Wednesday

అణు విద్యుత్తుపై అలక్ష్యం తగదు...


అవినీతి నిర్మూలనకు పూనుకున్నారు; ఆహార భద్రత కల్పించడానికి సిద్ధమయ్యారు; మరి అణు విద్యుత్తుపై అలక్ష్యం తగునా? ఒక్క కుడంకుళంలోనే కాక ఇతర ప్రదేశాలలో కూడా అణు విద్యుత్కేంద్రాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అణు విద్యుత్ ఉత్పాదన కార్యక్రమాన్ని మరింత చురుగ్గా అమలుపరిచే అంశాన్ని కేంద్రం గత కొద్ది నెలలుగా నిర్లక్ష్యం చేసింది. మన్మోహన్ ప్రభుత్వం ఆ విషయమై తన దృష్టిని కేంద్రీకరించవల్సిన సమయమాసన్నమయింది.

ఈ పరిస్థితుల్లో ప్రధాని మన్మోహన్ ఇటీవల మాస్కోలో రష్యా అధ్యక్షుడు ద్విమిత్రీ మెద్వెదేవ్, ప్రధాని వ్లాదిమిర్ పుతిన్‌తో జరిపిన వార్షిక శిఖరాగ్ర సమావేశం ఎజెండాలో అణు ఇంధన రంగంలో సహకారమే ప్రధానాంశంగా ఉండడం పూర్తిగా అర్థం చేసుకోదగిందే. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్కేంద్కాన్ని (కెఎన్‌పిపి) 1400 కోట్ల రూపాయల వ్యయంతో రష్యన్లే నిర్మించారు. ఉత్పాదన కార్యకలాపాలకు అది సిద్ధంగా ఉంది. అయితే కుడంకుళం ప్రాంత ప్రజల తీవ్ర ఆందోళన మూలంగా ఆ విద్యుత్కేంద్రంలోని 1000 మెగావాట్ల సామర్థ్యంకల రెండు రియాక్టర్లూ వృధాగా పడివున్నాయి.

కుడంకుళంలోని మొదటి రియాక్టర్‌ను పక్షం రోజులలోగా ప్రారంభిస్తామని, రెండో దాన్ని ఆరు నెలల అనంతరం క్రియాశీలం చేస్తామని మాస్కో శిఖరాగ్ర సమావేశం (డిసెంబర్ 15-17)లో రష్యన్ నాయకులకు ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు. కుడంకుళం ఆందోళనకారులే కాక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా మరింత తీవ్రంగా ప్రతిస్పందించడంతో మన్మోహన్ హామీ నెరవేరడం అనుమానాస్పదమేనని చెప్పవచ్చు. మరి ప్రధానమంత్రే స్వయంగా ఇచ్చిన హమీ నెరవేరనప్పుడు దేశానికి అంతర్జాతీయంగా ఇబ్బందులు నెలకొనకుండా ఉంటాయా?

మాస్కో శిఖరాగ్రంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటన కుడంకుళం ఆందోళన అనవసరమని, ఆ విద్యుత్కేంద్రం పూర్తిగా భద్రమైనదని స్పష్టం చేసింది. ఆందోళనకారులు తమ భద్రత, ఉపాధుల విషయమై వ్యక్తం చేసిన సందేహాలు, అపోహలన్నిటికీ అణు ఇంధనరంగ నిపుణులు స్పష్టమైన సమాధానాలిచ్చారని ప్రధాని తెలిపారు. అయితే కుడంకుళం నిరసనకారులు ప్రధాని ప్రకటనకు మరింతగా రెచ్చిపోయారు. తమ ఆందోళనను మరింత తీవ్రం చేశారు.

ఈ వ్యాసం రాస్తున్న సమయానికి ఆ ఆందోళన తమిళనాడు వ్యాప్తంగా కనీసం ఒక రోజు పాటు జరిగింది. ఈ సంవత్సరాంతంలోగా కె.ఎన్.పి.పి నుంచి యురేనియంను వేరే చోటికి తరలించాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కుడంకుళం ఆందోళనకారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ భవిష్యత్తు గురిం చి ఆందోళన చెందుతున్న కుడంకుళం ప్రజలతో 15 మంది సభ్యులు గల అణు ఇంధనరంగ నిపుణులు సమావేశమవక ముందే అణు రియాక్టర్‌ను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రధానికి రాసిన ఒక లేఖలో ముఖ్యమంత్రి జయలలిత 'ఆశ్చర్యాన్ని' వ్యక్తం చేశారు.

కారణాలేమిటో తెలియవు గాని ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి వి.నారాయణస్వామి ఈ లేఖ పట్ల తీవ్రంగా ప్రతిస్పందించారు. ధిక్కరిస్తున్న ఆందోళనకారులపై 'చర్య' తీసుకోవాలని కేం ద్రం ఎంతగా కోరినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని నారాయణస్వామి విమర్శించారు.

