Tuesday

కిడ్నీ కేరాఫ్ ఫేస్‌బుక్ సోషల్ వెబ్‌సైట్లలో పెరుగుతున్న విజ్ఙప్తులు అవయవదానానికి ముందుకొస్తున్న దాతలు


పనీపాటాలేని వారే సోషల్ వెబ్‌సైట్లను ఎక్కువగా ఉపయోగిస్తారని కొంత మంది నిశ్చితాభిప్రాయం. ఫేస్‌బుక్ వంటి సైట్లను ఉబుసుపోని కబుర్లు చెప్పుకునేందుకేనన్నది వారి భావన. అయితే అమెరికాలోని ఓ స్వచ్ఛంద సంస్థ వీరి ఆలోచనలు తప్పంటోంది. సోషల్ వెబ్‌సైట్లతో సరదా కబుర్లతోపాటు ప్రాణాలు కూడా నిలబెట్టవచ్చని వెల్లడిస్తోంది. 

బాల్యం నాటి స్మృతులను ఒకరికొకరు పంచుకోవడంతోపాటు కిడ్నీ అవసరమున్న వాళ్ల విజ్ఞప్తులు కూడా సోషల్ వెబ్‌సైట్లలో ఎక్కువవుతున్నాయని యునైటెడ్ నెట్‌వర్క్ ఫర్ ఆర్గాన్ షేరింగ్ సంస్థ ప్రతినిధి ఏప్రిల్ పాశ్చే తెలిపారు. ముఖ్యంగా కిడ్నీ మార్పిడి అవసరమున్న వారికి ఫేస్‌బుక్ ఆశాదీపంలా కనిపిస్తోందని వెల్లడించారు. దీనిక పలు ఉదాహరణలు చూపెడుతున్నారు. ఫేస్‌బుక్‌వల్లే తన ప్రాణాలు నిలబడ్డాయని సియాటిల్‌కు చెందిన డామన్ బ్రౌన్ వెల్లడించాడు.' నా కిడ్నీ సమస్యను వివరిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ సందేశం ఉంచాను. 

ఆ సందేశాన్ని నా స్నేహితులు, బంధువులు వారికి తెలిసిన ప్రతి ఒక్కరికి పంపించారు. నా విజ్ఞప్తికి అనూహ్యమైన స్పందన లభించింది. కిడ్నీ ఇవ్వడానికి అనేకమంది ముందుకొచ్చారు. చివరికి నా భార్య స్నేహితురాలి కిడ్నీ సరిపోయింది' అని బ్రౌన్ వెల్లడించాడు. కిడ్నీ అవసరమున్న వాళ్లని, కిడ్నీలను దానం చేసే మనసున్న వాళ్లని సోషల్‌వెబ్‌సైట్లు కలుపుతున్నాయని పాశ్చే వివరించారు. ఇటువంటి ఉదాహరణలు అమెరికాలోనే కాక ఆంధ్రప్రదేశ్‌లోను కనిపిస్తున్నాయి. 

హైదరాబాద్‌లో ఇటీవల పదిహేను రోజుల పసికందుకు గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ పసిపాప బ్లడ్ గ్రూప్ 'ఏ' నెగిటివ్ దొరకడం చాలా కష్టమైంది. మూడు రోజులు వెతికినా ఆగ్రూపున్న దాతలు దొరకలేదు. ఆ పరిస్థితుల్లో వారి అవసరాన్ని వివరిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ సందేశం ఉంచారు. ఇది ఉంచిన కొద్ది గంటల్లోనే సుమారు 15 మంది దాతలు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆ పసికందు తల్లిదండ్రులు చమర్చిన కళ్లతో ఆనందంతో వెల్లడించారు.

0 comments:

Post a Comment