Monday

నైజీరియాలో జాతుల ఘర్షణ: 66 మంది మృతి


నైజీరియా ఆగ్నేయ ప్రాంతంలో రెండు జాతుల మధ్య ఘర్షణల్లో మహిళలు, పిల్లలుసహా 66 మంది బలయ్యారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న 'బోకో హరామ్' ఇస్లామిక్ తీవ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు అధ్యక్షుడు గుడ్‌లక్ జొనాథన్ నాలుగు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఎబోనీ రాష్ట్రంలో తలెత్తిన ఓ భూ వివాదం ఎజ్జా, ఎజిలో జాతుల మధ్య హింసకు దారితీసినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. మృతులలో ఒక డివిజనల్ పోలీసు అధికారి కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. బొర్నో, యోబే, నైగర్, ప్లాటూలలో అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంగా అధ్యక్షుడు జాతీయ టీవీ ప్రసారంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 


ఏ పరిస్థితుల్లో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందో ఆయన వివరించారు. క్రిస్మస్ సందర్భంగా బోకో హరామ్ తీవ్రవాదులు ఓ చర్చిలో పేలుడుకు పాల్పడి 47 మందిని బలిగొన్న సంగతిని గుర్తుచేశారు. 'ఉగ్రవాదం మనపై యుద్ధమే. దీన్ని సమష్టిగా ఎదుర్కొనకపోతే బోకో హరామ్ వంటి వర్గం కేన్సర్‌లా జాతిని కబళించే ప్రమాదం ఉంది. కాబట్టి దేశంలోని ఏ ప్రాంతంలో అది దుశ్చర్యలకు పాల్పడినా మనందరిపైనా దాడిచేసినట్లే భావించి తిప్పికొట్టాలి' అని ప్రజలకు పిలుపునిచ్చారు.

0 comments:

Post a Comment