Pages

Wednesday

నల్లధనం ప్రకంపనలు ఆ 25 లక్షల కోట్లను వెనక్కి రప్పించాలి నల్లధన కుబేరుల వివరాలు వెల్లడించాలి

విరుచుకుపడిన విపక్షాలు
వారిలో మా పేర్లున్నా బయటపెట్టొచ్చు
శ్వేతపత్రం ప్రకటించండి: అద్వానీ
మేం సిద్ధమే.. పేరు ్ల వెల్లడించం: ప్రణబ్
మూజువాణి ఓటుతో వీగిన వాయిదా తీర్మానం
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: నల్లధనం అంశంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. బుధవారం దీనిపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరిగింది. విదేశీ ఖాతాల్లోకి అక్రమంగా తరలించిన దాదాపు రూ.25 లక్షల కోట్లను వెనక్కి రప్పించాలంటూ పట్టుబట్టాయి. నల్లధన కుబేరు ల వివరాలు బయటపెట్టాలని బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ డిమాండ్ చేశారు. ఆయన ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. నల్లధనం వివరాలపై శ్వేతపత్రం సమర్పించాలన్న అద్వానీ డిమాం డ్‌కు కేంద్రం అంగీకరించింది. బ్లాక్‌మనీని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో వివరించాలని నిలదీశారు.

ఈ అంశంపై ఏ ఒక్క విషయాన్ని దాచిపెట్టడానికి వీల్లేదని సభలోనే ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీని ఉద్దేశిస్తూ అన్నారు. 'మీ దగ్గర ఉన్న నల్లధన కుబేరుల పేర్లు బయటపెట్టండి. మీ నోటి నుంచి ఆ వివరాలు వెల్లడి కాకుండా.. వికీలీక్స్ యజమాని అసాంజ్ ద్వారా అవి బయటకొస్తే మాత్రం అ్రవమానకరమే' అని అద్వానీ అన్నారు. నల్లధనంపై వాయిదా తీర్మానాన్ని అనుమతించారంటే ప్రభుత్వం తన వైఫల్యాన్ని అంగీకరించినట్టేనని చెప్పారు. ప్రస్తుత ప్రధాని, నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ హయాంలో సరళీకరణ విధానాలు ప్రవేశించిన తరువాతే నల్లధనం పెరిగిపోయిందని ఆరోపించారు.

విదేశాలకు డబ్బు తరలించిన 16 మంది పేర్లను బయటపెట్టకుండా ఎందుకు వారిని రక్షిస్తున్నారని ప్రశ్నించారు. విదేశీ ఖాతాలకు డబ్బు తరలించిన 782 మంది పన్ను ఎగవేతదారుల పేర్లను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందన్నారు. 'ఎవరినీ ఉపేక్షించొద్దు. మా పార్టీ వాళ్ల పేర్లున్నా బయటపెట్టండి' అని అద్వానీ డిమాండ్‌చేశారు. డిసెంబర్ 9వ తేదీని అవినీతి వ్యతిరేక దినంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. ఎన్డీఏ హయాంలో నల్లధనం నివారణకు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విమర్శలకు జవాబిస్తూ.. 2003లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుగులోకి తెచ్చిందన్నారు. బ్లాక్‌మనీ వల్ల ఉగ్రవాదానికి ఊతం లభిస్తోందని ఆరోపించారు.

పన్ను రేటు ఎక్కువ మొత్తంలో ఉండటమే నల్లధనం పోగు పడటానికి ఓ కారణమన్నారు. నల్లధనంపై కాకిలెక్కలు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ఓ వైపు వివరాలు తెలుసుకునే ప్రక్రియ నడుస్తుండగా పేర్లు ఎలా బయటపెడతారని ప్రశ్నించారు. బ్లాక్‌మనీపై శ్వేతపత్రం సమర్పించేందుకు సిద్ధమేనని ప్రకటించారు. భారత్ నుంచి మారిషస్‌కు తరలే పెట్టుబడుల విశ్వసనీయతను ప్రశ్నించగలిగే ఆదాయపన్ను సర్క్యులర్ ఒక దానిని 2001 జూలైలో ఎన్డీఏ సర్కారు ఉపసంహరించిందని మనీష్ తివారీ గుర్తుచేశారు. దీనిపై కొంత సేపు రభస జరిగింది. ఆయన ఆరోపణలను బీజేపీ సభ్యుడు, నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌సిన్హా ఖండించారు.

మన్మోహన్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే భారత్‌లో ఎఫ్‌డీఐలు, ఇతర పెట్టుబడులకు మార్గం సుగమమైందని వివరించారు. దీనికి తివారీ అడ్డుతగులుతూ.. ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలోనే పన్ను ఎగవేతదారుడు హసన్అలీ ఆస్తులు అమితంగా పెరిగిపోయాయని ఆరోపించారు. అమెరికా, కొన్ని దేశాలు బ్లాక్‌మనీని వెనక్కి రప్పించగలిగినప్పుడు, మనమెందుకు ఆ పని చేయలేకపోతున్నామని శరద్‌యాదవ్(జేడీ-యూ), సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ములాయంసింగ్ యాదవ్ నిలదీశారు. నల్లధనాన్ని రప్పించేందుకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని వాసుదేవ్ ఆచార్య(సీపీఐ) కోరారు. హసన్అలీ, కాశీనాథ్ తపూరియా తదితరులు పెద్ద మొత్తాల్లో బ్లాక్‌మనీని విదేశాలకు తరలించారని కల్యాణ్ బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్) పేర్కొన్నారు.

నల్లధనానికి అడ్డుకేట్టేది?: నామా
నల్లధనాన్ని అరికట్టడంలో, అడ్డుకట్ట వేయటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. నల్లధనంపై బుధవారం లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంగా మాట్లాడారు. నాటి బోఫోర్స్ కుంభకోణం నుంచి నేటి స్విస్ బ్యాంకు ఖాతాల వరకు వివరాలేవీ బయట పడనివ్వకుండా, సంబంధిత అక్రమార్కులను ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు. బోఫోర్స్, హర్షద్ మెహతా, 2జీ స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణాలను ఆయన ప్రస్తావించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష కోట్ల కుంభకోణానికి సంబంధించి తాము గతంలోనే 'రాజా ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని కూడా ప్రచురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

No comments:

Post a Comment