Tuesday

అమెరికా యుద్ధాలూ, పాశ్చాత్య ప్రజలూ...!


'మరి మన దేశంలో పరిస్థితి మాట ఏమిటి?'- దండకారణ్యంలో ఒక మునిమాపు వేళ మావోయిస్టు నాయకులను కలుసుకోవడానికి వెళుతూ పై ప్రశ్నకు సమాధానాన్ని నాలో నేనే తర్కించుకున్నాను. చిన్న దేశమే కాని క్రూర సామ్రాజ్యవాద పాశ్చాత్య రాజ్యమది. సమాజంలోని సకల రంగాలలోను సంక్షోభం తీవ్రమవుతూ, కొత్త యుద్ధాలు ప్రజ్వరిల్లుతోన్న సందర్భంలో ఉన్న మాదేశంలోని పరిస్థితిపై ఆ మునిమాపు వేళ నాలోనేను చర్చించుకున్న విషయాలను భారత్‌లో ఇటీవలే ప్రచురితమైన 'red star over india- as the wretched of the earth are rising'లో రాశాను. 

'సరే, ప్రజలు పోరాడుతున్నారు. వర్గ విభజనలు మరింత బాధాకరంగా పెరుగుతున్నాయి. వర్గ పోరాటం తీవ్రమవుతున్నది. ఈ పోరాటాల గురించి మీరు ప్రతి రోజూ అమెరికా, స్వీడన్ నుంచి, అలాగే ఫ్రాన్స్, జర్మనీ నుంచి మీరు తెలుసుకోవచ్చు. అయితే అవి ఎలాంటి సంస్థాగత నిర్మాణమూ, నాయకత్వమూ, చైతన్యశీల అవగాహనా లేని స్వతసిద్ధ పోరాటాలు. అమెరికాలో, ద్వితీయ ప్రపంచ యుద్ధం తరువాత, మెకార్థీ హయాంలో కార్మిక వర్గ సంస్థలను రూపుమాపారు. మా (పాశ్చాత్య)దేశాలన్నిటా కార్మిక సంఘాలను అధికారిక 'వామ' పక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. 

- ఇది సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలపై (ప్రతికూల) ప్రభావాన్ని చూపుతోంది. దశాబ్దం క్రితం వరకు అధికారికంగా అలీన దేశంగా ఉన్న మా దేశం స్వీడన్ ఇప్పుడు తన సైనికులతో అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా ప్రయోజనాలను కాపాడుతోంది. అయితే సంఘీభావ ఉద్యమం ఉంది. బిషప్‌లు, ఇంకా క్రియాశీలంగా ఉన్న పాత తరం సోషల్-డెమోక్రాటిక్ రాజకీయవేత్తలతో కూడిన ఉద్యమమది. తన విధానాలను మార్చుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే శక్తిమంతులమయ్యేంత దాకా ఆ ఉద్యమం పెరుగుతూనే ఉంటుందనే ఆశాభావం మాకు ఉంది. అయితే ఒక ప్రమాదం ఉంది. ఆ ముప్పు ప్రత్యేకమైనది. - అధికారిక వామపక్షాలు వలసవాద యుద్ధాలను వ్యతిరేకిస్తున్నాయి. 

అయితే రాజకీయ వాస్తవాలను ఎదుర్కోవలసి వచ్చేటప్పటికి సోషల్ డెమోక్రాటిక్ పార్టీ అమెరికా రాయబారికి చెప్పిందేమిటి? ప్రతిపక్షంగా సామ్రాజ్యవాద యుద్ధాలను వ్యతిరేకించినప్పటికీ అప్ఘానిస్తాన్, బాల్కన్ రాజ్యాలలో అమెరికా విధానాలను పూర్తిగా సమర్థిస్తామనే కాదూ?' ఇదీ, మా దేశంలో నెలకొనివున్న పరిస్థితి గురించిన అభివర్ణన అని నేను విశ్వసిస్తున్నాను. అయితే ఈ పరిస్థితి ఎలా వచ్చింది? దీనికొక మామూలు సమాధానం మా అధికారిక భావజాలం- అభివృద్ధి నిరోధక, ఉదారవాద, సంస్కరణల పరంగా -లో ఉంది. అది కార్మిక వర్గ మరణానికి రాజకీయ వ్యక్తీకరణేనని ఆ భావజాలం చెబుతుంది. 

