Monday

మర మనుషులం కాదుగా


సాయంత్రం 6 అవుతోంది... ఆ సభలో కూర్చున్న వారిని చూస్తే, వారిలో ఎక్కువ మంది ఒకే తరహా సామాజిక, మానసిక స్థితిలో ఉన్నట్లు ఎవరైనా సులువుగానే గుర్తిస్తారు. ఒక ప్రాంతంలోని ప్రాచీన కాలపు వృత్తి పరికరాలను సేకరించి, వాటి విశిష్ఠతలను పరిశీలించే ఒక వ్యక్తి ప్రసంగం కోసం ఏర్పాటు చేసిన సభ అది. ఉన్నత విద్యలూ, ఉన్నతోద్యోగాలు అన్నీ ఉన్న ఒక ప్రత్యేక తరగతికి చెందిన వారే ఆ సభకు ఒక్కొక్కరుగా వచ్చి చేరుకున్నారు. ఎవరికి డబ్బులకేమీ కొదవలేనట్లే అనిపించింది. కాకపోతే .....

ఎవరి ముఖంలోనూ ఆ సజీవత్వం కనిపించడం లేదు. జీవితాన్నేదో పర్వతాన్ని మోసినట్లు మోస్తూ, ఆ కుర్చీల్లో వాలిపోయారు. ఏమైతేనేం ప్రసంగం మొదలయ్యింది. ప్రాచీన వృత్తి పరికరాల విశిష్ఠతల గురించి చెబుతూ ఆ క్రమంలో ఒక నాటి వృత్తి వేళలకూ, ఈ నాటి వృత్తి వేళలకూ మధ్య ఉన్న తేడాను వివరిస్తున్నారు. అదే సమయంలో మనుషుల్లో ఒకనాడు లేని మానసిక ఒత్తిళ్లు, దిగులు, ఆందోళన ఇప్పుడు ఎందుకు ఉన్నాయో వివరించడం మొదలు పెట్టాడు వక్త.

"అవసరం ఉన్నవన్నీ కొనుక్కుంటూ పోతే, ఏదో ఒక రోజున అత్యవసరమైన వాటిని అమ్ముకోవలసి వస్తుంది.'' అన్నాడో ఆర్థిక వేత్త. ఆర్థిక మేకాదు, అతిగా వ్యవహరించే జీవితంలోని అన్ని సందర్భాలకూ ఈ సత్యం వర్తిస్తుంది. అవసరాలు పెరిగే కొద్దీ వాటికి అనుగుణంగా మన సంపాదన కూడా పెర గాలి కదా! అంటూ ఉంటారు. కానీ, అవసరాలు వాటికవే పెరిగాయా? మనమే వాటిని పెంచుకున్నామా? అని ప్రశ్నించుకుంటే, కాస్త ఆలస్యంగానే అయినా ఒక సమాధానం వస్తుంది. మన ం అవసరాలు అనుకుంటున్న వాటిలో సగానికి పైగా మనం పెంచుకున్నవే ఉంటాయి. అయినా పెరిగితే ఏమిటి? పెంచుకుంటే ఏమిటి? అవన్నీ మన జీవితానికి ఉపకరించేవే కదా! అనిపించవచ్చు. కానీ, ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్న ఆ అవసరాల కోసం మనం ఏమైపోతున్నాం? రెట్టింపు చాకిరీ చేస్తున్నాం. దీని వల్ల కొన్నిసార్లు విశ్రాంతికీ, చివరికి నిద్రకు కూడా దూరమవుతున్నాం.

వరుసగా కొంత కాలం నిద్రకు దూరమైతే ఆ తరువాత నిద్ర కావాలన్నా రాకుండా పోతుంది. నిద్రలేమి కేవలం శారీరక సమస్యే కాదు. దీర్ఘకాలికంగా ఆ సమస్య కొనసాగితే, అది ఒక మానసిక రుగ్మతకూ దారి తీయవచ్చు. దిగులూ ఆందోళనా, మానసికమైన కుంగుబాటు వంటి సమస్యలతో ఎక్కువ కాలం సతమతవుతున్న వారు అన్నీ ఉండి ఏమీ లేని వారిలా జీవిస్తారు. ఏదో ఒక దశలో తమకేదో అయిపోతోందని గుర్తించి, మానసిక వేత్తల వద్దకూ, ఆధ్యాత్మిక వేత్తల వద్దకూ తిరిగే పరిస్థితిలో పడిపోతున్నారు....'' వక్త మాటలు అక్కడ కూర్చున్న వారి గుండెల్లో సూటిగా గుచ్చుకుంటున్నాయి.

వారి స్థితిని గమనించిన వక్త వాక్పటిమను పెంచారు. " ఎక్కడైనా 8 గంటలు పనిచేసే వారు మనిషి అవుతారు. 16 గంటలు పనిచేసే వారు దెయ్యమవుతారు.'' అన్నారు. సభలో పిన్‌డ్రాప్ సైలెన్స్. ఆ మాట సరిగ్గా తమమీదే ఎక్కుపెట్టిన బాణంలా ఉందేమో, అందరూ తమలోకి తాము చూసుకోవడం మొదలెట్టారు. ఎంత కాదనుకున్నా ఇది ముమ్మాటికీ నిజమే... నిజమే అన్న ప్రతిధ్వని అందరి మనసుల్లో మార్మోగినట్టనిపించింది.

నిజమే కదా! సాంస్కృతిక విషయాలకో, మానసిక ఉల్లాసానికో ఏ మాత్రం సమయం లేని, ఎంత సేపూ వృత్తిపరమైన పనులకే పరిమితమైన వారు సహజంగా ఎలా ఉంటారు? అసహజత్వమేదో ఆవరించి దెయ్యంలాగే ఉంటారు. అవసరాలు అలాగే వున్నాయి కదా! అనే మాటను ఎదుటి వారెవరూ కాదనరు. కానీ, నీకు జరుగుతున్న నష్టమేదో నీకే తెలిసిపోతుంది కదా! అందుకే మనిషి మెలుకువతో ఉండే 16 గంటల్లో 8 గంటలకే వృత్తి పనులకు కేటాయించాలని, మిగతా 8 గంటలు మానసిక ఉన్నతికి, ఉల్లాసానికీ వినియోగించాలన్న సత్యాన్ని ఆ వక్త సింపుల్‌గా, సూటిగా చెప్పారనిపించింది. ఆ వాక్యాలు అక్కడున్న వారికే కాదు... అందరికీ వర్తిస్తాయేమో?!

0 comments:

Post a Comment