Monday

నిజమైన సంపద...!


సుఖదుఃఖాలు కావడికుండల లాంటివి. జీవితంలో కష్టనష్టాలను సమానంగా స్వీకరించాలి. ఏదో వొకింత నష్టము, కొంత కష్టం కలిగిన వెంటనే కుంగిపోవడం, బాధపడడం, ఆత్మహత్యకు పాల్పడడం చేస్తుంటారు కొందరు. కానీ, ఆ నష్టం కలగడం వల్లే, కష్టం రావడం వల్లే వారికి భవిష్యత్తులో ఊహించని మంచి జరగవచ్చు. కాబట్టి కొంత ఓర్పు, సహనం అవసరం. కర్మపాలుడు ఒక రచయిత. నిశితమైన పరిశీలనా దృష్టి కలవాడు. ఊరేగింపులు, ప్రధాన కూడళ్లు, సంతలు వంటివి ఆయన ఎక్కువ సమయాన్ని గడిపే స్థలాలు. తాను గమనించి, గ్రహించిన విషయాల ఆధారంగా చక్కటి కథలను రాసేవాడు. తల్లిదండ్రుల నుంచి అతనికి వచ్చిన ఆస్తి రెండు లక్షల వరహాలు సంపాదనకై శ్రమించాల్సిన అవసరం లేకపోవడం వల్ల హాయిగా తింటూ, తిరుగుతూ ఆసక్తికరమైన కథలను అల్లుతూ కాలం గడిపేవాడు. వాటిని చదివి ఎందరెందరో వచ్చి అతడిని పొగిడేవారు. కర్మపాలుడు ఈ పొగడ్తలకు పొంగిపోయేవాడు. పడేసే పొగడ్త!

మహానాగుడు కర్మపాలుని చిరకాల మిత్రుడు. ఒక రోజు కర్మపాలునితో మహానాగుడు 'మిత్రమా! నీవు రాసిన 'వైరంభ మండలం' కథ ఎంతో బాగుంది. ఎన్నిసార్లు చదివినా ఇంకా ఇంకా చదవాలనిపిస్తోంది. కథ చెప్పిన విధానం అద్భుతం. పాత్రల వర్ణన చాలా బాగుంది. రత్నశ్రేష్ఠి పాత్రను నీవు తీర్చి దిద్దిన తీరు, ఆ పాత్ర ద్వారా సంఘానికి నీవు ఇవ్వదలచిన సందేశం నా మనసుపై చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా వ్యాపారం చేయదలచిన వారికి రత్నశ్రేష్ఠి చేసే సూచనలు ఎంతో ఉపయోగకరం, లాభదాయకం. ఆ సూచనలు పాటించి నేనూ ద్వీపాంతరం వ్యాపారం చేయాలనుకుంటున్నాను. ఒక నౌక సువర్ణ ద్వీపానికి ఎల్లుండి పోతుంది. ఆ ద్వీపంలో సుగంధ ద్రవ్యాలకు మంచి గిరాకీ ఉంది.

ఒక వరహాకు రెండు వరహాల లాభమొస్తుంది. సరుకుని కొని పంపడానికి నా వద్ద ఉన్న రెండు లక్షల వరహాలను పెట్టుబడిగా పెట్టి సుగంధ ద్రవ్యాలను కొని పంపదలచాను. ఒక ఆరు నెలలు తిరగకనే రెండింతల డబ్బు నాకు వస్తుంది. నీ వద్ద కూడా ఉన్న డబ్బును ఇవ్వు. పెట్టుబడిగా వినియోగించి వచ్చిన లాభాన్ని నీకు ఇస్తా' అన్నాడు. కర్మపాలుడు ఊహాలోకంలోకి వెళ్లిపోయాడు. ఎంతో సంపద వచ్చినట్లు, విలాసవంతమైన భవనంలో అందమైన భార్యాపిల్లలతో గడుపుతున్నట్లు రంగుల కలలు కన్నాడు. ఏ మాత్రం ఆలోచన చేయక ఇంట్లో ఉన్న సొమ్మునంతా తెచ్చి మహానాగుని చేతిలో పెట్టి నిజమైన మిత్రుడంటే నీవే అన్నాడు.

