Wednesday

సెంచరీ సెల్యూట్


మహిళా దినోత్సవ శతజయంతి వేడుకలు మిగతావాళ్లు ఎలా జరుపుకున్నారో గాని ఆంధ్రాయూనివర్సిటీ ఫైనార్ట్స్ విద్యార్థినులు 'చిత్రలేఖ' పేరుతో వర్ణరంజితంగా జరుపుకున్నారు. స్టూడెంట్స్ అంటే చిలిపితనం ఉరకలేసే టీనేజర్లు మాత్రమే కాదు, నడివయసు దాటిన గృహిణీమణులు కూడా!

వయసుతో సంబంధం లేకుండా ఫైనార్ట్స్ విభాగంలోకి విద్యార్థులను తీసుకునే సంప్రదాయానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. అందుకే దీనిలో పాల్గొన్న ఆర్టిస్టుల్లో ఎక్కువమంది మధ్యవ యసు దాటిన మహిళలే. పిల్లలు పెద్దయ్యాక వారికి కాస్త తీరిక చిక్కి వారంతా ఈ కోర్సులో చేరారు. ఆ అతివల్లో కొందరిని 'నవ్య' పలకరిస్తే సంతోషంతో ఉబ్బితబ్బియ్యారు. యాభైనాలుగేళ్ల వయసులో ప్రవేశ పరీక్ష రాసి సీటు సంపాదించుకున్నారు కామేశ్వరి. "మొదట్నుంచీ ఆర్ట్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అయితే పెళ్లి, సంసార బాధ్యతలు వచ్చి పడటంతో దాని గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది.

పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాక, యూనివర్సిటీ నిర్వహించిన ఆర్నెల్ల కోర్సు పూర్తి చేశాను. ఉత్సాహంగా అనిపించింది. దాంతో ఎంట్రన్స్ రాశాను. ఇక్కడికొచ్చాక భారతీయ చిత్రకళ చరిత్ర, మనస్తత్వ శాస్త్రం వంటివి పరిచయమయ్యాయి. రకరకాల ప్రింట్లు, శిల్పాల గురించి ఇదివరకు నాకేమీ తెలియదు. ఇప్పుడు వాటి గురించి కూడా నేర్చుకున్నాను. మనసులో దాచుకున్న కోరికను నెరవేర్చుకోవడానికి భగవంతుడిచ్చిన వరంలాగా అనిపిస్తోంది ఈ కోర్సు నాకు. ఇది పూర్తయ్యాక కొందరు కళాకారులతో కలిసి ఆర్ట్ గ్యాలరీ నడపాలన్నది నా ఆలోచన'' అంటున్నారామె.

ఇదో కొత్త ప్రపంచం
కడపలో పుట్టిపెరిగి భర్త ఉద్యోగం మూలంగా కొత్త ప్రాంతానికి వచ్చిన శ్రీలతది కూడా అదే కథ. పుట్టినూరు కాకపోవడం, ఇంటికే పరిమితం కావడంతో కొత్త స్నేహితులు, పరిచయస్తులూ ఎవరూ లేరామెకి. పెయింటింగ్ పట్ల ఆసక్తి మాత్రం పుష్కలంగా ఉండేది. "ఏదో ఇంట్లో ఉండటమే తప్ప ఎంట్రన్స్ రాసేనాటికి పెన్సిల్ పట్టుకోవడం కూడా చేతకాదు నాకు. అలాంటిది ఇప్పుడు కాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్స్ వేస్తున్నానంటే, ఎచింగ్ వంటి ప్రక్రియలు తెలుసుకున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదో కొత్త ప్రపంచం. వీలయితే ఆర్ట్‌లో పీజీ కూడా చేస్తాను'' అంటున్నారు శ్రీలత ఆనందంగా.

ఎన్ని రంగులో
పిల్లలిద్దరూ ఇంటర్ చదువులు పూర్తిచేసి కాలేజీలకెగిరిపోయాక సరోజకు కొత్త రెక్కలొచ్చినట్టు అయింది. "మా ఆయన ఇదే యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆయన ఇక్కడి వాతావరణం గురించి చెబుతుంటే నేను యూనివర్సిటీలో చదువుకోలేదే అనిపించేది. ఆ కొరతను ఈ కోర్సు తీర్చింది. ఎంట్రన్స్ ముందయితే నిద్రపట్టలేదంటే నమ్మండి. అంతకుముందు ప్రపంచమంటే ఇల్లే. ఇప్పుడు నా ప్రపంచంలో ఎన్ని రంగులో....'' అని సంబరపడుతున్నారు సరోజ.

భలే ఆలోచన
ఇంట్లో చీరల మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లు వేస్తూ కళాతృష్ణను తీర్చుకుంటున్న సుజాత ఆయిల్ పెయింటింగ్ నేర్పించే సంస్థలేమైనా ఉన్నాయా అని అన్వేషణ సాగించినప్పుడు ఫైనార్ట్స్ పట్టా పుచ్చుకోవచ్చనే ఆలోచన మనసులో మెదిలింది. థర్డ్ ఇయర్ చదువుతున్న సుజాత "ఉన్నట్టుండి కొత్త స్వాతంత్య్రం వచ్చినట్టుంది. ఆర్టిస్టుగా నాకు అంటూ ఒక పేరు వస్తుందన్న ఆలోచనే భలేగా ఉంది'' అన్నారు.

నవ దీపాలు
పంతొమ్మిదేళ్ల భార్గవీలత తండ్రి డ్రాయింగ్ ఉపాధ్యాయుడు కావడంతో ఆమెకు ఈ రంగం పట్ల ప్రాధమికమైన అవగాహన ముందే ఉంది. ఆర్ట్‌ను క్షుణ్ణంగా చదువుకుని ఫ్రీలాన్స్ ఆర్టిస్టుగా స్థిరపడాలని భార్గవి ఆలోచిస్తోంది. ఫైనార్ట్స్ రెండో ఏడాదిలో ఉన్న మృదుల చిన్నప్పుడే పెయింటింగ్‌లో ప్రతిభ చూపించి ప్రతిష్ఠాత్మక 'బాలరత్న', 'బాలశ్రీ' అవార్డులు అందుకుంది. గిరిజనుల జీవన విధానాన్ని చిత్రించడమంటే ఎంతో ఇష్టమంటున్న మృదుల డిగ్రీ పూర్తి చేశాక సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్‌గా స్థిరపడాలని ఉవ్విళ్లూరుతోంది.

"ఇన్నేళ్లలో మహిళలు చాలా దూరం ప్రయాణించారు. ఇవాళున్న స్థితికి చేరుకోవడానికి ఎన్నో కష్టనష్టాల్ని సహించారు. సమానత్వం కోసం వాళ్లు చేసిన ఉద్యమాలకు మహిళా దినోత్సవం ఒక ఊతకర్రగా నిలిచింది.

0 comments:

Post a Comment