Sunday

వాణిజ్య తారలే భారతరత్నాలా...?

ధనార్జన పెద్దగా లేని రంగాలలో అభిరుచితో ఆసక్తితో కృషిచేసి దేశానికి పేరు తెచ్చినవారిని భారతరత్నతో అయినా సత్కరించవచ్చును. చనిపోయినవారికి ఇవ్వకూడదని మొదటపెట్టుకున్న నిబంధన ప్రకారం మహాత్మాగాంధీకే భారతరత్న ఇవ్వలేకపోయాము. బ్రతికి ఉన్నారోలేదో తెలియని సందిగ్ధ స్థితి కారణంగా సుభాష్‌బోస్‌కు ప్రకటించిన భారతరత్నను వెనక్కి తీసుకున్నాము.

చనిపోయి మూడున్నర దశాబ్దాలు గడిస్తే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను భారతరత్నతో సత్కరించుకోలేకపోయాము. దేశానికే తలమానికంగా ఒక వ్యక్తిని గుర్తించడం అంటే, సామాన్యమైన విషయం కాదు. అది మనదేశం పాటిస్తున్న విలువలకు అనుగుణ్యమైన ఎంపిక అయి ఉండాలి. మరి ఈ భారతజాతి అత్యున్నత గౌరవాన్ని ఒక సెలబ్రిటీకి, తన వృత్తిని తాను ప్రతిభావంతంగా చేసుకుపోతున్న ఒక సినీనటుడి వంటి క్రీడాకారుడికి ఇవ్వబోతుంటే ఆ ప్రాధాన్యాన్ని ప్రశ్నించనక్కరలేదా?



జస్టిస్ మార్కండేయ కట్జు అంటే ముక్కుసూటితనానికి, కటువైన విమర్శలకు మాత్రమే కాక, ఎన్నో ప్రగతిశీలమైన, సాహసోపేతమైన తీర్పులకు కూడా పేరుపొందిన వారు. భారతీయ సమాజం పరివర్తనాదశ గురించి, అందులోని సమస్యల గురించి ఆయనకున్న అవగాహన విశేషమైనది. ప్రెస్‌కౌన్సిల్ చైర్మన్‌గా ఆయన మీడియా లోపాల గురించి, స్వయంనియంత్రణ ఆవశ్యకత గురించి మాట్లాడినప్పుడు, ఆ మాటలతో విభేదించేవారు సైతం ఆ అభిప్రాయాలను గౌరవిస్తూ మాట్లాడారు. 

మీడియా ప్రాధాన్యాల గురించి ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలపై మాత్రం జరగవలసినంత చర్చ జరగలేదు. సీనియర్ సినీనటుడు దేవానంద్ మరణవార్తకు జాతీయ పత్రికలు అవసరానికి మించి ప్రాధాన్యం ఇచ్చాయని, దేశంలో రైతుల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరుగుతుంటే, ప్రజాప్రాధాన్యం ఉన్న అనేక సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా, సెలబ్రిటీలవార్తల వైపు మొగ్గు చూపుతున్నాయని కట్జు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మరీ కొత్తవి కాకపోవడం కూడా చర్చ జరగకపోవడానికి కారణం కావచ్చు. 

ప్రెస్‌కౌన్సిల్ చైర్మన్ స్వయంగా అట్లా మాట్లాడడం మాత్రం కొత్త విషయమే. అభివృద్ధి, గ్రామీణ వ్యవహారాల పాత్రికేయులు పి.సాయినాథ్ కూడా అటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశరాజధానిలో జరిగిన ఒక ఫ్యాషన్ ఈవెంట్‌కు హాజరైన పాత్రికేయుల సంఖ్యను, ఒరిస్సాలోని కలహండి దుర్భిక్షప్రాంత స్థితిని రిపోర్టు చేయడానికి వెళ్లిన పాత్రికేయుల సంఖ్యను ఆయన పోల్చి మీడియా ప్రాధాన్యాల గురించి నిశితమైన విమర్శ చేశారు. 

