ఫత్వాలో పేర్కొన్నారు. భార్యను గానీ, పిల్లలను గానీ ఏ రకంగానైనా హింసించడాన్ని నిషేధించామని, భార్యాభర్తల సంబంధం పరస్పర ప్రేమ, దయాగుణాలపైనే ఆధారపడుతుందని అందులో తెలిపారు.

షఫియా కేసు విచారణ కారణంగానే ఈ ఫత్వాను జారీచేసినట్లు ఐఎస్‌సీసీ వ్యవస్థాకుడు ఇమాం సయ్యద్ సోహర్‌వార్డీ చెప్పారు. వ్యాపారం చేసుకునే మహ్మద్ షఫియా (58), ఆయన భార్య టూబా యాహ్యా (42), హమీద్ (21) కలిసి హత్యలకు పాల్పడినట్లు కింగ్‌స్టన్‌లోని కోర్టు తేల్చి, వారికి 25 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఈ జంటకు చెందిన ముగ్గురు కుమార్తెలతో పాటు, షఫియా మొదటి భార్యను కూడా వీరు హతమార్చినట్లు తేలింది.

0 comments:

Post a Comment