సంపద సముద్రంపాలు మహానాగుడు సరుకులు కొని నౌకలో బయలుదేరాడు సువర్ణద్వీపానికి. కొన్ని రోజుల తర్వాత నౌక నడిసముద్రంలో మునిగిపోయినట్లు కర్మపాలునికి సమాచారం అందింది. కర్మపాలుడు గుండెలు బాదుకున్నాడు. 'అయ్యో! అయ్యో! ఎంత పని అయింది. నా కొంప మునిగింది. నా సంపదంతా సముద్రం పాలయింది. మహానాగుడు వచ్చినపుడు నేను ఇంట లేకపోయుంటే ఎంత బాగుండేది! నా వద్దనున్న సంపదంతా దీపంకర శ్రేష్ఠికి ఇచ్చినానని ఒక్క అబద్ధమాడి ఉంటే బాగుండేది.

ఆ పాడు కథ నేను రాయకపోయినా బాగుండేది' అని ఏడ్చాడు. 'కర్మపాలా! నౌక మునిగిపోలేదు. తుపానులో దారి తప్పి ఆలస్యమైంది అంతే. సరుకుపై ఎంతో లాభం వచ్చింది. ఇదో నీ భాగం నీవు తీసుకో' అని మహానాగుడు వచ్చి చెబితే ఎంత బాగుండునని ఊహించాడు. ఎన్నెన్నో ఊహలు, ఎన్నెన్నో కల్పనలు-మెదడు వేడెక్కింది..హృదయం భారమైంది. తట్టుకోలేక బుద్ధ భగవానుడున్న బేతవనానికి పరుగులు తీశాడు.

బుద్ధుని జ్ఞానబోధ కర్మపాలుని మానసిక ఆందోళనను గ్రహించిన బుద్ధ భగవానుడు అతనికి మానసిక ప్రశాంతతను సత్వరమే ఇవ్వగల 'ఆనాపానసతి'ని వివరంగా బోధించాడు. 'సుఖాసనంలో కూర్చో. వెన్నెముక వంగకుండా నిటారుగా కూర్చో. కళ్ళు మూసుకో. లోపల ఏమీ గొణగవద్దు. ఆలోచనలను గమనించు. శ్వాస, నిశ్వాసలపై ధ్యాస ఉంచు. శ్వాస సంచార స్పర్శ ముక్కు కొన వద్ద ఉంటుంది. గమనిస్తూ ఉండు...' అంటూ బుద్ధుడు ఇచ్చిన ఆదేశాలను పాటించాడు కర్మపాలుడు. కొన్ని క్షణాల్లోన్నే సత్ఫలితాన్ని పొందాడు. ప్రశాంతతను చవిచూశాడు. ఇంకా ఉన్నత స్థాయిని కూర్చే ధ్యాన పద్ధతులను బోధించమని బుద్ధుని అతడు వేడుకున్నాడు. ప్రేమమూర్తి కాదనలేదు. అవధులు లేని ఆనందం అతని సొత్తయింది.

పోగొట్టుకున్న సంపద కేవలం ఒక గులకరాయిలా, బుద్ధ భగవానుని కృప వల్ల తాను పొందిన ఆనందం వశిరాజ మహామణిలా ఉన్నాయి కర్మపాలుని దృష్టిలో. తనకు కలిగిన తాత్కాలిక స్వల్ప నష్టం, దుఃఖం శాశ్వతమైన లాభాన్ని, సంతోషాన్ని పొందడానికి మార్గాన్ని ఏర్పరచాయని గ్రహించాడు. సంతృప్తిగా శేష జీవితాన్ని గడిపాడు. అతని ప్రతి శ్వాస బుద్ధ భగవానుని పట్ల కృతజ్ఞతను తెలియపరచింది.

0 comments:

Post a Comment