మీడియా ఫలానా అంశం మీద తీసుకునే వైఖరి, ఫలానా రాజకీయపక్షం విషయంలో అనుసరించే విధానం వివాదాస్పదం కావడం ఇటీవలి కాలంలో పెరిగింది. కానీ, మొత్తంగా మీడియా సంఘటనలను, పరిణామాలను ప్రాధాన్యీకరించే ధోరణి గురించిన విమర్శకు ఇప్పటికీ పెద్ద చెల్లుబాటు లేదు. కట్జు అటువంటి వ్యవస్థాగత వివక్ష గురించి మాట్లాడారు. 

ఏవి ప్రధానమైన వార్తలో ఏవి కావో మీడియా స్వతంత్రంగా నిర్ణయించుకుంటుందని, దాని ప్రాధాన్యాలు దానివి మాత్రమేనని అనుకోవడం పొరపాటు. ప్రజలలో అభిప్రాయాలను కల్పించడంలో, స్థూలంగా ప్రధాన స్రవంతి అవగాహనలను కల్పించి, స్థిరం చేసి, పునరుత్పత్తి చేయడంలో మీడియా పాత్ర ప్రధానమైనదనడంలో సందేహం లేదు. కానీ, మీడియా విస్తరించిన తరువాత, తన పాఠకుల, ప్రేక్షకుల సామాజికార్థిక తరగతులను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యాలను నిర్వచించుకోవడం, సమాచారాన్ని మాత్రమే కాక తాను అనుకున్న పద్ధతిలో వినోదాన్ని ఆహ్లాదాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. 

పత్రికలలో అయితే, పరిణామాలను అర్థం చేసుకోవడానికి వీలైన విశ్లేషణలకు కొంత స్థలాన్ని కేటాయిస్తాయి, దృశ్యమాధ్యమాల్లో దానికి కూడా అవకాశాలు తక్కువ. సామాజికమైన మార్పుల్లో తాను క్రియాశీలమైన పాత్రధారినని మీడియా ఇప్పుడు అంతరాంతరాల్లో విశ్వసిస్తున్నదని నమ్మలేము. మీడియాసంస్థల వ్యాపార ప్రయోజనాలు, స్పర్థలు, వాటి వాటి రాజకీయ ప్రాధాన్యాలు వాటి విధానాలపై ప్రభావం చూపిస్తాయి. 

మొత్తంగా మీడియాకు శాస్త్రీయ దృష్టి ఉండదు కాబట్టి, సంఘటనలను వాటి క్రమంలో కాక విడివిడిగా రిపోర్టు చేస్తాయి. వర్తమాన చరిత్రలో ప్రాధాన్యమున్న పరిణామాలను సామాజిక పరిణామాలుగా కాక, వ్యక్తులు కేంద్రంగా జరిగే ఘటనలుగా భావిస్తాయి. అందుకని, మీడియాకు వ్యక్తులు కావాలి, వార్తలలోని వ్యక్తులు, పాఠకులకు, ప్రేక్షకులకు సుపరిచితులైన వ్యక్తులు, పాఠకుల, ప్రేక్షకుల సాధారణస్థాయి అభిరుచులకు లక్ష్యంగా ఉండగలిగే వ్యక్తులు కావాలి. 