అయితే ఇది నిజమా? ఒక వర్గపు నిర్దిష్ట స్వరూప స్వభావాలు మారుతున్న సాంకేతికతల, సామాజిక అవసరాలపై ఆధారపడివుంటాయి. స్వీడన్‌లొ గానీ, ఇతర పాశ్చాత్య దేశాలలో గానీ గతంలో భౌతిక శ్రమ చేసేవారి పరిస్థితి 2012లో ఉన్న విధంగా లేదు. ఈ నిర్దిష్ట వర్గ పరిస్థితిని విశ్లేషించాలి. అయితే అది తమ శ్రమ ను అమ్ముకొని జీవించాల్సిన పరిస్థితిలో ఉన్న వారి జీవన వాస్తవాలను మార్చలేదు. తమ సామాజిక హోదా గురించి ఆ శ్రామికులు ఏమి విశ్వసిస్తున్నప్పటికీ వారు శ్రామికులే అన్నది వాస్తవం. ఇటువంటి వారు కూడా మా దేశాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

స్వీడన్ లేదా అమెరికా నగరాల శివార్లలో సొంత విశాల గృహాలలో నివశిస్తున్నవారు, బ్యాంకు ఖాతాలో డబ్బు బాగా నిల్వ ఉన్నవారు మధ్యతరగతికి చెందిన వారే అయినప్పటికీ వాస్తవం మారదు. ఇది ప్రస్తుత సంక్షోభంలో స్పష్టంగా కన్పిస్తోంది. ఆర్థిక మాంద్యంలో ఉద్యోగం కోల్పోయిన బ్యాంక్ మేనేజర్ తన గృహానికి ఇంకెంత మాత్రం యజమాని కాడు; దాని కొనుగోలుకు రుణం ఇచ్చిన బ్యాంకుకే ఇప్పుడు ఆ ఇల్లు చెందుతుంది. అసలు పరిస్థితి ఏమిటో తెలిసివస్తుంది. అతను /ఆమె ఒక ఉద్యోగి మాత్రమే ఉద్యోగి అంటే మరో వ్యక్తికి లేదా వ్యాపార సంస్థకు వేతనం తీసుకొని పని చేసే వ్యక్తి అని నిఘంటువు నిర్వచించింది. ఉద్యోగికి పర్యాయపదం సేవకుడు. 

ఈ పరిణామపు రాజకీయ ప్రాధాన్యం మరో విషయం. వర్గ చైతన్యమనేది దానికదే ఏర్పడదు. నగర శివారులోని విశాల గృహంలో నివశిస్తున్న అతను/ ఆమె తన చుట్టూ ఉన్న సమాజంలో సుస్థిరత ఉండాలని కోరుకుంటారు; తాము మధ్యతరగతికి చెందిన వారమని భావించే అతను/ ఆమెకు నిజానికి సమాజంలో తమ సామాజిక హోదా ఏమిటో తెలియదు. తనకు తానుగా ఒక వర్గంగా ఉన్న స్థితి నుంచి తనను తాను విముక్తపరచుకోవల్సిన వర్గం స్థాయికి ఎదగవల్సిన శ్రామిక వర్గానికి వారు ఇప్పటికీ తక్కువగానే చెందుతారు. 

ప్రస్తుత యుగంలో సామ్రాజ్యవాద దేశాలలో నిజమైన వర్గ పరిస్థితి పై చైతన్యశీలమైన అవగాహన సాధారణంగా చాలా పరిమిత స్థాయిలోనే ఉంది. బ్యాం కు మేనేజర్లు, దుకాణదారులు, లోహ కార్మికులు, ఉపాధ్యాయు లు, గృహ నిర్మాణ కారకులు తమ తమ నిర్దిష్ట పరిస్థితుల నుంచి నిర్దిష్ట ఆసక్తులు, ప్రయోజనాలను కలిగివుంటారు; సాధించుకోవడానికి, కాపాడుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. అంతకు మిం చి వారు ఒక చైతన్యశీల వర్గ స్పృహ ఉన్నవారు కాదు. పోగుపోసిన బంగాళాదుంపల మాదిరిగా వారూ ఒక సమష్టి జనులు మాత్రమే. 

విడివిడిగా వారిలో ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ తమ సమాజపు పాలక వర్గాలు ఆచరించే పాలనాపరమైన భావాలనే వారూ కలిగివుంటారు. ఈ భావస్వామ్యం అనేది నిశ్చితమై ఉండదు. సాధారణ వర్గంలోని వర్గ చైతన్యం ఒక ఉమ్మడి స్పృహను సృష్టిస్తుంది. ఒక రాజకీయ చైతన్యం చరిత్ర పరిణామాన్నే పూర్తిగా మార్చివేయగలుగుతుంది. 

