Pages

Monday

ఇస్రో మాజీలపై నిషేధం.. పునరాలోచనలో కేంద్రం! వారు లేవనెత్తిన అంశాలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధమే మంత్రి నారాయణ స్వామి వెల్లడి ప్రధాని తక్షణం జోక్యం చేసుకోవాలి: మాధవన్ నాయర్


 'యాంత్రిక్స్-దేవాస్' కుంభకోణం నేపథ్యంలో.. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలకు కేంద్రానికి మధ్య ఏర్పడ్డ వివాదం సద్దుమణుగుతున్నట్లు కనబడుతోంది. ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ సహా నలుగురు అంతరిక్ష శాస్త్రవేత్తల మీద విధించిన నిషేధంపై తాము పునరాలోచిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సంకేతాలిచ్చింది. మాధవన్ నాయర్ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పీఎంవో వ్యవహారాల సహాయ మంత్రి వి.నారాయణ స్వామి ఆదివారమిక్కడ తెలిపారు. "ప్రత్యూష్ సిన్హా ప్యానెల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాత్రమే ఆ శాస్త్రవేత్తలపై కేంద్రం చర్యలు తీసుకొంది. 

అంతే తప్ప వారిపై కేంద్రానికి ఎలాంటి వ్యతిరేకతా లేదు. శాస్త్రవేత్తలను ప్రభుత్వం గౌరవిస్తుంది. ఆయన (మాధవన్ నాయర్) కొన్ని అంశాలను లేవనెత్తారు. వాటిన్నింటినీ పరిగణనలోకి తీసుకొనేందుకు మేం సన్నద్ధంగా ఉన్నాం. వారి అభిప్రాయాలను వినేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని చెప్పారు. ప్రభుత్వ పదవులు ఏవీ చేపట్టకుండా ఈ శాస్త్రవేత్తలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తారా? అని అడగ్గా.. "దీన్ని అప్పుడే నేను ఎలా చెప్పగలను? తొలుత వారిని వారివారి అభిప్రాయాలను చెప్పనివ్వండి.. చూద్దాం'' అని బదులిచ్చారు. 

కాగా.. ఇదే అంశంపై మాధవన్ నాయర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పదవులు చేపట్టకుండా తమపై నిషేధం విధించిన వ్యవహారంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తక్షణం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. "మాపై నిషేధం విధిస్తూ.. పీఎంవోలో ఎవరు నిర్ణయం తీసుకున్నారో నాకు తెలీదు. కానీ.. నేను చేసిన నేరమేంటో నాకు చెప్పకుండా మాపై నిషేధం విధించడం అర్థరహితం. దీనిపై ప్రధాని తక్షణం దర్యాప్తు జరపాలి'' అని కోరారు.

No comments:

Post a Comment