ఈ వ్యక్తులను మీడియా మాత్రమే సృష్టించదు. సమాజంలోని వాణిజ్య, వ్యాపార వర్గాలకు, అధికాదాయ శిష్ట శ్రేణులకు ఈ వ్యక్తులు అవసరం. వారినే సెలబ్రిటీలు, పేజ్ త్రీ మనుషులనీ అంటున్నాము. వీరు ప్రజల్లోని సగటు సాంస్కృతిక అభిరుచులకు ఆలవాలంగా ఉంటారు. వీరు సినీహీరోలుగా, వ్యాపార ప్రకటనల్లో మోడల్స్‌గా, విజయానికి మారుపేరైన క్రీడాకారులుగా, సినీదర్శకులుగా, సంగీతకారులుగా, గాయనీగాయకులుగా సుప్రసిద్ధులైనవారు ఎవరైనా కావచ్చు. వీరు వారి వారి వృత్తిజీవితాలలో ప్రతిభావంతులు అయి ఉండవచ్చును. కానీ, వారి సామాజిక వ్యక్తిత్వాలు ప్రజలకు ఆసక్తిదాయకంగా ఉంటాయి. 

వారి వ్యక్తిగత జీవితం కూడా పెద్ద సమాచార వనరు అవుతుంది. రాజకీయనాయకులు, ఉద్యమనేతలు, సామాజిక సేవకులు- ఆకర్షించలేని వర్గాలకు ఈ సెలబ్రిటీలు మాట్లాడుకునే, కలగనే, అభిమానించే తారలు. దేవానంద్ కూడా అటువంటి ఒక తార. కాకపోతే, వ్యాపారసంస్కృతి ప్రస్తుత స్థాయికి ఇంకా చేరని బ్లాక్ అండ్ వైట్ కాలపు తార. అతను ప్రాతినిధ్యం వహించిన సినీసంస్కృతితో ఏదో ఒక రూపంలో అభిరుచిని పంచుకోవడం సగటుకు మిం చిన సంస్కారమున్న ప్రేక్షకులకు కూడా సాధ్యం. దాదాపు తొంభై ఏళ్ల వయస్సు చేరినా, ఇంకా ఉత్సాహంతో కళారంగంలో ఉన్నందుకు అతను వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. కట్జు చేసిన విమర్శకు దేవానంద్ పూర్తిగా సరిఅయిన దృష్టాంతమని అనుకోలేము. 

ఒక తారకు ప్రాధాన్యమివ్వడం మీడియా తప్పైతే, ప్రభుత్వంతో సహా వ్యవస్థలన్నీ కలిసి ఒక తారను సృష్టించినప్పుడు ఏమి చేయాలి? నెహ్రూ, అంబేద్కర్, చక్రవర్తుల రాజగోపాలాచారి, సివిరామన్, ఇందిరాగాంధీ వంటి మహామహులు స్వీకరించిన భారతరత్న గౌరవాన్ని క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఇవ్వాలని ప్రభుత్వమే నిబంధనలను సవరిస్తే, దాన్నెట్లా అర్థం చేసుకోవాలి? విశేష గౌరవానికి, గుర్తింపునకు సచిన్ తప్పనిసరిగా అర్హుడే. కానీ, అతను భారతరత్నం కాగలడా? 

ఒకనాడు జాతికి సేవ చేసిన వారికే భారతరత్న గుర్తింపు ఇవ్వాలన్న నిబంధన ఉండగా, ఇప్పుడు దాన్ని ఏరంగంలో అయినా విశేష ప్రతిభ కనబరచినవారికి కూడా ఇవ్వవచ్చునని సవరిస్తే జాతిరత్నాల స్థాయిని మనం పెంచుతున్నట్టా, తగ్గిస్తున్నట్టా? సచిన్ క్రికెట్ క్రీడకు చెందినవాడు. అతనికి ఆ ఆటలో అపారమైన ప్రతిభాపాటవాలున్నాయి, దేశం గర్వించదగ్గ క్రికెటర్ అతను, సందేహం లేదు. కానీ, క్రికెట్ ఒక వ్యాపారక్రీడ. అది దేశంలోని ఆటలన్నిటినీ అణగదొక్కి కార్పొరేట్ క్రీడగా తిష్ఠవేసుకుని కూర్చుంది. అందులో ప్రతిభకు విపరీతమైన ధనప్రతిఫలం లభిస్తుంది. జాతీయ జట్టులోని క్రికెటర్లు కోటీశ్వరులుగా మారిపోతారు. 

