Tuesday

మరో ఎదురుదెబ్బ...?


దేశ చరిత్రలోనే అతి పెద్దదైన 2జీ స్పెక్ట్రమ్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానమంత్రి కార్యాలయానికి వ్యతిరేకంగా జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ సందర్భంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులను కోర్టులు విచారించడంపై ఆయా ప్రభుత్వాలు మూడు నెలల్లోగా తప్పక స్పందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు మాజీ టెలికాం మంత్రి రాజా విచారణకు అనుమతి ఇవ్వడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) 16 నెలల సమయం తీసుకున్నదని సుబ్రహ్మణ్య స్వామి త న పిటిషన్‌లో పేర్కొన్నారు. అనుమతి ఇవ్వడానికి కాలపరిమితి అంటూ ఒకటి ఉండాలని సూచించింది. నాలుగు నెలల తరువాత విచారణకు అనుమతి వచ్చినట్లుగా భావించవలసి ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

హోం మంత్రి చిదంబరం పాత్రపై విచారణ చేపట్టాలని కోరుతూ సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ప్రత్యేక కోర్టులో స్వామి పిటిషన్ దాఖలు చేశారు. స్వామి పిటి షన్‌పై సిబిఐ కోర్టు ఫిబ్రవరి 4న విచారణ చేపట్టనుంది. ప్రస్తుత సుప్రీంకోర్టు నిర్ణయం సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిదంబరంపై విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వం గడువులోపు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల విచారణపై సుప్రీం కోర్టు నిర్ణయం యూపీఏ-2 సర్కారు కొంప ముంచే ట్టు ఉంది.

యూపీఏ హ.యాంలో బయటపడ్డ ఆదర్శ్ స్కాం, కామన్‌వెల్త్ క్రీడలు, 2జీ స్కాం వంటి వరుస కుంభకోణాలపై సుదీర్ఘకాలంపాటు స్తంభించిన దర్యాప్తు సుప్రీంకోర్టు చొరవతో వేగం పుంజుకుంది. 2 జీ స్కాంపై దర్యాప్తు, విచారణలు వేగవంతం కావడమే కాకుండా విచారణ జరిపేందుకు పిఎంఒ అనుమతించడంలోని జాప్యం వెనుక ఉన్న కారణాలపై కూడా కోర్టు విచారణ చేపట్టడం చరిత్రాత్మకమైన విషయం. అవినీతి నిరోధక చట్టం పరిధిలో పిఎంఒపై స్వామి వేసిన పిటిషన్ ఒక చట్టబద్దమైన హక్కుగా న్యాయమూర్తులు జిఎస్ సింఘ్వీ, ఎకె గంగూలీలతో కూడిన సుప్రీం ధర్మాసనం అభివర్ణించింది.

ప్రభుత్వ అధికారుల, ప్రజాప్రతినిధుల అవినీతి కార్యకలాపాలపై దర్యాప్తునకు ఉద్దేశించిన సిబిఐ, సివిసి (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) వంటి దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కాబట్టి అధికారంలోని ప్రజా ప్రతినిధులు, వారికి సహకరిస్తున్న ఉన్నాతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తును తొక్కిపెట్టడమనేది ఇప్పటిదాకా సర్వసాధారణంగా జరుగుతున్నదే. తొలి ఆర్థిక సంస్కరణల కాలంనుంచి దేశంలో పూర్తి స్థాయిలో వ్యవస్థీకృతమైన అవినీతి ప్రస్తుతం ముస్తాబవుతున్న రెండవ విడత సంస్కరణల కాలం నాటికి పరాకాష్ఠకు చేరుకుంది.

అవినీతి వ్యవస్థీకృతం అవుతుండడానికి సమాంతరంగా అందుకు అవినీతి వ్యతిరేక పౌరసమాజం ఉద్యమం కూడా క్రమంగా బలపడింది. ఫలితంగా అవినీతి చీకటి కోణాలను తవ్వి తీసే సాధనం అయిన 'సమాచార హక్కు' చట్టం 2005లో ఉనికిలోకి వచ్చింది. దీని ద్వారా అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. అనేక కోర్టు వ్యాజ్యాలు, న్యాయపోరాటాలు నడిచాయి. అనేక మంది విజిల్ బ్లోయర్స్‌గా వ్యవహరిస్తున్న ఆర్టీఏ కార్యకర్తలు ప్రాణ త్యాగానికి వెరవక వివిధ కుంభకోణాలను వెలికి తీశారు.

యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో ఆర్టీఏ ద్వారా బయటపడిన కుంభకోణాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, పౌర, ప్రజాస్వామిక సంస్థలు ఉద్యమించాయి. ఈ ఉద్యమాల ప్రభావంతో సుప్రీంకోర్టు చొరవ తీసుకొని సుదీర్ఘకాలంగా ప్రభుత్వం మూలన పడేసిన సిబిఐ దర్యాప్తులను ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకొంది. అప్పటినుంచి సొంత పార్టీ నాయకులను, సంకీర్ణ మిత్రులను, సన్నిహిత ఉన్నత అధికారులను, కార్పొరేట్ సంస్థలను విచారణ వేటు నుంచి రక్షించేందుకు యూపీఏ ప్రభుత్వం నానా తంటాలు పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో టెలికాం మంత్రి రాజాపై విచారణకు అనుమతించడంలో పిఎంఒ జాప్యం చేస్తోందన్న స్వామి పిటిషన్‌పౖౖె కేంద్రాన్ని ఆదేశించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్వామి పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు 2010 నవంబర్ 24న రిజర్వ్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులపై విచారణ జరుపవలసిన సందర్భంలో ప్రభుత్వాలు అనుసరించవలసిన మార్గదర్శకాలను సూచించాలని సుప్రీం ధర్మాసనాన్ని స్వామి కోరారు. రాజాపై విచారణకు ప్రభుత్వం అనుమతించేందుకు ముందుగా సిబిఐ వద్ద అందుకు తగిన సమాచారం లేకపోవడం వల్లనే జాప్యం జరిగినట్టు పిఎంఒ సమర్ధించుకుంది.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టడం ఇది రెండవసారి. గతంలో సివిసి పిజె థామస్ నియామకం విషయంలో కూడా పిఎంఒ పాత్రపై సుప్రీం కోర్టు దోషారోపణ చేసింది. 2జీ స్కాంలో రాజా నిర్దోషి అని అనేక సందర్భాల్లో ప్రకటించిన ప్రధాని చివరకు సంకీర్ణ ధర్మం నిర్వర్తించడం వల్ల సిబిఐ దర్యాప్తు విషయంలో అలా వ్యవహరించవలసి వచ్చిందని పశ్చాత్తాప పడ్డారు. అవినీతి కుంభకోణాలపై నిష్పాక్షిక దర్యాప్తునకు సిబిఐ, సివిసి లాంటి సంస్థలు కేంద్రం ఆధీనంలో ఉంటే సాధ్యం కాదు. ఆ దర్యాప్తు సంస్థలని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలని పౌరసమాజం కొంతకాలంగా ఉద్యమిస్తోంది. అయితే అవి ఎన్నికల కమిషన్ లాగా స్వతంత్ర ప్రతిపత్తితో, లోక్‌పాల్ వ్యవస్థ, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థల సమన్వయంతో పనిచేస్తే మరింత ప్రయోజనం ఒనగూరుతుంది.

0 comments:

Post a Comment