Pages

Tuesday

నేతాజీ భార్యకు ప్రణబ్ లంచం? బోస్ మరణంపై వివాదానికి తెరదించే యత్నం జపాన్ నుంచి అస్థికలు తెప్పించాలని డిమాండ్

నేతాజీ భార్య వద్దకు ప్రణబ్ దూత
'బ్లాంక్ చెక్' ఆఫర్
తాజా పుస్తకంలో సంచలనాత్మక సంగతులు


 'రైసినా హిల్స్'కు దగ్గరవుతున్న ప్రణబ్ ముఖర్జీని మరో వివాదం చుట్టుముడుతోంది. 'నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారు' అనే సిద్ధాంతం నిజమని నిరూపించేందుకు... ఆయన గీత దాటి వ్యవహరించారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. చివరికి... నేతాజీ కుటుంబ సభ్యులకే 'లంచం' ఆఫర్ చేశారనే సంగతి ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్... ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి! 1897 జనవరి 23న జన్మించారు. ఇప్పటికి 125 సంవత్సరాలు గడిచాయి! ఆయన ఉన్నారా? మరణించారా? 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని చెబుతారు! కానీ... భారత ప్రభుత్వం దీనిని అధికారికంగా «ద్రువీకరించలేదు.

జపాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు మాత్రం నేతాజీ మరణించారని, ఆయన అస్థికలు తమ దగ్గర ఉన్నాయని చెబుతున్నారు. 'వచ్చి తీసుకెళ్లండి' అని పదే పదే భారత్‌ను కోరారు. ఈ వివాదం 'కాబోయే రాష్ట్రపతి' ప్రణబ్ ముఖర్జీని చుట్టుకుంటోంది. 'నేతాజీ మరణంపై సందేహాలకు' తెరదించేందుకు ఆయన ప్రయత్నించారని, దీనికోసం బోస్ సతీమణి ఎమ్లీకి 'బ్లాంక్ చెక్' ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వెలువడుతున్నాయి. మాజీ జర్నలిస్టు అనుజ్ థార్ రాసిన 'యాన్ ఎలాబరేట్ కవరప్' అనే పుస్తకంలో ఈ సంచలనాత్మక సంగతులు ఎన్నో ఉన్నాయి. అందులోని అంశాలను పరిశీలిస్తే...

1995లో... కేంద్రంలో పీవీ నరసింహరావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అదే సమయంలో... జపాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకువెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంపై పీవీ సర్కారులో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అస్థికలు తేవాలని ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని విదేశాంగ శాఖ, అవసరం లేదని శివరాజ్ పాటిల్ నేతృత్వంలో ఉన్న హోం శాఖ అభిప్రాయ పడ్డాయి.

చివరకు నేతాజీ అస్థికలుగా చెబుతున్న వాటిని భారత్‌కు తేవొద్దని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అయితే... నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారా? లేదా? అవి నిజంగానే నేతాజీ అస్థికలా? అనే మీమాంసకు తెరదించాలని ప్రణబ్ భావించారు. జపాన్‌కు వెళ్లారు. అట్నుంచి అటే... జర్మనీ వెళ్లి బోస్ సతీమణి ఎమ్లీ, కూతురు అనితలను కలిశారు. ఆ తర్వాత భారత్ వచ్చారు. నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకువెళ్లడానికి ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు ప్రకటించారు. కానీ... అక్కడ జరిగింది వేరు!

మైండ్ బ్లాంక్... చెక్!
ప్రణబ్ ప్రతినిధి ఒకరు ఎమ్లీని కలిశారు. 'జపాన్‌లో ఒక దేవాలయంలో ఉన్న నేతాజీ అస్థికలను భారత్‌కు తిరిగి తీసుకువెళ్లటానికి సహకరించండి' అని ఆమెను కోరారు. ఆమె చేతిలో ఒక బ్లాంక్ చెక్ పెట్టారు. 'ఎంత సొమ్ము కావాలంటే అంత సొమ్ము... మీకు నచ్చిన కరెన్సీలో రాసుకోండి' అని ఆఫర్ ఇచ్చారు. దీంతో ఎమ్లీ ఆగ్రహంతో ఊగిపోయారు. బ్లాంక్ చెక్‌ను ముక్కముక్కలుగా చింపి విసిరేసారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె మరణించారు. ఈ సంఘటన గురించి నేతాజీ ముని మేనల్లుడు సూర్య కుమార్ బోస్ తన డైరీలో రాసుకున్నారు.

ఆయన ఏమన్నారంటే...
"1995 అక్టోబర్ 20. రాత్రి పదిన్నర అయింది. ఆంటీ (నేతాజీ సతీమణి) అగ్స్‌బర్గ్ నుంచి నాకు కాల్ చేసింది. ఆమె ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు గొంతు వినగానే తెలిసిపోయింది. ప్రణబ్ ముఖర్జీ రేపు (అక్టోబర్ 21) తన దగ్గరకు వస్తున్నారని చెప్పింది. నేతాజీ అస్థికలుగా భావిస్తున్న వాటిని జపాన్ నుంచి ఇండియాకు తీసుకువెళ్లడానికి తనను, అనితను ఒప్పించటానికే ప్రణబ్ వస్తున్నారని కూడా చెప్పింది. దీనికి అంగీకరించినట్లు తనను ఒక పత్రం మీద సంతకం చేయాలని ప్రణబ్ కోరారని ఆంటీ చెప్పింది. అక్టోబర్ 21వ తేదీన ప్రణబ్ వచ్చారు. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారని తాను నమ్మడం లేదని.. జపాన్‌లో ఉన్నవి ఆయన అస్థికలు కావని ఆంటీ ప్రణబ్‌కు స్పష్టం చేశారు'' అని సూర్యకుమార్ బోస్ తన డైరీలో రాసుకున్నారు.

అసలు విషయం ఇదికాగా... అస్థికలు భారత్‌కు తీసుకువెళ్లడానికి ఎమ్లీ అంగీకరించినట్లుగా ప్రణబ్ ప్రకటించారు. సూర్యకుమార్ బోస్ ఈ విషయమై ఎమ్లీతో మాట్లాడారు. "నేను ఎలాంటి పత్రంపైనా సంతకం చేయలేదని ఆంటీ చెప్పింది. ప్రణబ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం, ప్రణబ్ ఎందుకిలాంటి ప్రచారం చేస్తున్నారో తనకు తెలియడం లేదని ఆవేదన చెందింది'' అని సూర్యకుమార్ తన డైరీలో పేర్కొన్నారు. 'యాన్ ఎలాబరేట్ కవరప్' పుస్తకంలో పేర్కొన్న విషయాలే నిజమైతే... ప్రణబ్ ఓ అబద్ధాలకోరు! 'లక్ష్యం' కోసం ఇచ్చేందుకూ వెనుకాడరు! రాష్ట్రపతి పదవికి అడుగు దూరంలో ఉన్న సమయంలో విడుదలైన ఈ పుస్తకం ప్రణబ్‌దాకు చిక్కులు తేవడం ఖాయం!

No comments:

Post a Comment