తాను సానుభూతి చూపుతున్న ఆందోళనకారులపై జయలలిత చర్య తీసుకుంటారని ఈ సహాయమంత్రి నిజంగా విశ్వసిస్తున్నారా? కుడంకుళంలోని సమస్య మౌలికంగా రాజకీయ పరమైనది. కనుక దానిని రాజకీయంగానే పరిష్కరించవలసివుంది. అణు ఇంధన రంగ నిపుణుల సలహాల ద్వారా అది పరిష్కారమయ్యేదికాదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే జయలలిత సహకారంతో మాత్రమే అది పరిష్కారమవుతుంది. మరి జయ, సహాయ మంత్రులతో గాని, అణు ఇంధన సంస్థ అధికారులతో గాని మాట్లాడడానికి ఇష్టపడరనే వాస్తవాన్ని న్యూఢిల్లీ తెలుసుకోవాలి. యూపీఏ ప్రభుత్వ అగ్రనేతలు తమకు తాముగా జయతో చర్చలు జరిపి తీరవల్సిందే.

కుడంకుళం ఆందోళన ఇలానే కొనసాగిన పక్షంలో రష్యన్లు భవిష్యత్తు గురించి కలవరపడే పరిస్థితి తప్పక వస్తుంది. కుడంకుళం 3, 4 రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టులపై ఇటీవలి మాస్కో శిఖరాగ్ర సమావేశంలో సంతకాలు జరగగలవని రష్యన్ నాయకులు ఆశించిన విషయం రహస్యమేమీ కాదు. కుడంకుళంలో అదనంగా మరో రెండు రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించిన 'నిబంధనలు, షరతులు' విషయమై అంగీకారం కుదిరిందని, సంబంధిత ఒప్పందంపై సంతకాలు త్వరలో జరుగుతాయని మాత్రమే రష్యా, భారత్‌ల సంయుక్త ప్రకటన పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితులలో మన దేశం ఇంతకంటే ముందుకుపోవడం అసాధ్యం. రష్యన్లకు అవకాశమిస్తే కుడంకుళంలో నాలుగు కాదు, ఎనిమిది రియాక్టర్లను ఏర్పాటు చేయగలరు. భారత్ ఎంత సుముఖంగా ఉన్నా అలా జరగడమనేది సాధ్యం కాదు. ప్రత్యామ్నాయ ప్రదేశాలలో ఆ రియాక్టర్లను ఏర్పాటు చేయవచ్చు. అయితే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అంగీకరించవల్సి వుంది.

ఇదిలా వుండగా కుడంకుళంలో మరో రెండు రియాక్టర్ల ఏర్పాటుపై భారత్-రష్యాల మధ్య అవగాహన, దాని అంతర్జాతీయ ప్రభావం, పర్యవసానాల దృష్ట్యా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరుదేశాలు స్పష్టంగా ప్రకటించక పోయినప్పటికీ 1980ల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం కుడంకుళంలో రెండు రియాక్టర్లపై రష్యా వైఖరిని ఆమోదించడం జరిగింది. తత్ఫలితంగా, ఇటీవల ఆమోదించిన అణు నష్టపరిహారాల బిల్లు పరిధిలోకి ఆ రెండు రియాక్టర్లు రావు.

అణు పరిహారాల విషయమై రష్యా, ఫ్రాన్స్‌ల కంటే అమెరికా ఎక్కువగా ఆందోళన చెందుతుంది. భారత్‌లో అపరిమిత అవకాశాలు ఉన్నందున పెట్టుబడులు పెట్టడానికి అమెరికా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే అణు నష్టపరిహారం చట్టం మూలంగా వెనుకాడుతున్నాయి. ప్రధాని మన్మోహన్ మాస్కోలో ఉన్నప్పుడే అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విలియం బర్న్స్ న్యూఢిల్లీ వచ్చారు. ఆ చట్టం విషయమై మన అధికారులతో చర్చలు జరిపారు. అణు సామాగ్రి సరఫరాదారుల షరతులను తాము పట్టించుకుంటున్న దృష్ట్యా తమ చట్టాలను ఆ కంపెనీలు అంగీకరించి తీరవల్సిందేనని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే భారత్-అమెరికా అణు ఇంధన సహకార ఒప్పందానికి అమెరికా పూర్తిగా కట్టుబడి లేదు.

వియన్నాలోని న్యూక్లియర్ సప్ప్లైయర్స్ గ్రూప్ ద్వారా వివిధ అణు సాంకేతికతలను అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగస్వాములుగాలేని దేశాలకు నిషేధిస్తూ కొత్త మార్గదర్శక సూత్రాలను జారీ చేయించింది. మరి మన దేశం ఆ ఒప్పందంలో భాగస్వామికాని విషయం తెలిసిందే. అయితే రష్యన్లకు ఈ ఆంక్షను అధిగమించే వెసులుబాటు ఉంది. భారతదేశపు అణు విద్యుత్కేంద్రాలలో ఉపయోగించే యురేనియంను తమ దేశంలో శుద్ధి చేయడానికి వారు సుముఖంగా ఉన్నారు. తద్వారా భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాన్ని గౌరవించడమే కాక, అంతర్జాతీయ బాధ్యతలను కూడా రష్యన్లు నిర్వర్తించగలుగుతారు.

0 comments:

Post a Comment