అయితే మా దేశాలలో పాలకుల భావజాలాన్ని పంచుకోవడమనేది చాలా ఎక్కువగా నిశ్చయమైవుంది. అది సాధారణ విశ్వాసాల, సాంస్కృతిక ఆధిపత్యాల రూపాల్లో మాత్రమే కాకుండా భౌతిక , ఆర్థిక ప్రోత్సాహకాల రూపేణా కూడా ప్రజల జీవితాలపై సామ్రాజ్యవాదం ఉక్కు పట్టు గలిగివుంది. సామ్రాజ్యవాద దేశాలలోని ప్రజలు తమను తాము మధ్యతరగతి, ఆ పై స్థాయికి చెందినవారమని భావిస్తున్నవారు వలసవాదం, సామ్రాజ్యవాదం నుంచి తాము ఎంతో కొంత లబ్ధిపొందగలమని కూడా విశ్వసిస్తున్నారు. ఇది ఒక వాస్తవం. మనం అంగీకరించడానికి ఇష్టపడకపోయినప్పటికీ అది వాస్తవం. గతంలోనూ వారూ అలాగే విశ్వసించారు. ఇప్పుడూ విశ్వసిస్తున్నారు. నాజీ జర్మనీయే ఇందుకొక తీవ్ర ఉదాహరణ. 

నాజీల పాలన చాలా క్రూరమైనది. పాశవికమైనది. నిర్బంధ శిబిరాలు, యూదుల మూకుమ్మడి హత్యాకాండ, రాజకీయ హత్యలు. ఒకటేమిటి సకల ఘోరాల కూ, నేరాలకూ నాజీలు పాల్పడ్డారు. హిట్లర్‌కు అనుకూలంగా ఓటు వేయని వారు చాలా పెద్దసంఖ్యలోనే ఉన్న రు. 1932 నవంబర్‌లో జరిగిన జర్మన్ సార్వత్రిక ఎన్నికలలో మొత్తం 35, 758,259 మంది ఓటు వేయగా వారిలో 11,737,021 మంది మాత్ర మే నాజీలు. సోషలిస్టులు, కమ్యూనిస్టులకు కలిపి మొత్తం 13,228,140 ఓట్లు రాగా నాజీయేతరులు 10,793,098 మంది ఉన్నారు. 

జర్మనీకి పక్కనే ఉన్న సార్ అనే ప్రాంతం అప్పట్లో నానాజాతి సమితి ఆధ్వర్యంలో ఉంది. వివిధ రాజకీయ, మత విశ్వాసాలు కలిగివున్న జర్మన్ సోషలిస్టులు, కమ్యూనిస్టులు, ఉదారవాద మేధావులు, యూదులు అందరూ నాజీ బీభత్సానికి భయపడి ఇతర దేశాలకు వలసపోయారు. సార్ లో సోషలిస్టులు, కమ్యూనిస్టులకు మంచి మద్దతు ఉంది. నాజీలకు వ్యతిరేకంగా వారు అనేక ఉద్యమాలు చేశారు. అయినప్పటికీ 1935 జనవరి 13న సార్‌లో ఎన్నికలు జరిగినప్పుడు 90.73 శాతం మంది ఓటర్లు హిట్లర్ ఆధ్వర్యంలోని నాజీ జర్మనీలో చేరేందుకు అనుకూలంగా ఓటు వేశారు. 

ఇదెలా జరిగింది? జర్మన్ల దేశభక్తి ప్రపూరిత భావాల వల్లేనన్నది రాజకీయంగా ప్రస్తుత సరైన వివరణ. అయితే అసలైన సక్రమ వివరణ దానికి భిన్నమైనది. హిట్లర్ పాలనలో జర్మనీలో నిరుద్యోగం వేగంగా తగ్గిపోయింది. యుద్ధ సన్నాహాలలో భాగంగా పునరాయుధీకరణ విధానాన్ని అనుసరించడమే. 

