Pages

Saturday

భవనం పటిష్ఠంగా ఉంటేనే రుణం బ్యాంకులకు ఎన్‌డీఎంఏ మార్గదర్శకాలు: మర్రి శశిధర్ రెడ్డి

 భవన నిర్మాణానికి రుణాలు మంజూరు చేసేప్పుడు ఆ భవనం ఎంత పటిష్ఠంగా ఉంది అని కూడా పరిశీలించాలని అన్ని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. అన్ని నిబంధనలు పాటిస్తున్న భవనాలకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

భూకంపాలు, తుపానులకు కూలి పోకుండా ఉండేందుకు రూపొందించిన డిజైన్లు, నిర్ణీత ప్రమాణాలను భవన నిర్మాణంలో పాటించాలన్నారు. అగ్ని ప్రమాదాలకు సంబంధించి కూడా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. భారీ మాల్స్, ఆస్పత్రులు, బహుళ అంతస్తుల భవనాల నుంచి నివాస గృహాల వరకు అన్నీ ఈ నిబంధనలు పాటించాలని చెప్పారు. గతంలోని నిబంధనలను మరింత మెరుగుపరచి ఎన్‌డీఎంఏ మార్గదర్శకాలిచ్చిందన్నారు.

తాజాగా, భవన భద్రతలోనూ ఇంజనీర్లను కూడా బాధ్యులను చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ భవనం నిర్మించే వరకు మాత్రమే ఇంజనీర్లు బాధ్యత వహించే వారని, ఆ భవనం ప్రమాదానికి గురైన సమయంలో ఇంజనీర్లను నిలదీసేందుకు ప్రస్తుతం ఎలాంటి చట్టాలూ లేవని వివరించారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టి పెట్టిందని, త్వరలోనే ఇంజనీర్ల బిల్లును ప్రవేశపెట్టబోతోందన్నారు. ఇదేవిధంగా రియల్ ఎస్టేట్ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోందని, ఇవన్నీ ప్రజలకు మెరుగైన, భద్రతతో కూడిన నివాసాన్ని కల్పించేందుకు సహకరిస్తాయన్నారు. 

కాగా, అన్ని రాష్ట్రాల్లోనూ జాతీయ విపత్తు స్పందన దళాలు (ఎన్‌డీఆర్ఎఫ్) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రులందరికీ తాను లేఖలు రాశానని, అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రమే ముందుకు వచ్చాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్‌డీఆర్ఎఫ్ బృంద ఏర్పాటుపై సీఎంతో తాను చర్చించానని, అయితే భవిష్యత్తులో ఇది ఏర్పాటయ్యే అవ కాశముందన్నారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉండే తిరుమలలో విపత్తు నిర్వహణపై అధ్యయనానికి ఒక బృందాన్ని నియమించామని, దాని నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విపత్తు నిర్వహణలో ప్రపంచంలోనే ఉత్తమ దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని మర్రి చెప్పారు. ఇందులో భాగంగానే తొలిసారిగా భారీస్థాయిలో ఢిల్లీలో నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతమైందని మర్రి చెప్పారు. భూకంపాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, ఢిల్లీ ప్రజల భద్రతకు తాను హామీ ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో ఎన్‌డీఎంఏ సభ్యులు కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment