Monday

ఉత్తర కొరియా ప్రియతమ నేత.. కిమ్ గుండె ఆగింది

అణు సామర్థ్యంతో అగ్రరాజ్యాలను సైతం వణికించి.. ఉత్తర కొరియాను అప్రతిహతంగా పాలించిన కిమ్ జోంగ్ ఇల్ మరణించారు. 69 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆయన మరణించినట్లు ఉత్తరకొరియా అధికార వార్తాసంస్థ కేసీఎన్ఏ తెలిపింది. శనివారం రైలు ప్రయాణంలో అధికారిక విధులు నిర్వర్తిస్తుండగా గుండె పనిచేయడం ఆగిపోయి మరణించారు. కానీ, సోమవారం వరకు ఈ విషయాన్ని ప్రకటించలేదు. రైలు ప్రయాణంలో ఉండగా విపరీతమైన శారీరక, మానసిక అలసట కారణంగా డిసెంబర్ 17న కిమ్ మరణించినట్లు ఉత్తర కొరియా రాజధాని నుంచి వచ్చిన ప్రత్యేక ప్రసారంలో అక్కడి అధికార వార్తా సంస్థ తెలిపింది.

18న జరిగిన సంపూర్ణ దేహ పరీక్ష (అటాప్సీ)లో మృతికి కారణాలను పూర్తిగా నిర్ధారించినట్లు తెలిపింది. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ వీధుల్లో ప్రజలు కన్నీటితో తమ 'ప్రియతమ నేత'కు కడపటి నివాళి అర్పించారు. కిమ్ జోంగ్ ఇల్‌కు వారసుడు ఎవరన్న విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా చిన్నకుమారుడు కిమ్ జోంగ్ ఉన్ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. సుమారు సంవత్సరం క్రితమే తన మూడో కుమారుడు కిమ్ జోంగ్ ఉన్‌ను వారసుడిగా ఇల్ ప్రకటించారు.

ఉన్ వయసు 20లలో ఉండొచ్చని అంచనా. ఆయన తరచూ అధికార పర్యటనలలో గడిచిన ఏడాది గా తండ్రి వెంటే ఉంటున్నారు. ఈనెల 28న అంత్యక్రియలు జరగనున్నాయి. 29 వరకు సంతాపదినాలుగా పాటిస్తారు. అణ్వాయుధాలను సొంతం చేసుకున్న ఈ దేశం అనిశ్చితిలో పడితే ఎలాగని ప్రపంచం మొత్తం చూస్తోంది. దక్షిణకొరియా ఇప్పటికే హై ఎలర్ట్ ప్రకటించింది. ఉత్తరకొరియా పరిణామాలను పరిశీలించి, అవసరమైతే సహకరించుకోడానికి వీలుగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, దక్షిణకొరియా అధ్యక్షుడు లీ మ్యుంగ్-బాక్ సంప్రదించుకున్నారు.

కిమ్ మరణంపై చైనా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తండ్రి, తాతలకు ఉన్నంత నాయకత్వ లక్షణాలు కిమ్‌జోంగ్ ఉన్‌కు ఉన్నాయా అనేది అనుమానమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. జోంగ్ ఇల్ తన తండ్రి నుంచి అధికారాన్ని పొందడానికి ముందు 14 ఏళ్ల పాటు అన్ని విషయాలూ నేర్చుకున్నారని, ఉన్ అలా చేయలేదని బ్రూస్ క్లింగర్ అన్నారు. ముఖ్యంగా 12లక్షల బలమైన సైన్యం తమ నేతగా ఎంతవరకు ఆమోదిస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

0 comments:

Post a Comment