ఇటువంటి విధానం జర్మన్ ప్రజలకే కాక మొత్తం ప్రపంచానికి ముప్పు తెస్తుందని ఉదారవాదులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు హెచ్చరించారు. నాజీల విధానాల పర్యవసానాలు వాస్తవంగా అలానే ఉన్నాయి. అయితే సరైన హెచ్చరిక చేయడంతోపాటు మేము తప్పులు కూడా చేశాం. అంతేకాక మేము సంస్థాపరంగా పటిష్టంగా లేము. పునరాయుధీకరణ విధానం ఫలితంగా నిరుద్యోగం తగ్గుతున్న కొద్దీ ప్రజలు నాజీ పాలనను సమర్థించడం పెరిగింది. నాజీలు, తాము ఆక్రమించుకున్న దేశాలను పూర్తిగా దోచుకున్నారు. జర్మన్ ప్రజలు కూడా ఈ దోపిడీ నుంచి లబ్ధి పొందారు. ఇతర దేశాలు యుద్ధ జ్వాలల్లో హాహాకారాలు చేస్తుండగా జర్మన్లు ప్రశాంతగా సకల సౌఖ్యాలతో తులతూగారు. 

ఈ పరిణామం నాజీ జర్మనీకే ప్రత్యేకమైనదికాదు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో మా దేశాల ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతూ కూడా, కనీసం ఇటీవలికాలం వరకుకూడా తమ నిజమైన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎందుకు ఉద్యమించలేకపోయారనే ప్రశ్నకు ఇది సమాధానమిస్తుంది. వామపక్షాల సంస్థలు బహిరంగంగా, కనీసం గొణుగుతూనే అయినప్పటికీ సామ్రాజ్యవాదుల యుద్ధాలకు మద్దతునిచ్చాయి. ప్రచ్ఛన్నయుద్ధంలో గెలిచిన అనంతరం యూగోస్లేవియా ఇంకా మనుగడలో ఉండవలసిన అవసరం లేదని భావించింది. తత్ఫలితంగానే సెర్బ్‌లు, క్రోయోషియన్లు, ఇతర జాతుల మధ్య అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టి అంతిమంగా యూగో స్లేవియాను కూల్చివేయడం లో సఫల మయింది. 

అమెరికా ప్రస్తుతం తన ఆర్థిక ప్రాభవాన్ని కోల్పోతూ ఒక కాగితపు పులిలా మిగులుతోంది. మావో అన్నట్టు అటువంటి వాటికి కూడా నిజమైన పంజాలు ఉంటాయి. ఆ అగ్రరాజ్యం శక్తి సామర్థ్యాలు నెమ్మదిగా క్షీణిస్తుండగా లక్షలాది ప్రజలు బలిపశువులవుతారు. 19, 20 శతాబ్దాల సామ్రాజ్యవాద కుట్రల, యుద్ధాల కొనసాగింపే ప్రస్తుత అప్ఘాన్ యుద్ధం. అయితే అమెరికా అంతకంతకూ పరాజయం పాలవుతోంది. మిత్ర దేశాలనుంచి సాయుధ బలగాల సహాయం తీసుకున్నప్పటికీ అప్ఘాన్‌లో తన లక్ష్యాన్ని సాధించుకోలేకపోతోంది. 

అమెరికా ప్రస్తుతం చేస్తోన్న యుద్ధాల కొత్త లక్షణం సాధారణ వలసవాదం, దోపిడీ కాదు; తమ ప్రభావ పరిధిలోనివిగా పరిగణిస్తున్న దేశాలలో అభివృద్ధిని సాధిస్తూ స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తోన్న రాజ్య వ్యవస్థలకు ప్రాతిపదికగా ఉన్న జాతీయ వాదాన్ని తన సాయుధ బలగాలను ఉపయోగించి సంపూర్ణంగా రూపుమాపడానికి ప్రయత్నించడమే ఆ కొత్త లక్షణం. ఇప్పటికే భారీగా నష్టపోయిన తన ఆర్థిక వ్యవస్థకు మరెంతగా నష్టం జరిగే అవకాశమున్నప్పటికీ ఈ కొత్త లక్ష్యాన్ని సాధించుకోవడానికి అమెరికా వెనుకాడడం లేదు. 'ప్రజాస్వామ్య విస్తరణ', 'మానవతాపూరిత జోక్యం' పేరిట ఈ యుద్ధనేరాలను మా దేశాలలోని వామపక్షాలు సమర్థించాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. లిబియాలో అవి అమెరికాకు సహాయ సహకారాలు అందించాయి; సిరియా, ఇరాన్‌లలో అమెరికా/ ఇజ్రాయెల్ జోక్యానికి వాటి మద్దతు ఉండవచ్చు. 

0 comments:

Post a Comment