Tuesday

కష్టాల్లోనూ మరువని నిజాయితీ....


ప్రతిరోజూ కడుపు నింపుకోవడానికే అష్టకష్టాలూ పడాల్సిన దుస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుండి ఓ రోజు నోట్ల కట్టలు కనిపిస్తే.. ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కష్టాలకు కాలం చెల్లిందని మురిసిపోతారు. కానీ అందరూ అలాగే ఉండరు కదా. నిజాయతీకి నిలువెత్తు ప్రతిరూపాలు కూడా ఉంటాయి. బ్రెజిల్‌లోని సావోపాలో నగరంలో వీధుల వెంట చెత్త ఏరుకుని.. జీవనం సాగిస్తున్న ఓ దంపతులు ఇలాగే నిజాయతీకి నిదర్శనంగా నిలిచారు.

ఓ రోజు వీధి వెంట నిద్రిస్తుండగా.. గట్టిగా అలారమ్ చప్పుడు వినిపించింది. ఏం జరుగుతోందో అని ఉలిక్కి పడి లేచి చూశారు. దగ్గర్లోని బస్టాప్‌లో ఓ బ్యాగు కనిపించింది. తెరచి చూడగా..అందులో ఐదు లక్షల రూపాయలకుపైగా ధనరాసులు కనిపించాయి. సమీపంలోని సెక్యూరిటీ గార్డు సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. దొరికిన బ్యాగును వారికి అప్పగించి హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకున్నారు.

విశేషమేమిటంటే ఆ దంపతుల్లో రెజనీల్‌సిల్వసంతోష్(36) రోజు వారీ సంపాదన.. మన రూపాయల్లో నాలుగు వందలు మాత్రమే. ఇంత నీజాయతీ వెనుక ఉన్నది అతడి మాతృమూర్తి కావడం విశేషం. "ఎప్పుడూ దొంగతనం చేయకూడదని మా అమ్మ చెప్పింది. ఈ రోజు నన్ను మా అమ్మ టీవీలో చూసి నా కొడుకు నిజాయతీ పరుడు అనుకుంటే చాలు'' అని సంతోష్ చెప్పాడంటే.. అమ్మ మాటల పట్ల అతడికున్న గౌరవం ఏ పాటిదో తెలుస్తూనే ఉంది.

0 comments:

Post a Comment