Tuesday

స్టాలిన్ కుమార్తె స్వెత్లానా మృతి





సోవియెట్ నియంత జోసెఫ్ స్టాలిన్ ఏకైక కుమార్తె స్వెత్లానా అల్లిలుయేవా అలియాస్ లానా పీటర్స్ (85) విస్కాన్సిన్‌లో ఈ నెల 22న మరణించారు. ఆమె పెద్దప్రేగుల కేన్సర్‌తో బాధపడుతూ కన్ను మూశారని పంచనామా అధికారి కారొనర్ మేరీ ట్యూనర్ తెలిపారు. కమ్యూనిజాన్ని, తన తండ్రి పాలన విధానాలనూ ఇష్టపడని ఆమె, అగ్ర రాజ్యాల ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో 1967లో భారత్ ద్వారా అమెరికాకు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఆ రోజుల్లో అంతర్జాతీయంగాపెద్ద గగ్గోలు సృష్టించి సోవియెట్‌ను బాగా ఇరుకున పెట్టింది. 




తన మూడో భర్త, భారత కమ్యూనిస్టు నేత బ్రిజేశ్ సింగ్‌కు చికిత్స అందించే విషయంలో అప్పటి సోవియెట్ అధికారులు పట్టించుకోక పోవడమే స్వదేశాన్ని విడిచిపెట్టి ఆమె వెళ్లిపోవడానికి కారణమైందని చెపుతారు. సోవియెట్‌లోనే మరణించిన బ్రిజేశ్ సింగ్ చితాభస్మాన్ని నిమజ్జనం చేయడం కోసం భారత్ చేరిన ఆమె, మరి వెనక్కి వెళ్లలేదు. అప్పుడే ఢిల్లీలోని అమెరికా ఎంబసీకి చడీచప్పుడూ లేకుండా వెళ్లి తనకు ఆశ్రయం ఇవ్వాలని కోరడం ఎందరినో ఆశ్చర్యచకితులను చేసింది.
ఆ తరువాత కొన్నాళ్లు స్విట్జర్లాండులో గడిపిన ఆమె, చివరకు తన ఇద్దరు పిల్లలతో అమెరికా చేరుకున్నారు. రష్యాలో తన జీవితానికి అక్షర రూపం ఇచ్చి 1963లో రాసుకున్న స్వగతం.. అమెరికా చేరిన నెల్లాళ్లకే 'ట్వెంటీ లెటర్స్ టు ఏ ఫ్రెండ్' పేరుతో ముద్రణకు నోచుకుని బాగా అమ్ముడైన గ్రంథంగా రికార్డులకెక్కింది. తదనంతర కాలంలో ఆమె విలియం వెస్లీ పీటర్స్‌ను వివాహం చేసుకున్న సమయంలో తన పేరును లానా పీటర్స్‌గా మార్చుకున్నారు. 1980 దశకంలో ఆమె స్వదేశానికి వెళ్లినా అక్కడ ఇమడలేక మళ్లీ అమెరికా వెళ్లిపోయారు.

0 comments:

Post a Comment