ఇప్పుడు ఐపిఎల్ వచ్చిన తరువాత ఈ క్రీడాకారులు వేలంలో అమ్ముడుపోయే సరుకులు. వీరు తమ రికార్డుల కోసం తప్ప దేశం కోసం ఆడినట్టు భావించగలమా? దేశంలో క్రీడల అభివృద్ధికి క్రికెటర్లు చేసిన దోహదం ఏమైనా ఉన్నదా? సచిన్, ధోనీ, సెహ్వాగ్ వంటి వారి విజయాలు ప్రేక్షకులను క్రీడాకారులుగా మారుస్తున్నాయా? జాతి ఆరోగ్యానికి, దారుఢ్యానికి దోహదం చేయవలసిన క్రీడారంగం ఇప్పుడు ఎటువంటి దుస్థితిలో ఉన్నది? ఈ ప్రశ్నలన్నీ వస్తాయనే కాబోలు, సచిన్‌తో పాటు హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ పేరుకూడా ప్రచారంలో పెడుతున్నారు. సచిన్‌కు ఇవ్వడానికి దారి సుగమం చేయడానికి మొదట ధ్యాన్‌చంద్‌కు ఇచ్చినా ఇవ్వవచ్చు. 

ధనార్జన పెద్దగా లేని రంగాలలో అభిరుచితో ఆసక్తితో కృషిచేసి దేశానికి పేరు తెచ్చినవారిని భారతరత్నతో అయినా సత్కరించవచ్చును. చనిపోయినవారికి ఇవ్వకూడదని మొదటపెట్టుకున్న నిబంధన ప్రకారం మహాత్మాగాంధీకే భారతరత్న ఇవ్వలేకపోయాము. బ్రతికి ఉన్నారోలేదో తెలియని సందిగ్ధ స్థితి కారణంగా సుభాష్‌బోస్‌కు ప్రకటించిన భారతరత్నను వెనక్కి తీసుకున్నాము. చనిపోయి మూడున్నర దశాబ్దాలు గడిస్తే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను భారతరత్నతో సత్కరించుకోలేకపోయాము. దేశానికే తలమానికంగా ఒక వ్యక్తిని గుర్తించడం అంటే, సామాన్యమైన విషయం కాదు. అది మనదేశం పాటిస్తున్న విలువలకు అనుగుణ్యమైన ఎంపిక అయి ఉండాలి. 

అంటే ఇప్పుడు సెలబ్రిటీలను నిర్మించే వ్యవస్థలలో ప్రభుత్వం కూడా చేరుతున్నదన్న మాట. వ్యసనమో అభిరుచో తెలియని స్థాయిలో వ్యాపించిన ఒక క్రీడాభిమానాన్ని, దాని చుట్టూ ఉన్న అపారమైన మార్కెట్‌ను గుర్తించి ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తున్నదన్న మాట. అంతర్జాతీయంగా మనకు స్వర్ణాలు తెచ్చిపెట్టిన హాకీ, విలువిద్య, పరుగుపందెం వంటి క్రీడలన్నిటినీ ఇది అవమానించడం కాదా? 

ఒక సినీతార మరణాన్ని పతాకశీర్షికలో పెడితే మీడియా ప్రాధాన్యాలను ప్రశ్నిస్తున్నాము. మరి ఈ భారతజాతి అత్యున్నత గౌరవాన్ని ఒక సెలబ్రిటీకి, తన వృత్తిని తాను ప్రతిభావంతంగా చేసుకుపోతున్న ఒక సినీనటుడి వంటి క్రీడాకారుడికి ఇవ్వబోతుంటే ఆ ప్రాధాన్యాన్ని ప్రశ్నించనక్కరలేదా? 

0 comments:

Post a Comment